అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది..రాహుల్‌గాంధీ

- February 11, 2026 , by Maagulf
అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది..రాహుల్‌గాంధీ

న్యూ ఢిల్లీ: అమెరికా సర్కారుకు భారత ప్రభుత్వం తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రబడ్జెట్‌ పై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ లోక్‌సభ లో మాట్లాడారు. తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతోపాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారని చెప్పారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను బడ్జెట్‌ ఏమాత్రం ప్రతిబింబించలేదని అన్నారు. రాహుల్‌గాంధీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ప్రపంచం మొత్తం ఏఐ యుగంలోకి వెళ్తోందని చెబుతున్నారు. దీనివల్ల భారత ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ప్రమాదం ఉంది. మన దేశానికి ప్రతిభావంతులైన యువతరం పెద్ద ఆస్తి. ఏఐకి ఇంధనమే డేటా.. డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదు. అమెరికా సూపర్‌ పవర్‌గా కొనసాగాలంటే భారత్‌ డేటానే కీలకం. గతంలో అధిక జనాభాను సమస్యగా భావించేవారు. కానీ జనాభా మనకు అతిపెద్ద ఆస్తి. మన డేటాను కాపాడుకునేందుకు భారత్‌ చర్యలు తీసుకోవడం లేదు. అమెరికా కంపెనీల కోసం ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘భారత్‌ ఏయే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతోంది. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే 50 శాతం టారిఫ్‌లు వేస్తామని బెదిరిస్తోంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌ ద్వారాలు తెరిచింది. భారత ఉత్పత్తులపై ఒకప్పుడు కేవలం 3 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అది 18 శాతానికి చేరింది. అమెరికా దిగుమతులను 46 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లకు పెంచేశారు. భారత్‌కు ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. డాలర్‌ను రక్షించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతోంది’ అని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com