వ్యవసాయ శాస్త్రజ్ఞుడు...!
- June 30, 2024ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో జన్మించిన డా.వాసిరెడ్డి నారాయణ రావు... నందిగామ, గుంటూరులో ఉన్నత విద్యను అభ్యసించి 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ డిగ్రీ పొందారు. ఇజత్నగర్లోని ఇండియన్ వెటరినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీజీ చేశారు. కొలంబోప్లాన్ కింద 1960లో పశుపోషణలో అధ్యయనం కోసం భారత ప్రభుత్వం వీరిని ఆస్ట్రేలియా పంపించింది. అక్కడ డెయిరీ ఫారాల నిర్వహణపై శిక్షణ పొందారు.
1952 నుంచి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. కొలంబో ప్లాన్ కింద 1960లో పశుపోషణలో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఆస్ట్రేలియా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మిల్క్ ప్రాజెక్టు కమిషనర్గా పనిచేశారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో విశ్రాంత జీవితంలోనూ రైతు సేవలో తరించాలని భావించి 1985 నుంచి ఈనాడు గ్రూపులో చేరారు. 1987 నుంచి 2017 అక్టోబరు వరకు మూడు దశాబ్దాల పాటు దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వ్యవసాయదారుల మాసపత్రిక "అన్నదాత" సంపాదకులుగా అపారమైన సేవలు అందించారు.
నారాయణరావు గారు రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వీరు నిర్వహించిన కార్యక్రమాల ఫలితంగానే భారత దేశంలో ఘనీభవించిన వీర్య ఉత్పత్తి, వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. పశు సంవర్ధక రంగంలో తన అనుభవాల ఆధారంగా దూడల పెంపకంపై పుస్తకం రచించారు. ఈనాడు, అన్నదాత పత్రికల్లో వందలాది వ్యాసాలు రాశారు. వీరి కృషిని గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్ధలు అవార్డులు ప్రధానం చేశాయి. రైతుల అభ్యున్నతి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1994లో ప్రతిష్ఠాత్మక డాక్టర్ నాయుడమ్మ అవార్డును, డా.సికే.రావు ట్రస్టు పురస్కారం, డా.రఘోత్తమరెడ్డి అవార్డు తదితర ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తేనే గ్రామీణాభివృద్ధి నిర్దేశిత లక్ష్యాలను సాధించగలుగుతామని డాక్టర్ నారాయణరావు పలు మార్లు పేర్కొన్నారు. సుమారు 6 దశబ్దాల పాటు రైతు సేవలో విరామమెరుగని నిత్యకృషీవలుడుగా, రైతు బాంధవుడిగా అన్నదాతల మనసులను గెలుచుకున్న డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు అనారోగ్యం కారణంగా తన 93 వ యేట హైదరాబాద్ లో కసన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







