తెలంగాణ సర్కారు పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- October 11, 2022
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం తెలంగాణ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు తక్షణమే పోస్టింగ్లు ఇవ్వాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో చివరి అవకాశం ఇస్తున్నామన్న ధర్మాసనం… 2 వారాల్లోగా జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక అమలు అయ్యిందా?, లేదా? అన్న విషయంపై ఈ నెల 31న మరోమారు సమీక్ష చేపట్టనున్నట్లు కూడా సుప్రీంకోర్టు తెలిపింది.
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించకుండా తమ జీవితాలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగుల విభజనకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులకు ఏపీ పోస్టింగ్లు ఇవ్వగా… ఏపీ నుంచి రిలీవ్ అయిన వారిలో కొందరికి పోస్టులు ఇచ్చిన తెలంగాణ ఇంకో 84 మందికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. దీనిపై 84 మంది ఉద్యోగులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోర్టుల ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలగజేసుకున్న ధర్మాసనం… ఉద్దేశపూర్వకంగానే కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే… కోర్టు ధిక్కరణ కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. 84 మంది ఉద్యోగులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్
- 8వేల మంది పై మెటా వేటు!
- ప్రారంభమైన కైలాస్ మానససరోవర్ యాత్ర
- నార్వే పర్యటనలో ప్రధాని మోదీ బిజీ బిజీ
- సౌదీ, యూఏఈలపై డ్రోన్ దాడులను ఖండించిన ఎంపీలు..!!









