అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం..
- January 27, 2024
అయోధ్య: అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. దీంతో రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అయోధ్య కిటకిటలాడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి అయోధ్యలో రాగ సేవ అనే సంగీత కార్యక్రమం కూడా ప్రారంభమైంది. మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు ఈ సంగీత కార్యక్రమం కొనసాగనుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘‘శాస్త్రీయ సాంప్రదాయానికి అనుగుణంగా 26 జనవరి 2024 నుంచి శ్రీరామ జన్మభూమి ఆలయంలో రాగసేవ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో గుడి మండపంలో భగవంతుని ముందు నిర్వహిస్తున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ ప్రావిన్సులు, కళాసాంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు 45 రోజులపాటు భగవాన్ శ్రీ రామ్లల్లా పాదాల వద్ద తమ రాగసేవను అందించనున్నారు. ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్ట్, కోఆర్డినేటర్ శ్రీ యతీంద్ర మిశ్రా పాల్గొననున్నారు.’’ అని పోస్ట్ చేశారు.
ఈ సంగీత కార్యక్రమంలో శ్రీరాముడికి చెందిన భక్తి ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కవి, సంగీత విద్వాంసుడు, ఆలయ నిర్మాణం, నిర్వహణను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్త శ్రీ యతీంద్ర మిశ్రా నిర్వహిస్తున్నారు. సంగీత కార్యక్రమంలో భాగంగా రోజులోని నిర్దిష్ట సమయంలో రాగసేవ నిర్వహించబడుతుంది. శృతి, స్వర, రాగం, తాళాల భావనలపై ఆధారపడిన భారతీయ సంగీతం శాస్త్రీయ సూత్రాలకు అనుగుణంగా ఈ సంగీత కార్యక్రమం ఉంటుంది. రాగ సేవలో సితార్, తబలా, పఖావాజ్, షెహనాయ్, సరోద్, సారంగి, వేణువు, వీణ, మృదంగం, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భారతదేశ శాస్త్రీయ నృత్యాలను కూడా ప్రదర్శించనున్నారు. వైజయంతిమాల, హేమామాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థీ, సోనాల్ మాన్సింగ్, సురేష్ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాయిద్యాలు ‘మంగళ ధ్వని’లో భాగం కానున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







