తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సేవలు

- May 24, 2016 , by Maagulf
తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సేవలు

వచ్చే నెల తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. న్యూఢిల్లీ మీదుగా దుబాయ్, అమెరికా, మధ్య తూర్పు దేశాలకు సర్వీసులకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధిరేటు 17శాతం ఉండగా రాష్ట్రంలో 61 శాతం ఉందన్నారు. తిరుపతిలో 48 శాతం, రాజమండ్రిలో 44 శాతం, విశాఖలో 64 శాతం, విజయవాడలో 69 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని, రాజమండ్రిలో టెర్మినల్ విస్తరణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, అది అందుబాటులోకి వస్తే విశాఖ విమానాశ్రయం మూసివేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com