షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. ఆంక్షలు ఎత్తివేత

- April 28, 2023 , by Maagulf
షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. ఆంక్షలు ఎత్తివేత

షిర్డీ: షిర్డీ సాయి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు, భక్తులు నేరుగా బాబాకు పూల మాలలు...ప్రసాదాలు సమర్పించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో షిర్డీ ఆలయంలో భక్తులు నేరుగా పూలు, దండలు, ప్రసాదాలు సమర్పించడంపై నిషేధం విధించారు. తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో భక్తులపై షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆంక్షలను సడలించింది. గత రెండు సంవత్సరాలుగా ఈ నిషేధం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని షిర్డీ సమీపంలో పూల సాగు చేస్తున్న రైతులు తెలిపారు. దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు జరుగుతోందని వారు తెలిపారు. ఆంక్షలను తొలగించాలని కొన్ని నెలల క్రితం పూల రైతులు, వ్యాపారులు నిరసనకు దిగారు. దీంతో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈ అంశంపై అధ్యయనం చేయడానికి అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు, వ్యాపారులతో పాటు భక్తుల నుంచి కమిటీ సమాచారం సేకరించింది. ఆలయ నిర్వాహకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దీంతో గతంలో విధించిన ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచనల మేరకు మళ్లీ పాత పద్ధతిలోనే భక్తుల నుంచి పూలమాలలు, ప్రసాదాలు స్వీకరిస్తామని షిర్డీ సంస్థాన్ ప్రకటించింది. దీంతో భక్తులు స్వయంగా బాబాకు పూలు సమర్పించుకునే సౌలభ్యం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com