విప్రో, ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ..ఇంటి దగ్గర నుంచి చేసింది చాలు..

- November 09, 2023 , by Maagulf
విప్రో, ఇన్ఫోసిస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ..ఇంటి దగ్గర నుంచి చేసింది చాలు..

 ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం పాలసీని ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నాయి. తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని గట్టిగానే చెబుతున్నాయి. దాంతో పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు నెమ్మదిగా ఆఫీసుల బాట పడుతున్నారు. గతంలో మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్ ట్రెండ్‌ మొదలుపెట్టిన ఐటీ కంపెనీలు రానురానూ వర్క్ పాలసీలో అనేక మార్పులు తీసుకొస్తున్నాయి.

ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భారతీయ ఐటీ దిగ్గజాలైన విప్రో, ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం మానేసి ఆఫీసులకు రావాల్సిందేనని ప్రకటించాయి. అందులో భాగంగా రెండు టెక్ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ పాలసీని ప్రవేశపెట్టాయి.

విప్రో హైబ్రిడ్ వర్క్ పాలసీ :
విప్రో తప్పనిసరి హైబ్రిడ్ వర్క్ పాలసీని ఆవిష్కరించింది. దీని ప్రకారం.. కంపెనీ ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులు ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ నవంబర్ 15, 2023 నుంచి అమల్లోకి వస్తుందని విప్రో ముఖ్య మానవ వనరుల అధికారి సౌరభ్ గోవిల్ వివరించారు.

ఉద్యోగులంతా కలిసి ఒకేచోట పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు కంపెనీ కార్పొరేట్ సంస్కృతిని బలోపేతం చేయడంలో భాగంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు వెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. నవంబర్ 15 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని చెప్పారు. వచ్చే ప్రతి వారం కనీసం 3 రోజుల పాటు ఉద్యోగులు వారికి కేటాయించిన ఆఫీసుల్లో హాజరు కావాల్సిన ఉంటుందని అధికారిక ఇమెయిల్ ద్వారా తెలియజేశారు.

2024 జనవరి 7 నుంచి కొత్త పాలసీ అమల్లోకి :
ఈ పాలసీ మార్పు వెనుక కంపెనీలు తమ లక్ష్యాలు, సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడం, బలమైన టీం వర్క్, సహోద్యోగుల సహకారాన్ని ప్రోత్సహించడమే ప్రధానంగా భావిస్తున్నాయి. ప్రాంతీయ వైవిధ్యాలు, స్థానిక నిబంధనలు, ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలనే అవసరాన్ని విప్రో గుర్తుచేస్తోంది. కొన్ని యూరోపియన్ దేశాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియమాలను ఏర్పాటు చేయడానికి ఉద్యోగులతో విప్రో పాలుపంచుకోవాలని యోచిస్తోంది.

జనవరి 7, 2024 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త వర్క్ పాలసీని పాటించడంలో విఫలమైతే.. అనేక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని విప్రో ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగుల పట్ల అపనమ్మకం, తక్కువ పని నాణ్యత, అధిక ఒత్తిడి వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. కంపెనీ నిబంధనలను విస్మరిస్తే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది.

విప్రో బాటలోనే ఇన్ఫోసిస్.. :
మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా కింది స్థాయి ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజుల పాటు ఆఫీసులకు తిరిగి రావాలని కోరుతూ పాలసీలో మార్పు చేస్తోంది. ఇన్ఫోసిస్ రిటర్న్-టు-ఆఫీస్ (RTO) విధానాన్ని బలోపేతం చేసేందుకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇంటర్నల్ కమ్యూనికేషన్‌ నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్‌లోని వైస్ ప్రెసిడెంట్ బ్యాండ్ 5, 6 కింద వర్గీకరించిన వారితో సహా నిర్దిష్ట ఉద్యోగుల్లోని కొంతమందికి ఇప్పటికే ఇమెయిల్ అందినట్టు తెలుస్తోంది. ఇందులో వీరంతా మిడ్-లెవల్ మేనేజర్‌లు, ప్రాజెక్ట్ లీడర్‌లు, ఎంట్రీ-లెవల్ సిబ్బంది ఉన్నారు. నవంబర్ 20, 2023 నుంచి నెలకు కనీసం 10 రోజుల పాటు ఆఫీసుల్లో నుంచి ఉద్యోగులందరూ పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిణామాలతో భారతీయ ప్రధాన ఐటీ కంపెనీల పని విధానాలలో మార్పును సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com