షర్మిల ‘ఛలో సెక్రటేరియట్‌’–ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత

- February 22, 2024 , by Maagulf
షర్మిల ‘ఛలో సెక్రటేరియట్‌’–ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత

అమరావతి: మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ…గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో … ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండే ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్‌ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్‌ వలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసిపి నియంత పాలనలో మెగా డిఎస్‌సి ని దగా డీఎస్సీగా చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని… ఇనుప కంచెలు వేసి బందీలు చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. ”మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం” అని ఘాటుగా విమర్శించారు. గిడుగు రుద్రరాజు, మస్తాన్‌ వలిని వెంటనే విడుదల చేయాలన్నారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్‌ ఇచ్చినందుకు వైసిపి సర్కార్‌ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

నేడు ‘చలో సెక్రటేరియట్‌’ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిలను మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు నివాసంలో పోలీసులు అరెస్టు చేయాలని చూశారు. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో షర్మిల విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ‘ఆంధ్రరత్న భవన్‌’కు చేరుకొని బుధవారం రాత్రి అక్కడే నిద్రించారు. గురువారం ఉదయం 10 గంటలకు చలో సెక్రటేరియట్‌కు పార్టీ శ్రేణులతో కలిసి షర్మిల బయలుదేరనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేయడాన్ని పిసిసి తప్పుపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com