వాట్సాప్‌కు సీఈవోగా భారతీయుడు..!

- May 03, 2018 , by Maagulf
వాట్సాప్‌కు సీఈవోగా భారతీయుడు..!

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చాట్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్‌ అరోరాను నియమించే ఆవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ సంస్థ సీఈవో పదవి నుంచి జాన్‌ కౌమ్‌ వైదొలగడంతో.. వాట్సాప్‌ కొత్త సీఈవో వేటలో పడింది. 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ ప్రస్తుతం డేటా లీకేజీ వ్యవహరంతో ఇబ్బంది పడుతోంది. అయితే ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే జాన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల డేటా భద్రత అనేది ప్రధాన సమస్యగా మారిన ఈ తరుణంలో కొత్త సీఈవో ఎంపిక విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే వాట్సాప్‌ ఇప్పటికే అర్హులతో కూడిన ఓ జాబితాను రూపొందించినట్టు సమాచారం. అందులో వాట్సాప్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న నీరజ్‌.. గతంలో గూగుల్‌లో కార్పొరేటు డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నీరజ్‌ ఓ క్లౌడ్‌ సొల్యూషన్‌ సంస్థలో చేరి.. ఆ కంపెనీలో ఉన్నత స్థాయికి చేరాడు. 2006లో ఐబీఎస్‌ నుంచి ఎంబీఏ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం ఏడాదిన్నర పాటు టైమ్స్‌ ఇంటర్నెట్‌ లిమిటెడ్‌లో వర్క్‌ చేశాడు. ఆ తర్వాత గూగుల్‌లో చేరిన నీరజ్‌.. 2011లో వాట్సాప్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌కు, సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు, శంతను నారాయణ్‌ అడోబ్‌కు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com