ఖతార్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

- January 21, 2023 , by Maagulf
ఖతార్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

దోహా: "సంక్రాంతి" తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ "పెద్ద పండుగ" ను ఖతార్ దేశం లోని "ఆంధ్ర కళా వేదిక", వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించుకుంది.  

తెలుగు నేపథ్య గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు తోడుగా సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శిరీష, అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ షో "ఢీ(DHEE)" ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు మరియు మాధురి లు తమ పాటలతో, ఆటలతో మరియు మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు. 
 
ముఖ్య అతిధిగా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి విచ్చేసిన మొదటి కార్యదర్శి (సాంస్కృతిక, విద్య & సమాచారం) సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

వినోద్ నాయర్- A/ ప్రెసిడెంట్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), శ్రీ కృష్ణ కుమార్ -ప్రధాన కార్యదర్శి, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), (ICBF)మెడికల్ అసిస్టెన్స్ హెడ్ శ్రీమతి రజని మూర్తి, AKV సలహామండలి చైర్మన్ సత్యనారాయణ,  తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గద్దె, హరీష్ రెడ్డి ఇతర ప్రముఖులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ  కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ , విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి రమేష్ మరియు మెసయిద్ టీంకి, వేదిక ప్రాంగణ అలంకరణకు సహకరించిన మహిళలందరికీ మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి కుమారి ఖ్యాతి మరియు కుమారి అనన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా  చూడామణి మరియు సుధ వారి వెన్నుండి సహకరించారు.కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక ప్రాంగణం అలంకరణ, బొమ్మల కొలువు, గొబ్బిళ్ళు, ముగ్గులు,  చిన్నారుల నాట్యాలు, రుచికరమైన సాంప్రదాయ తెలుగింటి భోజనం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com