పార్లమెంట్లో ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ..
- February 09, 2024
న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ సుమారు అరగంట పాటు కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై ప్రధానికి జగన్ వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం త్వరిత గతిన నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్ర వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులతో సహా, నూతన జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు, సుదీర్ఘకాలంగా పౌరసరఫరాల శాఖ లనుంచి పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపైనా ప్రధాని మోదీ, జగన్ మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సార్లు మోదీతోనూ, కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, ఏపీకి ఆర్థిక సహాయంపై విజ్ఞాపనలు అందిస్తూ వస్తున్నారు. వీటన్నింటిపై కేంద్రం నుంచి ఆశించినంత సహకారం రాకపోయినా.. వైసీపీ సహకారం పార్లమెంట్ లోపల బయట బీజేపీకి కొనసాగుతూనే ఉంది. మరికొద్ది కాలంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ, జగన్ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరిగిందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఏపీలో టీడీపీ–జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లివచ్చిన రెండురోజుల వ్యవధిలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, ప్రధానితో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో ఏపీలో తాజా రాజకీయాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎలాంటి రాజకీయ అంశాలపై మోదీ, జగన్ మధ్య చర్చకు వచ్చాయనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









