ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి

- July 04, 2026 , by Maagulf
ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు కార్యక్రమాల్లో భారత ప్రభుత్వం తరఫున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొంది. టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్) హాజరై, భారతదేశం తరఫున ఘన నివాళులు అర్పించారు. భారత ప్రభుత్వం మరియు దేశ ప్రజల పక్షాన తమ ప్రగాఢ సంతాపాన్ని, గౌరవాన్ని ఇరాన్‌కు తెలియజేసినట్లు కేంద్ర మంత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు.

భారత్-ఇరాన్ సంబంధాల ప్రాధాన్యత
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కూడా భారత్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరుకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ మైత్రిని, ప్రజల మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ద్వైపాక్షిక సంబంధాలే ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక బంధాలకు బలమైన పునాది అని స్పష్టం చేసింది.

ఆరు రోజుల పాటు అంతిమ సంస్కారాలు
టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని మొసల్లా ప్రార్థనా మందిరంలో శని, ఆదివారాల్లో (4, 5 తేదీల్లో) ఖమేనీ వీడ్కోలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత:

  • జులై 6: టెహ్రాన్‌లో అంత్యక్రియల ఊరేగింపు.
  • జులై 7: ఖోమ్ నగరంలో ప్రత్యేక ఊరేగింపు.
  • జులై 9: మషద్‌లోని ప్రసిద్ధ ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అంతిమ సంస్కారాలు, ఖనన ప్రక్రియ పూర్తి కానున్నాయి.

కాగా, అంతకుముందే భారత ప్రభుత్వ ప్రతినిధిగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీని కలిసి, సంతాప పుస్తకంలో సంతకం చేయడం ద్వారా భారత్ తన సంతాపాన్ని ముందుగానే ప్రకటించిన విషయాన్ని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా గుర్తుచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com