ఆదర్శ వైద్యుడు-ఎంఎస్ఎస్

- August 10, 2024 , by Maagulf
ఆదర్శ వైద్యుడు-ఎంఎస్ఎస్

మనిషి గొప్పతనం నమ్మడంలోనూ, నమ్మించడంలోనూ కాదు.. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నమ్మకానికి అమ్మలాగా డాక్టర్ ఎంఎస్ఎస్ రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజల హృదయాలను చూరగొన్నారు. మాట ఇవ్వరు.. ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు.. ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుని తీరతారు. నిరంతరం మారుతున్న సైద్ధాంతిక నిబద్ధతలు, ఆదర్శాలు, ఆశయాలతో నిండిన రాజకీయాల్లో ఎంఎస్ఎస్ లాంటివారు సుదీర్ఘకాలం కొనసాగడం చిన్నవిషయమేమీ కాదు.

 డాక్టర్ ఎంఎస్ఎస్ ప్రసిద్ధి గాంచిన మాదల సాంబశివ కోటేశ్వరరావు గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామంలో 1943లో మాదల మాణిక్యం, రత్తయ్య దంపతులకు జన్మించారు. కష్టపడి మెడిసిన్ విద్యను అభ్యసించారు. ఆనాటి దిగ్గజ ప్రజా వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు సాహచర్యంలోనే వైద్యవృత్తికి శ్రీకారం చుట్టారు. 1969లో మంగళగిరిలో సొంత ఆసుపత్రిని ప్రారంభించారు. అనతికాలంలోనే అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. మధ్యతరగతి, పేదవారిలో డాక్టర్ ఎంఎస్ఎస్ అంటే పల్స్ చూసేవారు తప్ప పర్సు పట్టించుకోరనే నానుడి ఉండేది. రోగులకు అందుబాటులో ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

వైద్య రంగంలో సేవలందిస్తూనే తనకిష్టమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. రైతు నాయకులు ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న రాజకీయ గురువులుగా, ఆదర్శంగా భావించి వారి అడుగుజాడల్లో నడిచేవారు. అనంతరం చరణ్ సింగ్ ఆధ్వర్యంలో లోక్‌దళ్ పార్టీలో ప్రవేశించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. రాజకీయాలలో డాక్టర్ కాసరనేని సదాశివరావు, జాగర్లమూడి చంద్రమౌళి, సుంకర సత్యనారాయణ, ఇరుకులపాటి గోవిందరావు, యలమంచిలి శివాజీ, వడ్డే శోభనాద్రీశ్వరరావు, జేఆర్ పుష్పరాజ్‌తో కోటేశ్వరరావు రాజకీయ కార్యక్రమాలు కొనసాగేవి. వారందరితో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. రైతులు, కార్మికులు, చేనేత వర్గాల సమస్యలపై ఎంఎస్ఎస్ ఉద్యమించారు.

ఆనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎన్టీఆర్ నాయకత్వాన్ని ఒక చారిత్రక అవసరంగా తెలుగు ప్రజలు గుర్తించారు. పాలకపక్షంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న రోజులు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేకమంది కొత్తముఖాలను రాజకీయాలకు పరిచయం చేసింది. అందులో అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, విద్యావంతులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 20 మంది డాక్టర్లు పోటీ చేశారు. అందులో ఐదుగురు గుంటూరు జిల్లా నుంచి పోటీచేసి విజయం సాధించారు.

1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వ పునప్రతిష్ట జరిగిన అనంతరం కోటేశ్వరరావుకు విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు. దీని ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు దోహదపడ్డారు. ఈ స్థాయిలో ఆ ప్రాంతంలో ఎవరూ అభివృద్ధి చేయలేదు. పేద ప్రజల సంపాదన అంతా వారి ఆరోగ్య పరిరక్షణకే ఖర్చు పెట్టేవారు.

పేద, మధ్యతరగతి ప్రజానీకానికి ఉచిత వైద్యం అందిస్తే బాగుంటుందని ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజానీకానికి వైద్యరంగం అందుబాటులో ఉంచారు. అతి సామాన్యునికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆశించిన ఆయన.. 1104 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే రోజున రాష్ట్రమంతటా ఏర్పాటుచేసి ప్రపంచంలోనే ఒక చరిత్రను సృష్టించారు.

ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీని నెలకొల్పి రికార్డ్ సృష్టించారు. సామాన్యునికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి అన్న లక్ష్యంతో ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ హోమియో లేక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటుచేశారు. ఈ నిర్ణయం సామాన్యులకు, పేదలకు ఎంతగానో ఉపయోగపడింది. మనదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో హెల్త్ ఇన్‌స్టిట్యూట్ స్థాపనకు మనం మార్గదర్శకం అయ్యాం. అందుకే డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ అందరి దృష్టిలో మంచి మనిషిగా, ప్రజల మనిషిగా చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com