ఐపీఎల్‌ ప్రారంభం పై స్పష్టత..

- February 20, 2024 , by Maagulf
ఐపీఎల్‌ ప్రారంభం పై స్పష్టత..

న్యూ ఢిల్లీ: క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రారంభంపై అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వేసవిలో ప్రారంభమవుతందని ఇప్పటికే క్రికెట్‌ వర్గాలు తెలిపినా తేదీ విషయంలో స్పష్టత రాలేదు.

తాజాగా మెగాటోర్నీకి సంబంధించిన తేదీని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ప్రకటించారు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ను చెన్నై నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఓ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న అరుణ్‌ ధుమాల్‌ ఐపీఎల్‌ ట్రోర్నీ ప్రారంభంపై మీడియాతో మాట్లాడారు. 'మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్‌-17 ప్రారంభించాలని మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నాం. టోర్నీలో కొంత షెడ్యూల్‌ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే జరుగుతాయి' అని స్పష్టం చేశారు.

ఐపీఎల్‌ నిర్వహణపై అరుణ్‌ ధుమాల్‌ వ్యాఖ్యలను పరిశీలిస్తే టోర్నీకి సార్వత్రిక ఎన్నికల మీద ఆధారపడి ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టోర్నీ నిర్వహించడం కష్టతరంగా తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అనంతరం దానికి అనుగుణంగా ఐపీఎల్‌ టోర్నీ షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో రెండు విడతలుగా ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఎన్నికల ప్రకటనకు ముందే తొలి షెడ్యూల్‌, ఎన్నికల అనంతరం రెండో దఫాలో టోర్నీ నిర్వహించాలనే ప్రణాళికలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ నిర్వహణ ఎప్పుడు అనేది మాత్రం ఎన్నికల సంఘం ప్రకటించే షెడ్యూల్‌పైనే ఆధారపడి ఉంది.

ఐపీఎల్‌ నిర్వహణపై ఓ షెడ్యూల్‌ కూడా ప్రణాళిక ఉందని తెలుస్తోంది. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో ఐపీఎల్‌ షెడ్యూల్‌పై వార్త కథనం ప్రచురితమైంది. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభమై మే 26వ తేదీతో ముగుస్తుందని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది. ఆ షెడ్యూల్‌ విడతలవారీగా ఉంటుందని పేర్కొంది. 15 రోజులు తొంలి షెడ్యూల్‌, మిగతా మ్యాచ్‌లు మరో షెడ్యూల్‌ ఉంటుందని ఆ క్రీడా వెబ్‌సైట్‌ వివరించింది. 2019లోనూ ఇదే మాదిరి ఐపీఎల్‌ టోర్నీ జరిగిందని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే మాదిరి ఉండే అవకాశం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com