'నేర రహిత సమాజమే తెలంగాణ రాష్ట్ర పోలీసుల ధ్యేయం': డీజీపీ జితేందర్

- January 29, 2025 , by Maagulf
\'నేర రహిత సమాజమే తెలంగాణ రాష్ట్ర పోలీసుల ధ్యేయం\': డీజీపీ జితేందర్

హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలు,అదనపు డీసీపీలు మరియు ఎసిపి స్థాయి అధికారులతో నేరేడ్ మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో అధికారుల నుండి సంబంధిత జోన్లు మరియు అడ్మిన్, ట్రాఫిక్, క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, ఎస్ఓటి, రిజర్వు పోలీస్ వంటి విభాగాల వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను ప్రత్యక్షంగా సందర్శించి, వారి పనితీరు సమీక్షించాలని, తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.సమర్థవంతమైన పోలీసు వ్యవస్థలో దేశంలోని టాప్ పది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండడం గర్వకారణం అని, ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.ఇక్కడున్న ఇరవై నాలుగు గంటల పెట్రోలింగ్ గస్తీ వంటి ఏర్పాట్ల ద్వారా నెలకొన్న ప్రశాంత వాతావరణం వల్లనే మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పెట్టుబడులు కూడా అధికంగా వస్తున్నాయని, తలసరి ఆదాయంలో కూడా మన రాష్ట్రం ముందజలో ఉందని పేర్కొన్నారు. 

ఇకనుండి రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని, పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజలతో మమేకమై పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు.నూతన నేర న్యాయ చట్టాల గురించి అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు.

మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు.డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

శాంతి భద్రతల పరిరక్షణలో ట్రాఫిక్ విభాగం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ పట్టణాలు, నగరాల్లో సామాన్య ప్రజలకు ఎక్కువగా కనిపించేది, అందుబాటులో ఉంటూ తక్షణమే స్పందించే అవకాశం ఉండేది ట్రాఫిక్ పోలీసులకే అని తెలిపారు. ఎండా వానలలో, చలిలో  సైతం రోడ్ల మీద విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల వల్లే నగరాల్లో ఎన్నో నేరాలు, రోడ్డు ప్రమాదాలు అదుపులో ఉన్నాయని డీజీపీ గారు అభినందించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వీలైనంత త్వరగా స్పందించి క్షత గాత్రులకు సహాయం చేయాలని సూచించారు.

అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పని చేయాలని,  సమర్థవంతంగా పని చేసే అధికారులు, సిబ్బందికి రాష్ట్రస్థాయి పతకాలు, ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో సీపీ సుధీర్ బాబు,డిసిపి మల్కాజ్గిరి పద్మజ,డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్ఓటి 1 రమణారెడ్డి, డిసిపి ఎస్ఓటి 2 మురళీధర్, డీసీపీలు ట్రాఫిక్ మల్లా రెడ్డి, శ్రీనివాస్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, పలువురు అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com