ఆదాయపు పన్నుపై పరిమితి పెంచిన కేంద్రం..ఏ రంగానికి ఎంత కేటాయింపు?

- February 01, 2025 , by Maagulf
ఆదాయపు పన్నుపై పరిమితి పెంచిన కేంద్రం..ఏ రంగానికి ఎంత కేటాయింపు?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించింది. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.50 వేల పరిమితిని రూ. లక్షకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించింది. అద్దె ద్వారా వృద్ధులు పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.2.4 లక్షల పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది.

రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపజేస్తామని తెలిపారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మరో రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెరగనుంది. మొత్తంగా రూ.12.75 లక్షల వార్షికాదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది.

ఈసారి రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు.

కేటాయింపుల వివరాలు ఇవిగో…
– రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
– గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
– హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
– వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
– విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
– ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
– పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
– ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
– ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
– పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
– సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
– శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com