భారత వ్యక్తిని పొడిచి చంపిన పాకిస్తానీ..

- February 15, 2023 , by Maagulf
భారత వ్యక్తిని పొడిచి చంపిన పాకిస్తానీ..

షార్జా: షార్జాలో ఘోరం జరిగింది.భారత వ్యక్తిని ఓ పాకిస్తానీ  కత్తితో పొడిచి చంపేశాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన షార్జా పోలీసులు గంటల వ్యవధిలోనే హంతకుడైన పాకిస్తాన్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయుడికి, పాకిస్తానీకి మధ్య చోటు చేసుకున్న చిన్న ఘర్షణ కాస్త ఇలా ఒకరి మృతికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. షార్జా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్జాలోని బు తినా  అనే ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి 12.30గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వ్యక్తి స్థానికంగా ఉండే ఓ హైపర్ మార్కెట్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ పాకిస్తానీ చిన్న విషయమై భారత ప్రవాసుడితో వాగ్వాదానికి దిగాడు. అది కాస్త హింసాత్మకంగా మారింది.

పాక్ వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో భారతీయుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ భారత వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం పాకిస్తానీ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న భారతీయుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇక ఇదే ఘటనలో మరో పాకిస్తానీతో పాటు ఈజిప్టియన్ కూడా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అల్ కువైటీ ఆస్పత్రికి తరలించారు. వారు ఇచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు  రిఫర్ చేశారు. కాగా, మృతుడిని కేరళ రాష్ట్రం పలాక్కడ్ జిల్లాలోని మన్నార్‌క్కడ్‌కు చెందిన హక్కీం‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com