న్యాయ సలహాలు

- December 05, 2015 , by Maagulf

విజిట్ వీసాపై యూఏఈలో ఉన్న ప్రవాసుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చా?

యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది నివాసితులకు అత్యంత ప్రాధాన్యతలలో ఒకటి. జూలై 2020లో విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం దుబాయ్‌లో 2.5 మిలియన్లకు పైగా యాక్టివ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎమిరాటీలు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ప్రవాసులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్‌లో అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మూడు నుండి ఐదు నిమిషాలలో లైసెన్స్ రెన్యూవల్ పూర్తవుతుంది. ఆమోదించబడిన కేంద్రంలో కంటి పరీక్ష చేయించుకుని, ఆర్టీఏ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీ వివరాలను నమోదు చేసి, జరిమానాలను క్లియర్ చేసి, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కంటి పరీక్ష, డెలివరీ రుసుముతో కలిపి ఇందుకోసం Dh400 వరకు అవుతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో  ప్రవాసులు తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోలేరు. ఇక్కడ కొన్ని సాధారణ ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం.

హోల్డర్ విజిట్ వీసాలో ఉన్నట్లయితే లైసెన్స్‌లను పునరుద్ధరించవచ్చా?

రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విజిట్ వీసాపై యూఏఈలో ఉన్నవారు డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించలేరు. దీని అర్థం ఒక నివాసి యూఏఈ నుండి వెళ్లి విజిట్ వీసాపై తిరిగి వస్తే లైసెన్స్ పునరుద్ధరణకు అనర్హులు అవుతారు. డ్రైవింగ్ లైసెన్స్‌ని పునరుద్ధరించడానికి కచ్చితంగా వ్యక్తి చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీని కలిగి ఉండాలి.

హోల్డర్ మరొక ఎమిరేట్ నుండి వీసా కలిగి ఉంటే దుబాయ్‌లో జారీ చేసిన  లైసెన్స్‌ను పునరుద్ధరించవచ్చా?

ఆర్టీఏ ప్రకారం, మరొక ఎమిరేట్‌లో వీసాలు జారీ చేయబడిన నివాసితులు తమ దగ్గర ఉన్న దుబాయ్ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవచ్చు.

మరొక ఎమిరేట్‌లో జారీ చేయబడిన లైసెన్స్‌లను దుబాయ్‌లో పునరుద్ధరించవచ్చా?

అలా చేయలేము. మరొక ఎమిరేట్‌లో జారీ చేయబడిన లైసెన్స్‌లను దుబాయ్‌లో పునరుద్ధరించుకునే అవకాశం లేదు.

లైసెన్స్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?

యూఏఈలోని పోలీసులు 24 బ్లాక్ పాయింట్ల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసినా లేదా సస్పెండ్ చేసినా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరీక్ష కోసం దరఖాస్తు NOC లేఖను పొందాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త ట్రైనింగ్ ఫైల్ తెరవబడుతుంది.

లైసెన్సు గడువు 10 సంవత్సరాల కంటే ముందు ఉంటే పునరుద్ధరణ ప్రక్రియ ఏమిటి?

రోడ్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించగలరు. ఇందు కోసం Dh200 శిక్షణ ఫైల్ ఓపెనింగ్‌కు చెల్లాంచాలి. అలాగే Dh100 లెర్నింగ్ అప్లికేషన్ ఫీజు; హ్యాండ్‌బుక్ కోసం Dh 50; ఆర్టీఏ  పరీక్ష కోసం Dh200; పత్రాన్ని పునరుద్ధరించడంలో ఆలస్యం కోసం Dh500; పునరుద్ధరణ కోసం Dh300, నాలెడ్జ్-ఇన్నోవేషన్ ఫీజు కింద Dh20 చెల్లించాల్సి ఉంటుంది.

యూఏఈలో మధ్యాహ్నం పని నిషేధం: ఉల్లంఘించిన పరిశ్రమలకు Dh 50,000 జరిమానా

ఎండలో పనిచేసే భవన నిర్మాణ మరియు వివిధ రంగాల కార్మికులకు విశ్రాంతి కోసం ప్రభుత్వం గత 18సంవత్సరాలుగా మధ్యాహ్న పని నిషేధం విధిస్తున్నట్లే ఈ సంవత్సరం సైతం విధించింది. ఈ నెల జూన్ 15 నుండి నిషేధం అమల్లోకి రానుంది. 

ఎండల తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో కార్మికులకు జూన్ 15 నుండి సెప్టంబర్ 15 వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు విరామం ఇవ్వడం జరుగతుంది. ఈ విరామం వల్ల కార్మికులు వేడి గాలలు మరియు వడ దెబ్బల బారిన పడకుండా ఉంటారు. అయితే కొందరికి మాత్రం ఈ విరామం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగంది. వీరికి చల్లటి మంచి నీళ్ళు , ఉప్పు మరియు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి. 

అలాగే, కార్మికులు పనిచేస్తున్న చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పనిచేస్తున్న సమయంలో వడ దెబ్బ తగిలిన వారికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన సదుపాయాలను మరియు విరామ సమయంలో వారు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సదుపాయాలను పరిశ్రమలు కల్పించాలి. 

జరిమానాలు: 

 మధ్యాహ్న విరామ నిబంధనను ఉల్లంఘించిన పరిశ్రమల యాజమాన్యాలకు జరిమానా విధించడం జరుగుతుంది. ఒక్కో కార్మికుడికి Dh 5,000 లెక్కన జరిమానా , అదే గరిష్టంగా అయితే Dh 50,000 విధించడం జరుగుతుంది. 

పరిశ్రమలు మధ్యాహ్న విరామ నిబంధన ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి అని భావిస్తే సంబంధిత మంత్రిత్వశాఖ కు చెందిన  600590000 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు మంత్రిత్వశాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. 

