తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్..!
- January 24, 2024
హైదరాబాద్: భారత దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.
దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది.
2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ అన్నీ వచ్చినప్పటికీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.
2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది.
ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి.ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







