బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీ

- August 22, 2023 , by Maagulf
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ముందు జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న కొంతమంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొని విదేశాల అధినేతలతో సంభాషించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. 

‘‘ఈ శిఖరాగ్ర సమావేశం బ్రిక్స్‌కు భవిష్యత్ సహకార రంగాలను గుర్తించడానికి, సంస్థాగత అభివృద్ధిని అందిస్తుంది’’ అని పిఎం మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు మోదీ ఆగస్టు 25వతేదీన గ్రీస్‌లోని ఏథెన్స్‌కు వెళతారు. ‘‘ఈ పురాతన భూమిపై ఇది నా మొదటి సందర్శన. 40 ఏళ్ల తర్వాత గ్రీస్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నాకు గౌరవం దక్కనుంది’’ అని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తన గ్రీస్ పర్యటన ఆ దేశాల బహుముఖ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ప్రధాని మోదీ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారం మన రెండు దేశాలను మరింత దగ్గర చేస్తోందని మోదీ వివరించారు. దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.55గంటలకు శాండ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నాయకులతో ప్రధాని సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు లీడర్స్ రిట్రీట్ కోసం సమ్మర్ ప్లేస్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమం తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా విందు ఇవ్వనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com