మధ్యాహ్న విరామ నిబంధనల ప్రకారం , యజమాని తన కింద పనిచేస్తున్న కార్మికులు రోజు వారి పనిచేసిన గంటలను నమోదు చేయాలి. 

మహిళలను వేధించే పురుషులకు సంవత్సరం జైలు శిక్ష మరియు Dh10,000 జరిమానా

యూఏఈ: యూఏఈలో రోడ్డు మీద వెళ్తున్న మహిళలను ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని చేతలతో గాని వేధింపులకు గురి చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధించబోతున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించడం జరిగింది. 

ఫెడరల్ డిక్రీ చట్టం 2021లోని ఆర్టికల్ 412 ప్రకారం, 

1.మహిళలను బహిరంగ ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని , చేతలతో గాని వేధింపులకు గురిచేయడం. 

2. స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించే పురుషులను నేరస్తులుగా పరిగణించాలి. 

పై రెండు వ్యవహారాలతో సంబంధం ఉన్న వారికి సంవత్సరం జైలు శిక్ష మరియు Dh 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. 

యూఏఈ యెక్క న్యాయ వ్యవస్థ పట్ల మరియు చట్టాల పట్ల పౌరులకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన తాజా సమాచారం.

ఉద్యోగుల నుండి వీసా మరియు నియామక ఖర్చులను పరిశ్రమలు వసూలు చేస్తాయా?

ప్రశ్న: మూడు నెలల క్రితం దుబాయ్ కు చెందిన కంపెనీలో చేరాను. ఒప్పందం ప్రకారం జీతంలో 50 శాతం కంటే తక్కువ జీతాన్ని నాకు  చెల్లించడం జరిగింది. కొన్ని కారణాల దృష్ట్యా నా ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను.కానీ నేను రాజీనామా చేసే 6 నెలలు ఉద్యోగ వీసా ఖర్చులు కోసం Dh6,000 చెల్లించాలి అని నా యజమాని చెబుతున్నాడు, ఇది చట్ట ప్రకారం న్యాయమేనా ? కంపెనీ నుండి రావాల్సిన జీత బకాయిలను ఎలా వసూలు చేసుకోవాలో వివరించగలరు. 

సమాధానం: మీరు పైన పేర్కొన్న సమాచారం ప్రకారం, దుబాయ్ కు చెందిన ప్రైవేట్  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొబేషన్ కాలంలో ఉన్నారు. కాబట్టి మీ సమస్య ఫెడరల్ డిక్రి చట్టం పరిధిలోని ఉపాధి చట్టం 2021 మరియు క్యాబినెట్ నిబంధనలతో కూడిన ఉద్యోగి సంబంధాల రెగ్యులేషన్ 2021 ద్వారా పరిష్కారం దొరుకుతుంది.

యూఏఈలో ఒక ఉద్యోగి కనీసం14 పని దినాలైన పనిచేయకుండా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చు. అంతేకాకుండా యజమాని ఉద్యోగ ఒప్పంద నిబంధనలు ఉల్లంగిస్తుంటే ఎమిరేట్స్ మానవవనరుల మంత్రిత్వశాఖలో అతని మీద ఫిర్యాదు చేయొచ్చు. 

 ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 45(1) ప్రకారం, "ఉద్యోగి14 పని దినాలైన పనిచేయకుండానే ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే  తన పనికి రాజీనామా చేయడమే కాకుండా జీత బకాయిలు ఇచ్చేయాలి.తన కింద పనిచేసే వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేయడం అంటూ జరిగితే అది కేవలం యజమాని యొక్క వైఫల్యం.అలాగే, చట్టం ప్రకారం యజమాని తన ఉద్యోగితో కుదుర్చుకున్న ఉద్యోగ ఒప్పందం లోని నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన సంబంధించిన మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించవచ్చు". 

ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 6(4) ప్రకారం ," తన కింద పనిచేస్తున్న ఉద్యోగుల నుండి వీసా,  నియామక మరియు ఇతరత్రా ఖర్చులను యజమాని వసూలు చేయరాదు".

అలాగే చట్టంలో పొందుపరచిన నిబంధనల ప్రకారం, ప్రొబేషన్ లో ఉన్నప్పటికీ మరియు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత జీత బకాయిల చెల్లింపు చేయడానికి నిరాకరిస్తూ మరియు ఇతరత్రా ఖర్చులను మీ నుండి బలవంతంగా వసూలు చేయదానికి ప్రయత్నాలు చేస్తున్న మీ యజమాని పై MOHRE లో ఫిర్యాదు చేయొచ్చు.  

MOHRE లో చేసిన మీ ఫిర్యాదు ప్రకారం, మీ యజమాని ని అక్కడికి పిలిపించి హెచ్చరించడమే కాకుండా మీ జీత బకాయిలు ఇప్పించడం మరియు ఉద్యోగ ఒప్పంద పత్రం రద్దు చేయడం జరుగుతుంది.ఇది క్యాబినెట్ రెగ్యులేషన్ 2022 లోని ఆర్టికల్ 16(2) ప్రకారం,  "న్యాయ బద్దంగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపు చేయకుండా చట్టంలోని నిబంధనలను అతిక్రమణలు చేస్తూ ఉన్న వారి మీద మంత్రిత్వశాఖ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది". 

అతి వేగంగా వెళ్లకపోయినా జరిమానా విధిస్తే ఏం చేయాలి?

ప్రశ్న: నేను షార్జాలో నిబంధనలు అనుసరిస్తూ వాహనాన్ని అతి వేగంగా నడపకపోయినప్పటికి  ట్రాఫిక్ జరిమానా విధించడం జరిగింది.వేగంగా నడపలేదు కాబట్టి నేను ఈ జరిమానాను సవాలు చేయగల మార్గం ఉందా? అందుకు కావల్సిన పత్రాలు ఏమిటి ? 

