ఐపీఎల్‌ షెడ్యూల్ అవుట్..!

- February 22, 2024 , by Maagulf
ఐపీఎల్‌ షెడ్యూల్ అవుట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది.

ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుతో చెన్నై తలపడనుంది. మొదట 21 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. చెన్నై జట్టు తొలి మ్యాచ్‌ని తొమ్మిదోసారి ఆడనుంది. ఇంతకుముందు, జట్టు 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 ,2023లో ప్రారంభ మ్యాచ్‌ను ఆడింది.

ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది, ఆ తర్వాత వెంటనే ఐపీఎల్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేయడానికి సమయం పడుతుంది. ఈ కారణంగానే ఢిల్లీ తొలి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగనున్నాయి. దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. 15 రోజుల షెడ్యూల్‌ మాత్రమే బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల కానుంది.

మొత్తం టోర్నీ భారత్‌లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. 2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో (దక్షిణాఫ్రికా) ఆడగా, 2014లో సాధారణ ఎన్నికల కారణంగా యూఏఈలో కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. అయితే, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్‌లోనే నిర్వహించారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న దృష్ట్యా, ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com