బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్..
- July 05, 2024
లండన్: బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది.రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు. లేబర్ పార్టీ అఖండ విజయాన్ని అందించారు. యూకేలో అధికార పీఠం ఎక్కాలంటే మొత్తం 650 సీట్లకుగాను ఏ పార్టీకైనా 326 సీట్లు రావాల్సి ఉంటుంది. పూర్తి ఫలితాలు రాకముందే లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా మార్క్ ను దాటేసింది.దీంతో కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనంగా మారింది.ఈ క్రమంలో బ్రిటన్–భారతదేశం మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగాయి.రిషి సునాక్ భారత్ సంతతికి చెందిన వ్యక్తి కావటంతో భారతీయులుసైతం రిషి సునాక్ ను భారతీయ వ్యక్తిగా భావిస్తూ వచ్చారు.ప్రస్తుతం కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనుండటంతో విదేశాంగ విధానంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో లేబర్ పార్టీ తొలుత భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించింది. కాశ్మీర్ అనేది భారత్–పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక అంశమన్న బ్రిటన్ ప్రభుత్వ దృక్పథానికి విరుద్ధంగా వ్యవహరించింది.కశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం పట్ల భారత్ పై లేబర్ పార్టీ అప్పట్లో విమర్శలు చేసింది.అయితే, ఇప్పుడు స్టార్మర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.
యూకే–భారత్ సంబంధాలను బలోపేతం చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు.కాశ్మీర్ పై గతంలో ఆ పార్టీ వైఖరి ప్రస్తుతం మారింది. కాశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్ దేశాల సమస్య.ఇరు దేశాలు ఆ సమస్యను పరిష్కరించుకుంటాయని లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన సమావేశంలో స్టార్మర్ చెప్పారు. స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం, సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నామని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు కీరా స్టార్మర్ నొక్కి చెప్పారు. భారత్ తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు వారి మేనిఫెస్టోలో సైతం పొందుపర్చారు.గత రెండేళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పై భారత్, బ్రిటన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే, బ్రిటన్ కాబోయే ప్రధాని స్టార్మర్ తో భారత్ సంబంధాలు ఏ మేరకు ముందుకు సాగుతాయి.. స్టార్మర్ చెప్పినట్లు భారత్ తో బలమైన సంబంధాలు నెలకొనేలా ప్రయత్నాలు జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