సమాధానం: మీరు పైన పేర్కొన్న ప్రకారం, మీరు అతివేగంగా నడిపారు అనే అభియోగం మీద షార్జా పోలీసులు జరిమానా విధించారు. కాబట్టి మీరు ముందుగా ఈ అభ్యంతరాన్ని వారికి తెలియజేయండి.మీ అభ్యంతరం ప్రకారం ,తాము జరిమానా విధించిన వ్యవహారాన్ని వారు మరోసారి తమ నిఘా విభాగం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.

ఒకవేళ మీ అభ్యర్థన స్వీకరించేందుకు పోలీసులు నిరాకరిస్తే, ఈ వ్యవహారం మీద షార్జా లోని ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ సహకారాన్ని పొందవచ్చు. ఇందు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి పొంది షార్జా ట్రాఫిక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. 

మీ పై విధించిన జరిమానా వ్యవహారాన్ని తనిఖీ చేయమని కోర్టును అభ్యర్థించవచ్చు. అలాగే, ఈ కేసులో మీ వాదన నిజం అని నిరూపించేందుకు సంబంధిత పత్రాలను కోర్టులో సమర్పించాలి. ఈ వ్యవహారంలో మీకు కావాల్సిన మరిన్ని వివరాల కోసం షార్జా పోలీసులను మరియు షార్జా ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ ను సంప్రదించండి. 

 

దుబాయ్ ట్రాఫిక్ జరిమానాలు కట్టకపోతే ఏమి జరుగుతుంది???

ప్రశ్న: నేను దుబాయ్ లో నివసిస్తున్నాను.నాకు భారీ మొత్తంలో ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి కానీ నేను వాటిని కట్టలేని స్థితిలో ఉన్నాను.నా వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాల పరిమితి మూడు నెలలు మాత్రమే.ఒక వేళ నేను జరిమానాలు కట్టకపోతే  ఏమి జరుగుతుంది?

సమాధానం: దుబాయ్ లో ఒక వ్యక్తి  ట్రాఫిక్ జరిమానాలు కట్టకపోతే , అతను లేదా ఆమె వాహన రిజిస్ట్రేషన్ యొక్క కాల పరిమితిని పునరుద్దరణ చేసేందుకు రోడ్లు మరియు రవాణా సంస్థ (RTA) అంగీకరించదు. అలాగే ఈ కేసును దుబాయ్ యొక్క ట్రాఫిక్ విచారణా సంస్థకు బదిలీ చేయడం జరుగుతుంది, కేసు యొక్క స్థాయిని బట్టి ఆ సంస్థ వాయిదాల పద్దతిలో జరిమానా కట్టడానికి అనుమతిస్తుంది లేదా సదరు దివాళా తీసిన వ్యక్తి అభ్యర్థన మన్నించి జరిమానా మాఫీ చేయడానికి కూడా అనుమతిస్తుంది.  

దుబాయ్ పోలీసులు జరిమానా వాయిదాల సేవలు(Fines Instalment services)అనే పథకాన్ని ప్రవేశపెట్టారు, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే డ్రైవర్లు తమ ట్రాఫిక్ జరిమానాలను వడ్డీ లేని వాయిదాల పద్దతిలో చెల్లింపు చేయడం.వారు 3 నెలలు , 6 నెలలు లేదా 12 నెలల వాయిదాల కాల వ్యవధిని ఎంచుకోవచ్చు.అలాగే, యూఏఈ  బ్యాంకులో ఖాతా ఉంటే ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు.ఉల్లంఘనల కనీస విలువ తప్పనిసరిగా Dh5,000 ఉండాలి.

 

నా జీతం Dh 20,000 కన్నా తక్కువున్నా వితంతువైన మా అమ్మ వీసాకి స్పాన్సర్ చేయవచ్చా?

ప్రశ్న: ఇటివలే మా అమ్మ వితంతువై నా స్వదేశంలో ఒంటరిగా ఉంటోంది.అయితే నేను అమ్మను నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఆమె వీసా కు స్పాన్సర్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకంటే నా జీతం నెలకు Dh7,000 కన్నా తక్కవే.ఒకవేళ నాతో పాటుగా ఆమెకు వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉంటే ఎలా, ఆమెను న్యాయ బద్దంగా ఇక్కడికి తీసుకురావాలి అంటే ఏమి చేయాలి ? 

సమాధానం: మీరు అడిగిన ప్రశ్న పరిశీలించి చుస్తే , మీ అమ్మను చూసుకోవడానికి దుబాయ్ లో నివాసం ఉంటున్న మీరు తప్ప తోబుట్టువుల ఎవరు లేరని తెలుస్తోంది.అయితే యూఏఈ లో ఒక మనిషి కనీసం Dh 20,000 లు సంపాదిస్తూ, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇల్లును కలిగి ఉంటే అతడు లేదా ఆమె తల్లిదండ్రులకు స్పాన్సర్ చేయవచ్చు. 

అలాగే, స్వదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులలో ఒకరు మరణిస్తే వారి కుమారుడు లేదా కుమార్తె ఆ దేశంలో ధ్రువీకరించబడ్డ డెత్ సర్టిఫికెట్ ను సమర్పించాలి.ఆ తర్వాత ఆ పత్రాన్ని అరబిక్ భాషలోకి తర్జుమా చేసి యూఏఈ విదేశీ మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వశాఖ(MOFA) చేత ధృవీకరించబడాలి.ఇవే కాకుండా స్పాన్సర్ చేయడానికి పైన పేర్కొన్న పద్ధతి ప్రకారం, ఎవరైతే స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నారో అందు కోసం యూఏఈలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణ బాధ్యతలు చూడబోతున్నట్లుగా స్వదేశంలో ఉన్న రాయబార కార్యాలయంచే ధ్రువీకరించబడ్డ dependency Certificate ను తీసుకోవాలి.ఈ సంబంధిత పత్రాలను అరబిక్ భాషలోకి తర్జుమా చేసి MOFA చే ధ్రువీకరించబడాలి.

