స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి యావజ్జీవ జైలుశిక్ష ..

- May 11, 2016 , by Maagulf
స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి యావజ్జీవ జైలుశిక్ష ..

నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ జైలుశిక్ష ఖరారు చేసింది. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో 8 మందిని న్యాయస్థానం నేరస్థులుగా నిర్ధారించింది. సరైన ఆధారాలు లేవంటూ మరొకరిపై కేసు కొట్టేసింది. ఏ1 నుంచి ఏ7 నిందితులకు యావజ్జీవ శిక్ష, ఏ8 నిందితుడికి 20 నెలల జైలు శిక్ష విధించింది. ఈ గ్యాంగ్‌ సుమారు 37 మంది యువతులను పాములతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ కేసులో బుధవారం తుది వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్నేక్‌గ్యాంగ్‌ ఆగడాలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. వీరు చేసిన నేరాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. మహిళలపై నిందితులు వ్యవహరించిన తీరును న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో వారికి యావజ్జీవ శిక్ష విధించారు.తమ కుటుంబ నేపథ్యం, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని నిందితులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. నేరాలు చేసినప్పుడు మీ నేపథ్యం గుర్తుకురాలేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. నేరస్థుల కుటుంబ నేపథ్యం కాకుండా.. జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.పహాడీషరీఫ్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులు ఫాంహౌజ్‌లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి, 341, 323, 395, 506, 212, 411 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తొమ్మిది మంది నిందితులపై కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ గ్యాంగ్‌ మరికొంత మంది యువతులను ఇదే విధంగా బెదిరించి వారిని దోపిడీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com