సౌదీలో మెట్రో రైళ్లు నడుపుతోన్న హైదరాబాదీ మహిళ

- March 08, 2023 , by Maagulf
సౌదీలో మెట్రో రైళ్లు నడుపుతోన్న హైదరాబాదీ మహిళ

జెడ్డా: ప్రపంచంలో మహిళలు వాహనాలు నడపడానికి అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియా. అయితే, సౌదీ అరేబియాలో విజన్ 2030లో భాగంగా మహిళలు ఇప్పుడు మహిళా సాధికారతతో సంప్రదాయ పద్ధతులను విడనాడుతూ అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో భారతీయ మహిళా లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి కూడా ఒకరిగా గుర్తింపు పొందారు.

హైదరాబాద్‌లో స్థిరపడిన గుంటూరుకు చెందిన ఆమె ఇప్పుడు రియాద్‌ మెట్రో రైలులో పైలట్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సౌదీ అరేబియాలో రైళ్లను నడపడానికి ముందు, ఇందిర హైదరాబాద్ మెట్రో రైలులో మూడేళ్లపాటు పనిచేశారు. ఇప్పటివరకు మెట్రో రైళ్లను 15 వేల కిలోమీటర్లు నడిపిన ఘనత ఆమె సొంతం. ఐటిలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇందిరా..  తన స్నేహితులు సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎంచుకున్నప్పుడు భిన్నంగా ఉండాలని లోకో పైలట్‌గా మారాలని నిర్ణయించుకున్నారు.

"నేను చిన్నతనంలో మెకానిక్ అయిన తన తండ్రికి పనిముట్లు, విడిభాగాలను ఇచ్చి సహాయం చేసేదానిని. ఇప్పుడు నేను ప్రపంచంలోని అత్యంత అధునాతన రైళ్లను నడుపుతున్నాను" అని ఇందిర సంతోషం వ్యక్తం చేశారు. "మేము ముగ్గురు సోదరీమణులం. మా నాన్న మా చదువుకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అయినప్పటికీ మా బంధువులు కొందరు కట్నం కోసం పొదుపు చేయకుండా విద్యపై ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు." అని ఆమె గుర్తుచేసుకున్నారు.

“నేను రియాద్ మెట్రోకు ఎంపికైనప్పుడు, మా బంధువుల్లో చాలా మంది ఒంటరి మహిళ రైలు పైలట్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు ఎలా వెళ్లగలదో అని భయపడ్డారు. నా సంకల్పం నన్ను అడ్డుకోలేదు. ”అని ఇందిర చెప్పారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమయంలో ఇందిర దోహాలో మెట్రో రైళ్లను నడిపి ప్రశంసలు అందుకుంది. ఇందిర భర్త కూడా ఖతార్‌లో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com