ఒకవేళ , మీ జీతం Dh20,000 కంటే తక్కువగా ఉండే పరిస్థితుల్లో స్వదేశంలో ఒంటరిగా ఉంటున్న మీ అమ్మ కు స్పాన్సర్ చేయాలి అనుకుంటే " General Directorate of Residency and Foreigners Affairs - Dubai (GDRFA-Dubai)" కి దరఖాస్తు చేసుకోవాలి.ఈ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సంబంధిత పత్రాలు మరియు కుటుంబాన్ని మీరొక్కరే పోషిస్తున్నట్లుగా ధ్రువీకరించాలి. 

వీటితో పాటుగా పైన పేర్కొన్న పత్రాలు అంటే మీ యూఏఈ నివసిస్తున్నట్లు గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ , నివాస వీసా యొక్క కాపీలు , జీతానికి సంబంధించిన సర్టిఫికేట్ , ఉద్యోగ ఒప్పంద పత్రం , Ejari రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వినియోగ బిల్లు (utility bill), గత మూడు నెలలకు సంబంధించిన తాజా బ్యాంకు ఖాతా నివేదిక (statement), మీ అమ్మ గారికి పాస్పోర్ట్ కాపీ.GDRFA- dubai మీ దరఖాస్తు ను పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఈ పత్రాలన్ని సమర్పించాలి. 

ఒకవేళ మీ అమ్మకి నివాస వీసా రాకపోతే మీరు దీర్ఘకాలిక వీసా కు దరఖాస్తు చేయండి. మీ అమ్మ గారు మీతోనే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటే ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారు వీసాను కూడా తీసుకోవడం మంచిది. 

ఇంకా మీకేమైనా తగిన సూచనలు, సలహాలు కావాలంటే GDRF - Dubai సంస్థ వారిని సంప్రదించండి. 

యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు

ప్రభుత్వ లైసెన్స్ లేని నియామక సంస్థల నుండి, ఒకే వర్గానికి చెందిన వారిని ప్రమోట్ చేస్తున్న నమ్మశక్యం కానీ సామాజిక మాధ్యమాల పేజీల ద్వారా గృహ కార్మికులను నియమించుకునే యూఏఈ ఉద్యోగస్తులను,కుటుంబాలను మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వశాఖ(Mohre) హెచ్చరించడం జరిగింది. 

ఈ హెచ్చరిక రావడానికి ముఖ్య కారణం ఇటీవల ఆ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గృహ కార్మికులను ఉత్పత్తి చేసే ప్రైవేట్ నియామక సంస్థలు ప్రభుత్వం విధించిన నిబంధనలు మరియు షరతులను పాటిస్తే నియామక లైసెన్సులు పొందవచ్చు. 

"గుర్తింపు కలిగిన నియామక సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి తాము ఎంపిక చేసిన వ్యక్తుల యొక్క హక్కులను పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి" అని మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. 

గృహ కార్మికులను నియమించుకున్న తర్వాత వారిని క్రమబద్ధీకరణ చేయడంతో పాటుగా వారికి ఉద్యోగ భద్రత మరియు రక్షణ కల్పించాలి.అలాగే, ప్రభుత్వం ప్రకటించిన ధరలను దృష్టిలో పెట్టుకొని తమ వారికి ఉపాధి కల్పించే కుటుంబాలకు నియామక సంస్థలు పలు రకాల రేట్లతో కూడిన ప్యాకేజీలను చూపించాలని లైసెన్స్ జారీ చేసే సంస్థలు మరియు మంత్రిత్వశాఖ పేర్కొన్నాయి.  

లైసెన్స్ లేని సంస్థల నుండి వ్యక్తులను నియమించుకోవడం ద్వారా వచ్చే 5 ఇబ్బందులు గురించి మంత్రిత్వశాఖ పేర్కొంది: 

1. దొంగతనంగా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా దేశంలో ఉంటున్న వ్యక్తులను నియమించుకోవడం ద్వారా ఉపాధి కల్పించే వారు న్యాయ పరమైన సవాళ్ళను ఎదుర్కోవాలి.అలాగే, ఎటువంటి అధికారిక పత్రాలు మరియు స్పాన్సర్ షిప్ లేని ఇలాంటి వారిని నియమించుకోవడం కూడా చట్ట వ్యతిరేకం. 

2. గృహ కార్మికులని నియమించుకుంటున్న కుటుంబం ముందుగా అతని యొక్క ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. 

3. ఉపాధి పొందే వ్యక్తి యొక్క నేర చరిత్ర తెలియకపోతే ఉపాధి కల్పించిన వ్యక్తి భద్రత ప్రమాదంలో పడినట్లే.అందుకని నియామక సంస్థలు లైసెన్సులు పొందే క్రమంలో తాము ఎంపిక చేసిన అభ్యర్థులు యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించాలి. 

4. నియామక సంస్థ, ఉపాధి కల్పించే కుటుంబం మధ్య న్యాయ బద్ధమైన ఒప్పంద పత్రం లేకపోవడంతో నియామక సంస్థ ద్వారా ఉపాధి పొందిన వ్యక్తి కున్న హక్కులు మరియు  స్వతంత్రత విస్మరించబడతాయి.తాను పనిచేసే చోట ఇబ్బందులకు గురై ఫిర్యాదు చేసినప్పటికీ యజమాని మీద చర్యలు తీసుకోకపోవచ్చు. 

5. గుర్తింపు లేని సంస్థల ద్వారా నియమితులైన గృహ కార్మికులకు సరైన శిక్షణ లేకపోవచ్చు.అదే లైసెన్స్ ఉన్న సంస్థలైతే నిష్ణాతులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించడమే కాకుండా వారే ఉపాధి కల్పపిస్తారు.

