బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 35మంది మృతి

- June 05, 2022 , by Maagulf
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 35మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా 450 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చిట్టగ్యాంగ్ లోని ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంటైనర్ డిపోలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిట్టగాంగ్‌లోని సీతాకుందలో ఉప జిల్లాలోని కడమ్‌రాసుల్ ప్రాంతంలోని బీఎమ్ కంటైనర్ డిపోలో మంటలు చెలరేగాయి.

మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలను అదుపు చేసే క్రమంలో 40 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు పది మంది పోలీసులు కూడా గాయపడ్డారని, వారిలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మరణించినట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. రసాయనాలు కలిగి ఉన్న చాలా కంటైనర్లు పేలడం వల్లనే అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. సుమారు 19 అగ్నిమాపక యూనిట్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించాయి.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 35 మృతదేహాలు బయటపడ్డాయి. ఆ మృతదేహాలను మార్చురీకి తరలించారు. గాయపడిన వారు సైనిక ఆస్పత్రి, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే పేలుడు శబ్దాలు కొన్ని కిలో మీటర్లు వరకూ వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయని, శిథిలాలు అరకిలోమీటర్లు దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయని స్థానిక మీడియాకు స్థానికులు తెలిపారు. పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాకపోవటంతో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com