భాష, కళలు, సంస్కృతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత-వెంకయ్యనాయుడు
- December 05, 2022
చెన్నై: భాష, కళలు, సంస్కృతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఘంటసాల వంటి మహనీయులకు అదే నిజమైన నివాళి అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.భారతీయులు సంగీతాన్ని వినోద సాధనంగానే గాక, విజ్ఞాన సాధనంగానూ చూశారన్న ఆయన, సంగీతానికి ఎన్నో మానసిక సమస్యలను దూరం చేయగల శక్తి ఉందని, ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని చెన్నైలో కేంద్ర సాంస్కృతిక శాఖ, కళాప్రదర్శిని ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నాదోపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న ఘంటసాల, ప్రజల మనసుల్లో స్వరంజీవిగా నిలిచారని, వారు శతాబ్ధి గాయకుడని పేర్కొన్నారు.
గాయకుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవటమే గాక, ఘంటసాల స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్న విషయం చాలా మందికి తెలియదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో వారి శతజయంతి రావటం, వారి దేశభక్తిని స్మరించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. చిన్నతనం నుంచి అనేక ఆటుపోటుల మధ్య మొక్కవోని దీక్షతో సంగీత ప్రపంచంలో ఆదర్శనీయంగా ఎదిగిన ఘంటసాల జీవితం యువతకు ఆదర్శనీయమైనదన్న ఆయన, వారి స్ఫూర్తితో యువత సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఘంటసాల కోడలు పార్వతి రవిని అభినందించిన ఆయన, వారసత్వమంటే ఇదేనని, పెద్దల జవసత్వాలను, వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవటమే అని తెలిపారు. ఓ కళాకారుని జయంతి సందర్బంగా మరెంతో మంది కళాకారులను గౌరవించుకోవటం చక్కని సంప్రదాయమని తెలిపారు.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అన్న పెద్దల మాటలను ఉదహరించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, అమ్మ పలుకుల్లో మాతృభాష, అమ్మ లాలి పాట ద్వారా సంగీతం ప్రతి ఒక్కరికీ చిన్నతనంలోనే పరిచయమౌతాయన్నారు. దేశదేశాల సంస్కృతి, సంప్రదాయాలు, సాంఘిక జీవనాన్ని బట్టి సంగీతంలో అనేక మార్పులు చోటు చేసుకున్నా, ఆస్వాదించే మనసు మాత్రం అందరికీ ఒక్కటేనని పేర్కొన్నారు.త్యాగరాజ స్వామి,జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు వంటి ఎందరో మహనీయులు సంగీత ఉపాసనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న ఆయన, సినిమా సంగీతాన్ని ఆస్వాదించదగినదైతే... శాస్త్రీయ సంగీతం అనుభవైకవేద్యమైనదని తెలిపారు.
జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఘంటసాల తనకు జీవితాన్ని ఇచ్చిన వారిని మరువలేదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, "ఏ తల్లి తొలి ముద్ద వేసిందో... ఆమె ఆశీర్వాద ఫలమే ఈ వైభవం" అన్న ఘంటసాల మాటలను గుర్తు చేశారు. గురువైన పట్రాయని సీతారామ శాస్త్రి ని జీవితాంతం గుర్తు పెట్టుకుని గౌరవించుకున్న వారి స్ఫూర్తి ఈ తరం కళాకారులకు ఆదర్శం కావాలని సూచించారు. జీవితంలో ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, చదువు చెప్పిన గురువును మరువకూడదని తాను ఎప్పుడూ చెప్పే మాటల్లోని అంతరార్థం ఇదేనన్న ఆయన, మన ఉన్నతికి కారణమై చేయూతనిచ్చిన వారిని గుర్తు పెట్టుకోవటమే గాక, ఔత్సాహికులకు చేయూతను అందించటం మనందరి ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.
సినిమా పాటలతోనే గాక భక్తిగీతాలతో ఘంటసాల ప్రేక్షకాభిమానం సంపాదించుకున్నారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారు చొరవ తీసుకుని రూపొందించిన 108 శ్లోకాల భగవద్గీత ఆడియో సామాన్యులకు సైతం ఆ మహోన్నత గ్రంథాన్ని చేరువ చేసిందని తెలిపారు. రేడియో, గ్రామ్ ఫోన్ రికార్డుల కాలంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పుష్పవిలాపం పద్యాలు ఘంటసాల గొంతులో కరుణ రసాత్మకంగా శ్రోతల్ని పులకింపజేశాయన్న ఆయన, వారి స్వరానికి భారతప్రభుత్వ అందించే పద్మశ్రీ గౌరవం సహా, అనేక అవార్డులు దాసోహమయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుధారాణి రఘుపతి,ఎల్.ఆర్.ఈశ్వరి, నందిని రమణి, అవసరాల కన్యాకుమారి, తోట తరణి, శివమణి, తయాంబన్ ఘంటసాల పేరిట ఏర్పాటు చేసిన అవార్డులను ముప్పవరపు వెంకయ్యనాయుడు అందజేశారు. కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి మనో తంగరాజన్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డా.సంధ్య పురేస, ఘంటసాల కుటుంబ సభ్యులు, అభిమానులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