 

యూఏఈ: వడ్డీ కోసం వ్యక్తిగత రుణాలిస్తే కఠినమైన శిక్షలు ..!

ప్రశ్న: నేను చాలా ఏళ్ళ నుంచి యూఏఈ లో ఉంటూ కొంచెం కొంచెంగా డబ్బును కూడబెడుతూ వస్తున్నాను. అయితే ఆ డబ్బును రుణంగా ఇచ్చి వడ్డీ పొందడం ఈ దేశంలో న్యాయ బద్ధం కదా? ఒక వేళ అదే నిజమైతే నా దగ్గర వ్యక్తిగత రుణంగా తీసుకున్న వ్యక్తి ఆ డబ్బును కట్టకపోతే నేను ఏం చేయాలి?

సమాధానం: మీ పై ప్రశ్నలకు జవాబు యూఏఈ శిక్షా స్మృతి లోని ఫెడరల్ లా నంబర్ 31 ఆఫ్ 2021 లో పొందుపరచడం జరిగినది. ఈ చట్టం ప్రకారం వడ్డీ కోసం ఒక వ్యక్తికి రుణం ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. కేవలం యూఏఈ ప్రభుత్వ లైసెన్స్ లు కలిగిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మాత్రమే అధికారం ఉంది. లైసెన్స్ ఉన్నప్పటికీ ఈ సంస్థలు సైతం ఆ దేశ నియమ నిబంధనలను అనుసరించి ఈ వ్యాపారం చేయాలి. ఒక వేళ తెలియక ఇటువంటి వడ్డీలు ఇచ్చిన వారికి యూఏఈ శిక్షా స్మృతి లోని ఆర్టికల్స్ 458 , 459ల ప్రకారం జరిమానా విధించడం జరుగుతుంది. అసలు ఇంతకీ ఈ ఆర్టికల్స్ లో ఏముందో ముందు తెలుసుకుందాం.


ఆర్టికల్ 458 : 

"ఈ ఆర్టికల్ ప్రకారం వడ్డీ కోసం ఆశపడి రుణాలు ఇవ్వడం లేదా వాణిజ్య సంబంధిత వ్యవహారాలు నెరపడం వంటి ఇతరత్రా వ్యవహారాలు రుజువైతే వారికి కనీసం ఒక సంవత్సరం తగ్గకుండా జైలు శిక్ష తో పాటుగా సుమారు Dh50,000 తగ్గకుండా జరిమానా విధించడం జరుగుతుంది". 

"వడ్డీకి సంబంధించిన రుణ సంబంధిత వ్యవహారాల్లో కమిషన్ కోసం లేదా మరో విధంగానైన లబ్ధి పొందారని నిరూపితమైన వారికి . నిరూపితమైన వారు చేసిన నిజమైన న్యాయ సంబంధిత లబ్ధి లేదా సేవలు గురించి తెలియజేయాలి". 

" రుణం తీసుకోవాల్సిన వచ్చిన అవసరం గురించి తెలియజేయాలి మరియు ఇందులో ఎటువంటి లబ్ధి చేకూర్చే అంశాలు లేవని ప్రకటించాలి". 

" రుణం కోసం వచ్చిన వ్యక్తి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఆర్టికల్ లోని నిబంధనలు అతిక్రమించి వారిని ఆర్థికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ చర్యను తీవ్రంగా పరిగణించబడుతుంది" .

ఆర్టికల్ 459 : 

ప్రతి సాధారణ వ్యక్తి వడ్డీ కోసం ఆశపడి  రుణాలు ఇచ్చినట్లు రుజువైతే వారికి 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష తో పాటుగా సుమారు Dh100,000 తగ్గకుండా జరిమానా విధించడం జరుగుతుంది". 

పైన  పేర్కొన్న రెండు చట్ట పరమైన ఆర్టికల్స్ ప్రకారం వడ్డీ కోసం రుణాలు ఇచ్చినట్లు కచ్చితంగా రుజువైతే అతను లేదా ఆమె జైలు శిక్ష మరియు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది. అదే గాని స్నేహితులు , సన్నిహితులు మరియు కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినట్లతే వారి నుండి తిరిగి తన డబ్బును తిరిగి పొందడానికి సంబంధిత అధికారిక ఒప్పంద పత్రాలు ఉండాలి. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే అతని మీద కోర్టు లో కేసు వేసేందుకు ఈ పత్రాలు ఉపయోగపడతాయి.

మీరు కాంట్రాక్ట్ రెన్యువల్ కు ఇష్టపడకపోతే మీ యజమాని(కంపెనీ) మీపై నిషేధాన్ని విధించలేరు.

కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఉద్యోగం వదిలివేసే విషయంలో యుఎఇ నిషేధ నిబంధనల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, కాని కార్మికుడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి, అదే సంస్థతో ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించకూడదనుకుంటే, అతను తన సంస్థ (యజమాని) నుండి నిషేధం ఎదుర్కోకుంటాడా
అనే ప్రశ్న తలెత్తుతుంది.

మీరు ఒక కంపెనీలో పనిచేస్తుంటే మరియు ప్రస్తుత ఒప్పందాన్ని పూర్తి చేసి ఉంటే లేదా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే, గడువు ముగిసిన తర్వాత మీ ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి(రెన్యువల్) కు
ఇష్టపడకపోతే, మీ కంపెనీ (యజమాని) నిషేధాన్ని విధించలేరు.

 

దుబాయ్‌లో ఈ పనులు అస్సలు చేయకూడదు

గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది దుబాయ్‌కే వెళ్తుంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో సుమారు 2.6మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే దుబాయ్ చట్టాలకు భారతీయ చట్టాలకు చాలా తేడాలుంటాయి. అక్కడికెళ్లిన తర్వాత వారి చట్టాలను అనుసరించాల్సి ఉంటుంది. అక్కడి వారితో ఎలాంటి పనులు చేయకూడదో  కొన్ని సూచనలు.

