పట్టాలపై నమో భారత్‌ పరుగులు.. జెండా ఊపి, రైల్లో ప్రయాణించిన మోదీ

- October 20, 2023 , by Maagulf
పట్టాలపై నమో భారత్‌ పరుగులు.. జెండా ఊపి, రైల్లో ప్రయాణించిన మోదీ

గాజియాబాద్‌: దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ రైలు 'నమో భారత్‌' పట్టాలపై పరుగులుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌ లోని సాహిబాబాద్‌ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్‌-మేరఠ్‌ రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు.

అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు సిబ్బందితో ముచ్చటించారు.

గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి. దిల్లీ- గాజియాబాద్‌- మేరఠ్‌ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన 'ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ' (రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.

పూర్తిగా ఏసీ పెట్టెలే
* నమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. 

* నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.

* ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి. తర్వాత అవసరాన్ని బట్టి అయిదు నిమిషాలకొకటి నడుపుతారు.

* ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చొని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు.

* ప్రామాణిక కోచ్‌లలో టికెట్‌ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది.

* ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు.

* ప్రీమియం కోచ్‌లలో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్ల అమరిక ఉంటుంది. కోటు, పుస్తకాలు వంటివి తగిలించుకునే ఏర్పాట్లు చేశారు. ఫుట్‌రెస్ట్‌లు ఉంటాయి. ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు అందుబాటులో ఉంటారు.

* ఎనిమిది ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్లకు గానూ ముందుగా మూడింటిని ప్రాధాన్య ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com