ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- June 30, 2026
పారిస్: ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఫ్రాన్స్ అధికారిక పర్యటన సందర్భంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సమక్షంలో పారిస్లోని ఎలిసీ ప్యాలెస్లో ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు), ఉద్దేశ ప్రకటనలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి.
ఈ ఒప్పందాల్లో ముఖ్యంగా మస్కట్ మెట్రో ప్రాజెక్టు, లాజిస్టిక్స్, పోర్టుల అభివృద్ధికి సంబంధించిన అవగాహన ఒప్పందం ఒమాన్ రవాణా, కమ్యూనికేషన్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు ఫ్రాన్స్ రవాణా మంత్రిత్వ శాఖ మధ్య కుదిరింది. దీంతో మస్కట్లో ఆధునిక మెట్రో రవాణా వ్యవస్థ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
అదేవిధంగా, ఒమాన్ వైద్య నిపుణులకు శిక్షణ, పెట్టుబడుల ప్రోత్సాహం, పౌర విమానయాన రంగంలో సహకారం, అంతరిక్ష రంగంలో భాగస్వామ్యం, సాంస్కృతిక, ఫ్రెంచ్ భాషా విద్యా రంగాల్లో సహకారానికి సంబంధించిన పలు ఒప్పందాలు కూడా కుదిరాయి.
నీటి నిర్వహణ రంగంలో గ్రేటర్ మస్కట్కు సంబంధించిన నీటి సరఫరా నెట్వర్క్ నిర్వహణపై ఒప్పందం కుదిరింది. అలాగే అస్యాద్ గ్రూప్, ఫ్రాన్స్కు చెందిన సీఎంఏ సీజీఎం గ్రూప్ మధ్య బహుళ ప్రయోజనాల టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణకు సంయుక్త భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
పునరుత్పాదక ఇంధన రంగంలో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యం గల అల్ కామిల్–అల్ వాఫీ సోలార్ పవర్ ప్లాంట్ తొలి దశ నిర్మాణం కోసం నామా పవర్ అండ్ వాటర్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ రెన్యూవబుల్స్ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే వాడి దయ్కా డ్యామ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు అమలుకు కూడా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
స్టార్టప్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ఒమాన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, స్టేషన్ 11, ఫ్రాన్స్కు చెందిన స్టేషన్ ఎఫ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఒమాన్ స్టార్టప్లకు ఫ్రాన్స్, యూరప్ మార్కెట్లలో అవకాశాలను అన్వేషించే వీలు కల్పించనున్నారు.
సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఫ్రాన్స్ అధికారిక పర్యటన సందర్భంగా కుదిరిన ఈ ఒప్పందాలు ఒమాన్–ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, విద్య, వైద్యం, అంతరిక్షం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్
- హోటల్లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు భక్తులు సజీవదహనం
- నేటి నుంచి టిమ్స్లో పేదలకు పూర్తి ఉచిత సేవలు..
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!
- ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!
- ఖతార్లో స్మార్ట్ రవాణా వ్యవస్థల దిశగా కీలక అడుగు..!!
- చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!
- భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!
- అధిక ప్రమాద కార్యకలాపాలకు థర్డ్ పార్టీ బీమా.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!!







