భారత్‌లో మళ్లీ కరోనా అలజడి..

- June 05, 2022 , by Maagulf
భారత్‌లో మళ్లీ కరోనా అలజడి..

న్యూ ఢిల్లీ: భారత్‌లో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల ముందు వరకు 2వేలకు అటు ఇటుగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ 4వేలు దాటింది. 24 గంటల్లో దేశంలో 4వేల 270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జూన్ చివరి నాటికి ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సైంటిస్టుల అంచనాలు నిజం చేస్తూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనాకు కేరాఫ్ గా నిలిచే మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అటు సౌతిండియా కరోనా హాట్ స్పాట్స్ లో ఎప్పుడూ ముందుండే కేరళలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలోనూ ముందుగా ఈ రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు కల్లోలం సృష్టించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. అక్కడ ఒక్కరోజే 1300లకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. నిన్న నమోదైన కేసుల్లో ఒక్క ముంబైలోనే 889 కేసులు నమోదయ్యాయి. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులతో పాటు మరణాలు కూడా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.

దీంతో రాష్ట్రలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆడిటోరియంలు, స్కూళ్లు, కాలేజీలు లాంటి ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అయితే, మాస్కు ధరించనంత మాత్రాన ఎవరిపైనా చర్యలు తీసుకోబోమని, కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్కు పెట్టుకోవడం శ్రేయస్కరం అన్నారు. అలాగే టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్లను వేగవంతం చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com