ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన

- May 03, 2024 , by Maagulf
ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన

న్యూ ఢిల్లీ: ఇజ్రాయెల్‌, ఇరాన్‌లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్లే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఈ రెండు దేశాల గగనతలంలో వాణిజ్య విమానాలకు అనుమతించిన నేపథ్యంలో ఎంఈఏ ఈ సూచన చేసింది. అక్కడ ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉందని, ఎక్కువ రోజులు గగనతలం తెరిచే ఉంటుందని చెప్పలేమని పేర్కొంది.

'ఆ ప్రాంత పరిస్థితులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాం. అక్కడి గగనతలం తెరిచినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఆ దేశాలకు ప్రయాణించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా అక్కడున్న భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచిస్తున్నాం' అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

గత నెల ఇజ్రాయెల్‌పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వాటన్నింటినీ నిరోధించిన ఇజ్రాయెల్‌.. ఎదురుదాడికి సిద్ధమైంది. దాంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌ దళాలు, హెజ్‌బొల్లా మధ్య సరిహద్దులో రోజూ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ఉన్న/వెళ్లాలనుకునే వారి కోసం గతంలోనే ఎంఈఏ అడ్వైజరీ జారీ చేసింది. తాజాగా వాటికి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com