యూఏఈ - ఇండియా మార్గంలో Dh3,000కు చేరుకోనున్న విమాన ఛార్జీలు..!

- April 03, 2023 , by Maagulf
యూఏఈ - ఇండియా మార్గంలో Dh3,000కు చేరుకోనున్న విమాన ఛార్జీలు..!

యూఏఈ: గత నెలలో కొన్ని రద్దీగా ఉండే రూట్‌లలో భారత జాతీయ క్యారియర్లు విమానాలను రద్దు చేయడంతో యూఏఈ-ఇండియా మార్గాల్లో విమాన ఛార్జీలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇక రాబోయే వేసవి నెలల్లో విమాన ఛార్జీలు సుమారు 300 శాతం పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. విమానయాన సంస్థలు చిన్న విమానాలను బిజీ రూట్లలో మోహరించాయని, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని, ఫలితంగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయని వారు తెలిపారు. మార్చి 25 నుండి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను కలిగి ఉన్న టాటా గ్రూప్.. కోజికోడ్, ఇండోర్,  గోవాతో సహా యూఏఈ నుండి వివిధ నగరాలకు విమానాలను రద్దు చేయడం/ మార్చడం ప్రారంభించింది. ఎయిర్ ఇండియా గత నెలలో బోయింగ్ నుండి 220 విమానాలను, $70 బిలియన్ల విలువైన ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయడానికి ప్రణాళికను ప్రకటించింది. దీంతో విమానాలను అప్‌గ్రేడ్ చేయడానికి, సుదూర మార్గాలను లక్ష్యంగా చేసుకుంది. డెయిరా ట్రావెల్స్ జనరల్ మేనేజర్ టీపీ సుధీష్ మాట్లాడుతూ..  విమానాలను రద్దు చేయడం,  చిన్న విమానాలను మోహరించాలనే నిర్ణయం అధిక విమాన ఛార్జీల రూపంలో ప్రయాణికులపై ప్రతికూలంగా ప్రభావం చూపిందని, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ వైపు ప్రభావం చూపుతుందని అన్నారు. దుబాయ్, షార్జా నుండి కాలికట్‌కు విమానాలను ఉపసంహరించుకున్నారు.. కాబట్టి ప్రయాణీకుల సీట్ల సంఖ్య తగ్గినందున ప్రయాణ ఖర్చు పెరిగిందన్నారు. కొచ్చిన్ మార్గం కూడా తీత్ర ప్రభావితమైందన్నారు. తక్కువ సీజనల్ రేట్లతో పోలిస్తే సాధారణంగా వేసవి కాలంలో విమాన ఛార్జీలు 100 నుంచి 300 శాతం మధ్య పెరుగుతాయని ఆయన అన్నారు.

ఇక ఎమిరేట్స్‌లో నివసిస్తున్న, పని చేస్తున్న భారతీయ నివాసితులు భారీ సంఖ్యలో ఉన్నందున యూఏఈ-భారతదేశం మార్గం అత్యంత రద్దీగా ఉండే కారిడార్‌లలో ఒకటి. ఇటీవల, ఎయిర్ అరేబియా అబుదాబి -కోల్‌కతాకు నేరుగా విమానాలను ప్రారంభించగా, ఎతిహాద్ ఎయిర్‌వేస్ పశ్చిమ బెంగాల్ రాజధానికి రోజువారీ సర్వీసును పునఃప్రారంభించింది. పాండమిక్ అనంతర కాలంలో డిమాండ్ విపరీతంగా పెరిగినందున భారతదేశానికి చెందిన ఇండిగో కూడా మార్చి ప్రారంభంలో షార్జా-భువనేశ్వర్‌ను ప్రారంభించింది. దీంతోపాటు 'రమదాన్ ఇన్ దుబాయ్' ప్రచారం విస్తృతం చేయడంతో రమదాన్ సమయంలో ఇండియా నుండి చాలా మంది పర్యాటకులు వస్తున్నారని, వచ్చే నెల నుండి భారతదేశం, యూఏఈలలో పాఠశాలకు సెలవులు వస్తాయని ఈ క్రమంలో విమాన చార్జీలు 25 శాతం పెరుగుతాయని భావిస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ఇతర పెద్ద నగరాలకు జూలై ఛార్జీలు దాదాపు Dh1,500-Dh1,800 మధ్యలో ఉన్నాయి. టిక్కెట్‌ను ముందే బుక్ చేసుకుంటే జూలైలో Dh2,500-ప్లస్‌కు చేరుకుంటుంది. ఇక బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా Dh3,000ని తాకుతాయని వారు చెప్పారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com