యుఎఈలో ఎలాంటి పనులు చేయకూడదంటే:

1. చెక్‌లపైనా సంతకం పెట్టేటప్పుడూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

2. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. గట్టిగా నినాదాలు చేస్తూ ఊరేగింపులు తీయకూడదు. అనవసరంగా మహిళలతో మాట్లాడకూడదు.

3. ప్రభుత్వ భవనాలను గానీ, మహిళలను గానీ, ప్రయివేటు వ్యక్తులను గానీ వారి అనుమతి లేకుండా ఫోటోలు తీయకూడదు.

4. అనుమతి ఉన్న మందులననే వాడాలి. కొనేముందే నిషేధిత మందుల జాబితాను ఒక్కసారి పరిశీలించాలి. అందులో మీరు కొనే మందులు ఉంటే వాటిని కొనకూడదు.

5. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపకూడదు. అలాగే తాగి కూడా వాహనాలు నడపకూడదు.

6. బిక్షమెత్తుకోవడం దుబాయ్ చట్టాలకు విరుద్ధం.

7. ఇస్లాం సంప్రదాయాలనుగానీ, పరిపాలిస్తున్న రాజును గానీ కించపరచకూడదు.

8. స్థానికంగా అగ్ని ప్రమాదాలు జరిగిన, తుఫాన్ వల్ల బీభత్సం జరిగిన వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు. దానిని నేరంగా పరిగణిస్తారు.

9. పబ్లిక్ భవంతులలో పొగతాగకూడదు.

10. కొన్నింటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. అవేంటంటే బ్యాంకులో డబ్బులు లేకపోయిన చెక్కు ఇవ్వడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. వాటికి జరిమానా విధించడంతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

11. వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం, చిన్నపిల్లలపై లైంగిక దాడులు, అభ్యంతరకరమైన దుస్తులు ధరించడం దుబాయ్‌లో తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. వాటికి కఠినమైన శిక్షలుంటాయి.

 

జాగ్రత్త.. యూఏఈలో కొత్త చట్టాలు..

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త చట్టాలను చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది యూఏఈ. వలసదారుల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చి అక్రమాలు చేయకుండా కట్టుదిట్టమైన చట్టాలకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ఇటీవల కొన్ని చట్టాలను యూఏఈ ఆమోదించింది. ఆ చట్టాలను వలసదారులు ఎవరైనా అతిక్రమిస్తే తిప్పలు తప్పవని చెప్పకనే చెప్పింది. మరి ఆ చట్టాలేవో తెలుసుకుంటే.. తెలియని తప్పులకు ప్రవాసులు శిక్ష అనుభవించకుండా ఉంటారు. 

ఫోన్‌కాల్ రికార్డ్ చేయొద్దు:

         ఇతరులతో ఫోన్ మాట్లాడేటపుడు వారి సంభాషణలను రికార్డు అసలే చేయొద్దు. ఫోన్ కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రికార్డింగ్ చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్, ఫోటోలు పెట్టడం, పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేయడం వంటివి కూడా శిక్షార్హమే. 
 
స్పీడు ఎక్కువైతే జైలుకే:

           వలసదారులకు కూడా దుబాయిలో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు కదా అని ఎక్సలేటర్‌పై కాలు పెట్టి రయ్యిమంటూ దూసుకెళ్తే.. అటు నుంచి అటే జైలు గోడల్లోకి వెళ్తారు. యూఏఈలోని ట్రాఫిక్ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే డ్రైవింగ్ చేయాలి. రెడ్ సిగ్నల్ దాటితే 800 దిర్హమ్స్ జరిమానాతోపాటు 15 రోజుల పాటు వాహనాన్ని పోలీసుల దగ్గరే పెట్టుకుంటారు. గంటకు 60 కిలోమీటర్ల వేగానికి మించితే 1000 దిర్హమ్స్‌ను జరిమానాగా చెల్లించాలి. అంతేకాకుండా 30 రోజుల పాటు వాహనం మీ చేతుల్లోకి రానట్లే. 
 
వీసా లేకుంటే వర్క్ చేయొద్దు:

              వీసా లేకుండా యూఏఈలోకి అడుగుపెట్టడం, దేశంలో పనిచేయడం వంటివి అక్రమం మాత్రమే కాదు.. నేరపూరితం కూడా. వర్క్ వీసా ఉంటేనే పనిచేయాల్సి ఉంటుంది. ఏదో ఒక వీసాపై దేశంలోకి వచ్చి పని చేస్తానంటే అక్కడ కుదరదు. ఉద్యోగాన్ని సంపాదించి, కంపెనీతో అన్ని వివరాలు మాట్లాడుకుని మళ్లీ స్వదేశం వెళ్లి.. కంపెనీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకుని మాత్రమే దేశంలోకి అడుగుపెట్టాలి. పని చేయాలి. 
 
వేసుకునే దుస్తుల విషయంలో..

            మహిళలకు దుస్తుల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయనీ, డ్రస్‌కోడ్ గురించి వీసాపై సంతకం పెట్టించుకుంటారనేవి అపోహలు మాత్రమే. కాకుంటే దేశ సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ప్రార్థన మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి చోట్ల దేశ సంప్రదాయానికి విరుద్ధంగా దుస్తులు ధరించకూడదు.

