భారత్‌కు మరో దౌత్య విజయం

- May 10, 2024 , by Maagulf
భారత్‌కు మరో దౌత్య విజయం

భారత్‌కు మరో దౌత్య విజయం దక్కింది. హార్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు విడుదలయ్యారు. ఇరాన్ ప్రభుత్వం వీరిని గురువారం విడుదల చేసింది. భారత నావికుల విడుదల విషయాన్ని భారత ఎంబసీ మీడియాతో పంచుకుంది. ఈ విషయంలో సహకరించిన ఇరాన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘ఎమ్ఎస్‌సీ ఎరీస్ సరుకు రవాణా నౌకలోని ఐదుగురు భారతీయ నావికులు విడుదలయ్యారు. ఈరోజు సాయంత్రం ఇరాన్‌ నుంచి భారత్‌కు బయలుదేరారు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 17 మంది భారతీయులు ఉన్న ఇజ్రాయెలీ సరుకు రవాణా నౌకను ఇరాన్ అధికారులు ఏప్రిల్ 13న తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ నావను హార్ముజ్ జలసంధిలో ఉండగా సీజ్ చేశారు. నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల్లో కేరళకు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్‌ కూడా ఉన్నారు. అయితే, ఆమె ఏప్రిల్ 18న సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. మిగతా వారి విషయంలో కొన్ని కాంట్రాక్ట్ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక వారు తిరిగొస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతీయులు ఇరాన్ అదుపులో ఉన్నారన్న విషయం తెలియగానే భారత అధికారులు రంగంలోకి దిగారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో చర్చించారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌సి ఏరీస్‌లో ఉన్న ఐదుగురు భారతీయ నావికులు విడుదలయ్యారని ఇరాన్‌లోని ఇండియన్‌ ఎంబసీ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. వారు ఈరోజు సాయంత్రం ఇరాన్ నుంచి బయలుదేరారని పేర్కొన్నది. బందర్ అబ్బాస్‌లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్‌తో ఇరాన్ అధికారులు సన్నిహితంగా సమన్వయం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, గత నెల 18న టెస్సా జోసెఫ్‌ అనే నావికుడు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు కేరళలోని త్రిస్సూరుకు క్షేమంగా చేరుకున్నాడు. అతనికి కొచ్చి విమానాశ్రయంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com