నిరాశ్రయులను చేరదీసి ఆవాసం కల్పించేందుకు ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం..

- May 27, 2016 , by Maagulf
నిరాశ్రయులను చేరదీసి ఆవాసం కల్పించేందుకు ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం..

కోట్లు సంపాదించేందుకు.. అద్దాల మేడల్లో విలాసవంతంగా గడిపేందుకు కొందరు ఆరాటపడుతుంటే.. నేటికీ గూడూనీడా లేకుండా రోడ్లపై బతుకీడుస్తూ కాలం వెళ్లదీసే వారెందరో ఉన్నారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిందని జబ్బలు చరుచుకుంటున్నా.. ఎండనక వాననక బిక్కుబిక్కుమంటూ ఫుట్‌పాత్‌లపై బతుకు పోరాటం సాగించే అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క దేశానికో.. ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచమంతా ఇదే దుస్థితి. అలాంటి నిరాశ్రయులను చేరదీసి ఆవాసం కల్పించేందుకు ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఆస్ట్రేలియాకు చెందిన సిమన్‌ రోవె ఒకప్పుడు నిరాశ్రయుడే. ఫుట్‌పాత్‌లపై బతుకుబండి లాగించే వారి అభాగ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో 1993లో స్వయానా అనుభవించారు. కానీ.. కష్టపడి ఎలాగోలా బయటపడ్డాడు. అయితే.. తాను గట్టెక్కితే చాలనుకోలేదు సిమన్‌. తనలా ఇబ్బంది పడుతున్న వారికి కనీసం రాత్రి సమయాల్లో బస చేసేందుకైనా వసతి కల్పించాలని నిర్ణయించాడు. అందుకోసం ఇళ్లను నిర్మించాలంటే స్థలానికి.. నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. కాబట్టి.. బస్సులను కొనుగోలు చేసి వాటిలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఆ బస్సులకు 'స్లీప్‌బస్‌' అని పేరు పెట్టాడు. ఒక్కో బస్సులో 22మంది సౌకర్యవంతంగా పడుకునేందుకు ఏర్పాటు చేశాడు. పెంపుడు జంతువుల కోసమూ ప్రత్యేక వసతి కల్పించారు.అందులో పరుపులు.. మెత్తలు.. దుప్పట్లు అన్నీ ఉంటాయి. ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టేందుకు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో టీవీ. ఏసీ.. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇదంతా పూర్తిగా ఉచితం! ఈ బస్సులను నిరాశ్రయులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తీసుకెళ్తారు.
ఈ బస్సుల కొనుగోలుకు.. సౌకర్యాల కల్పనకు 'గోఫండ్‌మీ.కామ్‌' క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా దాదాపు రూ. 67 లక్షలు(లక్ష డాలర్లు) విరాళాలు సేకరించాడు సిమన్‌. వచ్చే ఆరేళ్లలో ఆస్ట్రేలియాలో మొత్తం 300 బస్సులను అందుబాటులోకి తెస్తామని సిమన్‌ చెబుతున్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com