 

 

భారతీయులకు దుబాయి ఆఫర్- 'వీసా అన్ అరైవల్’

భారతీయులకు యూఏఈ ప్రభుత్వం బంపర్  ఆఫర్‌ను ప్రకటించింది. వీసా లేకుండానే తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సాధారణంగా ఓ దేశానికి వెళ్లాలంటే ముందుగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ వీసా వచ్చేంత వరకూ వేచి చూడాలి. యూఏఈకి కూడా ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ విధానానికి భారతీయులకు మినహాయింపునివ్వాలని యూఏఈ ప్రభుత్వం భావిస్తోంది. అయితే అందరు భారతీయులకు కాకుండా అమెరికా వీసా, గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు ఎటువంటి వీసా అక్కర్లేదని యూఏఈ ప్రకటించింది.  ఇక్కడకు వచ్చాక ‘వీసా అన్ అరైవల్’ స్కీమ్ కింద నిమిషాల్లోనే యూఏఈ వీసా పొందొచ్చని తెలిపింది. ఇలా ఇచ్చే వీసాతో యూఏఈలో 14 రోజుల పాటు ఉండొచ్చనీ, తగిన ఫీజు చెల్లించి ఓ సారి మాత్రం వీసా గడువును పొడిగించుకోవచ్చని అధికారులు తెలిపారు. యూఏఈ- భారత్ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నామన్నారు.

 

అబూధాబీ యొక్క సాంస్కృతిక వారసత్వం రక్షించడానికి కొత్త చట్టం

అబూధాబీ పాలకుడు అధ్యక్షుడు  శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఉన్న అపరిమిత  సామర్థ్యంతో అబూధాబీ ఎమిరేట్ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు ఒక చట్టంని ఆయన   బుధవారం జారీ చేశారు.  
ఈ చట్టం ద్వారా ఎమిరేట్  యొక్క సాంస్కృతిక వారసత్వంని  రక్షించడానికి వెలికితీసే సంరక్షించేందుకు నిర్వహించేందుకు వారసత్వ కళలను  ప్రోత్సహించే లక్ష్యంతో కృషిచేసి అవకాశమేర్పడుతుంది. చట్టం యొక్క నిబంధనలకు ఎమిరేట్ సాంస్కృతిక వారసత్వానికి మరియు విదేశీ సాంస్కృతిక వారసత్వ సమాచారం లోపల వర్తించే ఉంటుంది.ఈ చట్టంతో వారసత్వ ప్రదేశం యజమాని తన ప్రాముఖ్యతని నిరూపించబడిం సాంస్కృతిక వారసత్వం ఎమిరేట్ ప్రజా ఆస్తిగా భావించవచ్చు.చాలా సందర్భాలలో ఈ చట్టం 'నీటి అడుగున వారసత్వ ప్రదేశాలు' ఎమిరేట్ ప్రజా ఆస్తిగా ప్రకటించవచ్చు.ఈ చట్టం ఎమిరేట్ సాంస్కృతిక పారంపర్యం మీద అబూ ధాబీ టూరిజం మరియు సాంస్కృతిక అథారిటీ మరియు దాని పరిధి అధికారాలు నియంత్రించబడతాయ.

 

యూఏఈ విజిట్‌ వీసా కొత్త రూల్‌


యూఏఈ: యూఏఈ విజిట్‌ వీసా కొత్త రూల్‌ ప్రకారం, తమ విజిట్‌ వీసాని ఎవరైనాసరే రెసిడెన్సీ వీసాగా అయినా, ఎంప్లాయ్‌మెంట్‌ వీసాగా అయినా మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్స్‌ పాత రూల్స్‌ ప్రకారం వీసా మార్పు కోసం పొరుగు దేశాలకు వెళ్ళడమో లేదంటే స్వదేశానికి వెళ్ళడమో చేయాల్సి ఉంటుంది వలసదారులు. అయితే కొత్త విధానం ద్వారా యూఏఈలోనే వుంటూ, తమ వీసా స్టేటస్‌ని మార్చుకోవచ్చు. కొత్త ఉద్యోగాల్ని వెతుక్కున్న వలసదారులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఈ స్టేటస్‌ని మార్చుకునే సౌకర్యం వల్ల, వలసదారులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా ఈ ప్రాసెస్‌ కంప్లీట్‌ అవుతుంది. వలసదారుల కుటుంబ సభ్యులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరం అని రెసిడెన్సీ అండ్‌ పోర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అఇకార ప్రతినిథి రషీద్‌ సుల్తాన్‌ అల్‌ ఖాదర్‌ ఈ వివరాల్ని వెల్లడించారు. ట్రాన్సిట్‌ వీసాలు, షార్ట్‌ టెర్మ్‌, లాంగ్‌ టెర్మ్‌, స్టూడెంట్‌, మెడికల్‌ ట్రీట్‌మెంట్‌, రెసిడెన్స్‌ వీసాలకూ ఈ కొత్త విధానం వర్తిస్తుంది. విజిటర్స్‌ తమ వీసా రెన్యూవల్‌ కోసం 570 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

 

యు.ఏ.ఈ లో  ఉపవాస దీక్ష సమయంలో బహిరంగంగా తింటే జైలే

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్ష పాటించే విషయం తెలిసిందే. ఉపవాస దీక్ష సమయంలో దీక్షలో ఉన్నవారి మనసు చలించేలా బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు తిన్న వారిపై కఠిన శిక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను వారికి  జైలు శిక్షతోపాటు జరిమానా, లేదంటే రెండూ విధించనున్నారు. అలాగే రంజాన్ సందర్భంగా యాచిస్తూ కనిపించే వలసదారులను తక్షణం దేశబహిష్కరణ చేయనున్నట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

పాస్‌పోర్టుకు 'తండ్రి' అవసరం లేదు!

