ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..

- April 09, 2023 , by Maagulf
ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..

న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.దీంతో హర్యానా,  కేరళ, పుదుచ్చేరి  రాష్ట్రాలు మళ్లీ మాస్కులను తప్పనిసరిచేశాయి. అలాగే కరోనా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించాయి.ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో  సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రుల్లో ఐసియు, ఆక్సీజన్‌ వంటి ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులను అంచనా వేసేందుకు సోమ, మంగళవారాల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఏడాది మార్చి వరకు కేవలం వెయ్యి లోపలే నమోదైన రోజూవారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  కరోనా  ఫోర్త్‌ వేవ్‌ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరిస్తోంది. కోవిడ్‌ మ్యూటేషన్‌ ఓమిక్రాన్‌ యొక్క బిఎఫ్‌.7 సబ్‌-వేరియంట్‌, ప్రస్తుతం ఎక్స్‌బిబి 1.16 సబ్‌-వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.ఈ సబ్‌ వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కానప్పటికీ కేసుల వ్యాప్తికి కారణమౌతున్నాయని పేర్కొంది. 

హర్యానా, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను  తప్పనిసరి చేసింది. కరోనా ప్రోటోకాల్‌ అవలంభించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులను, పంచాయతీలను ఆదేశించింది.గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కేరళ ప్రభుత్వం మాస్క్‌లను తప్పనిసరి చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రులు,  హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశించింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అన్ని విమానాశ్రయాల్లోనూ అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్‌ గా తేలితే అన్ని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలో . ఎక్స్‌బిబి 1.16 వేరియంట్‌ కేసుల పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com