తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు

- March 24, 2023 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.ఇప్పటికే అకాల వానలు కురియడంతో పంటలన్నీ నీటమునిగి తీవ్రంగా నష్టపోయిన రెండు రాష్ట్రాల అన్నదాతలు.. మళ్లీ వాతావరణశాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ వివరించింది.

రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, చిత్తూరు, తదితర జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధికారులుతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించి.. ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.

తెలంగాణలో మరోసారి పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కుమురంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీవ్ర పంట నష్టం వాటిల్లిన పలు జిల్లాల్లో పర్యటించి.. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com