బంగారం దిగుమతి సుంకం పెంచిన భారత ప్రభుత్వం

- July 02, 2022 , by Maagulf
బంగారం దిగుమతి సుంకం పెంచిన భారత ప్రభుత్వం

న్యూ ఢిల్లీ: బంగారం పై కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10.75 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,440 పెరిగి, రూ.51,957గా ఉంది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,690గా ఉంది.

రాబోయేది పండుగల సీజన్ కాబట్టి, ఈ సమయంలో బంగారం ఎక్కువగా దిగుమతి అవుతుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ (31.10గ్రాములు) బంగారం ధర 1,800 డాలర్లకు దిగువనే ఉంది. దీంతో దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మన దేశంలోకి 842.28 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. ఈ ఏడాది మేలో బంగారం దిగుమతులు పెరిగాయి. మేలో 107 టన్నులు దిగుమతి అయ్యింది.జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్లు అంచనా. బంగారం దిగుమతి పెరిగితే, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ద్రవ్యలోటు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

బంగారం దిగుమతిపై 7.5 శాతం ఉన్న బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్‌ను 12.5 శాతానికి పెంచారు. ‘‘ప్రస్తుతం దేశంలో బంగారం ఉత్పత్తి జరగడం లేదు. బంగారం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్లే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్లే బంగారం దిగుమతిని తగ్గించాలనే ఉద్దేశంతో సుంకాన్ని పెంచాం’’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారంపై పన్నులు, ధర 12.5 శాతం ఎక్కువ కావడం వల్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com