జగత్తు మెచ్చిన గణిత మేధావి..!

- December 22, 2024 , by Maagulf
జగత్తు మెచ్చిన గణిత మేధావి..!

గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి మూలస్తంభం. మానవ నాగరికత పురోగతికి కూడా గణితం కొంతవరకు కారణమని చెప్పొచ్చు. న్యూమరాలజీ వంటి అనేక ఆధునిక ఉపన్యాసాలు గణితశాస్త్రంలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న దశాంశమాన పద్దతిని వేల సంవత్సరాల కిందటే భారతీయులు వినియోగించారు. మూడో శతాబ్దానికి ఈ పద్దతి వినియోగంలో ఉంది. అయితే, భారతీయులు దీన్ని ఎలా ఆవిష్కరించారో తెలియదు కానీ నిర్దిష్టమైన గణిత విధానాన్ని మాత్రం రూపొందించారు. 

 ప్రపంచమంతా ఇప్పుడు వినియోగిస్తున్న 1 నుంచి 9 వరకు అంకెలతో పునాదులేసి ఆ తరువాత కొత్తగా సున్నా(0)ను సైతం కనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు. అప్పటి వరకు చుక్కానీలేని నావలా ఉన్న గణితానికి భారతీయులు సున్నాను కనిపెట్టి కొత్త రూపునిచ్చారు. తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించిన భారతీయులు ప్రపంచ గణితాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అటువంటి వారిలో 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన శ్రీనివాస్ రామానుజన్ ఒకరు. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గణిత శాస్త్ర ఉద్ధండులే పరిష్కరించలేని గణిత సమస్యలను తన అపార మేధా సంపత్తితో చిటికెలోనే పరిష్కరించి వారి నుంచి ప్రశంసలుందుకున్నారు శ్రీనివాస్ రామానుజన్. అందుకే ఆయన పుట్టిన రోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్.. గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో ఎఫ్ఏ పరీక్షల్లో తప్పారు. తన మేధతో క్లిష్టమైన గణిత సూత్రాలను అవలీలగా చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు.నేడు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి. 

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ 1887, డిసెంబరు 22న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరిచి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. అయితే, జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ (Mathematics) అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. 

అందులోని ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. కానీ, వారు అవగాహన చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించారు.

కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మద్రాసు లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరిన ఆయన, అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవారు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 

మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపారు. 

మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ, రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. ఐదేళ్ల అనంతరం బ్రిటన్ నుంచి 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. 

బ్రిటన్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. 

వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని.. డిసెంబర్ 22, 2011న మద్రాసు విశ్వవిద్యాలయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దీనిని దేశవ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. 

గణిత విద్యను ప్రోత్సహించడం, మ్యాథ్స్​లో సేవలు అందించిన వారికి ప్రశంసలు అందించడం, మ్యాథ్స్ అంటే భయపడే వారికి.. గణితం ఎంత సులువో చెప్పేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. యువతను గణితంవైపు ఆసక్తి చూపించేలా ప్రోత్సాహించడమే జాతీయ గణిత దినోత్సవం ప్రధాన లక్ష్యం. 

జాతీయ గణిత దినోత్సవం రోజున.. దేశవ్యాప్తంగా మ్యాథ్స్​పై పలు రకాల క్విజ్​లు, టెస్ట్​లు నిర్వహిస్తారు. మంచి ప్రదర్శన చూపిన వారికి గిఫ్ట్​లు అందిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, పరిశోధన సంస్థలపై ఈ సబ్జెక్ట్ ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో వివరిస్తారు. సెనిమార్లు, క్విజ్​లు, వర్క్​షాప్​లు నిర్వహిస్తూ.. మ్యాథ్స్ ప్రాముఖ్యతను చాటి చెప్తూ ఉంటారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com