ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

- May 05, 2023 , by Maagulf
ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: రాచకొండ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సహదేవ్, అభిమన్యు, నందు లాల్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి జీవనోపాధికి ఇక్కడికి వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

నగర శివారు ప్రాంతాలు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్లే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. 9 మంది సభ్యుల ముఠాలో ముగ్గురు అరెస్టు కాగా మిగతావారు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై ఇప్పటివరకు 173 కేసులు ఉన్నాయని, అందులో 83 కేసులు ఫస్ట్ టైం డిటెక్ట్ చేశామని చెప్పారు. వీరి వద్ద నుంచి 60 కేజీల కాపర్, లక్ష రూపాయల నగదు, దొంగిలించిన సొమ్ముతో కొన్న ఇండికా కార్, పల్సర్ బైక్ సీజ్ చేశామని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు 306 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ తీసి లక్ష రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కి భారీ నష్టం వాటిల్లిందన్నారు. పంట సమయంలో ఈ ముఠా వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ ప్రాంతంలో ఈ ముఠా దొంగతనం చేశారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com