తండ్రితో సంబంధం లేకుండా తల్లి వద్ద నివసించే పిల్లలకు పాస్‌పోర్టు జారీ విషయంలో తండ్రి పేరును రాయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ జగన్మోహన్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యలయానికి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి పేరును ఇవ్వాలంటూ తల్లితో కలిసి జీవించే బిడ్డలను ఒత్తిడి చేయకూడదని కోర్టు పేర్కొంది.గత కొంతకాలంగా సింగిల్ పేరెంట్‌షిప్ పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న ధర్మాసనం.. పెళ్లి కాకుండా తల్లులవుతున్న మహిళలు, సెక్స్ వర్కర్స్, పెంపుడు తల్లులు, రేప్ బాధితులు, తండ్రి వదిలేసిన పిల్లలు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డలకు పాస్ పోర్టు జారీలో ఉన్న సాఫ్ట్ వేర్ కారణంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లో తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా జతచేయాల్సి రావడం సమస్యగా మారింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సాఫ్ట్ వేర్ న్యాయవ్యవస్థ కాలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని ఓ అమ్మాయికి పాస్ పోర్టును జారీ చేయకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి.. పాస్‌పోర్టు జారీకి తండ్రితో పనిలేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా 2005, 2009లలో విచారణకు వచ్చిన ఇలాంటి కేసుల తీర్పును కోర్టు ప్రస్తావించింది.

 

రమదాన్ టైమింగ్స్‌ - యుఏఈ లేబర్‌ చట్టం

పవిత్ర రమదాన్  సందర్భంగా యుఏఈ లేబర్‌ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. రమదాన్ మాసంలో పని వేళల్ని రెండు గంటలు తగ్గించాలి. ఈ తగ్గింపు ఉపవాసం చేసేవారికి, చెయ్యనివారికి, అలాగే ముస్లిం కానివారికీ వర్తిస్తుంది. అయితే డిఐఎఫ్‌సి పరిధిలో మాత్రం కేవలం ఉపవాసం ఉండేవారికి మాత్రమే పనివేళల తగ్గింపు వర్తిస్తుంది. మిగతావారికి పని వేళలు మామూలుగానే ఉంటాయి. యూఏఈ లేబర్‌ చట్టం ఆర్టికల్‌ 65 ప్రకారం పనివేళలు రోజుకి 8 గంటలు లేదా, వారానికి 48 గంటలు. అయితే హోటల్స్‌, ట్రేడ్‌, కేఫిటేరియాలు, సెక్యూరిటీ ఇతర ఉద్యోగాలకు ఈ పనివేళల సమయం 9 గంటలుగా ఉంది. పనిదినాల్లో పనివేళల కుదింపుతో జీతానికి ఎలాంటి కోతలు ఉండకూడదు. 6 గంటలకు మించి అదనపు సమయం పనిచేయించుకుంటే వాటిని ఓవర్‌టైమ్‌గా గుర్తించాలి. ఆరు గంటలు పనిచేయించుకుని, ఇంటి వద్ద మరో రెండు గంటలు పనిచేయించుకోవాలనుకోవడం కుదరదు. పనివేళల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. 

 

విదేశీ కార్మికులకు సౌదీ షాక్‌!

ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు
తొలుత సెల్‌ఫోన్‌ పరిశ్రమల్లో శ్రీకారం
అనంతరం ఇతర రంగాల్లోనూ అమలు
భారత కార్మికులపై తీవ్ర ప్రభావం

ఉపాధి కోసం సౌదీ వెళ్లనున్న వలస కార్మికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. దేశంలోని ప్రైవేటు రంగంలో దేశవ్యాప్తంగా కేవలం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ‘సౌదీజేషన్‌’ పేరుతో జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 2 నాటికి అన్ని విభాగాల్లో పూర్తిగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ దేశంలోని సెల్‌ఫోన్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. సెల్‌ఫోన్‌ కంపెనీలతో ప్రారంభించి... క్రమంగా ప్రైవేటు రంగంలో అన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లోనూ స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సౌదీలోని మహిళలు, పురుషులందరికీ ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థిక స్థిరత్వం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

చమురు ధరల పతనమూ ప్రభావమే!

సౌదీలో ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో సాధారణంగా చాలా వరకూ విదేశీ వలస కార్మికులే ఉంటారు. కానీ, కొంతకాలంగా స్థానికులు కూడా అక్కడి సంప్రదాయేతర విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్టార్‌బక్స్‌, మెక్‌డొనాల్డ్స్‌ వంటి ఫుడ్‌ ఔట్‌లెట్లలో పని చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉద్యోగ మేళాలకు కూడా భారీగా హాజరవుతున్నారు.

కువైట్‌ జైళ్ల నుంచి భారతీయుల విడుదల?

కువైట్‌ జాతీయ దినోత్సవాల సందర్భంగా 1,100 మంది ఖైదీలను విడుదల చేయాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్‌ అమీర్‌ వీరికి క్షమాభిక్ష ప్రసాదించడంతో విడుదల చేయనున్నట్లు కువైట్‌ భద్రతాధికారులు వెల్లడించారు. వీరిలో ఒక మహిళ సహా 34 మందిని వెంటనే విడుదల చేస్తారు. మిగతావారిలో కొందరి శిక్షను సగానికి, మరికొందరి శిక్షను నాలుగో వంతుకు తగ్గించి త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. విడుదలయ్యే వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఖైదీల్లో కొందరిపై ఉన్న జరిమానాలను రద్దు చేయబోతున్నారు. సాధారణంగా జైలు శిక్ష పడిన విదేశీయులను శిక్షాకాలం పూర్తికాగానే కువైట్‌ నుంచి బహిష్కరించి వారి సొంత దేశానికి పంపేస్తారు. అయితే కొందరు ఖైదీలకు విడుదలైన తర్వాత కూడా కువైట్‌లోనే కొనసాగే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

 

యూఏఈలోని భారతీయులకు శుభవార్త

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉంటున్న భారతీయులు తమకే కాకుండా, భారత్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య బీమా రక్షణ కల్పించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దుబాయ్‌కి చెందిన ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, ఆర్‌ఏకే ఇన్సూరెన్స్‌ సంస్థలు కలిసి ఇందుకోసం కొన్ని బీమా పాలసీలను రూపొందించాయి. ఈ పాలసీలు తీసుకుంటే యూఏఈలో ఉంటున్న వ్యక్తి యూఏఈలోని పలు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.

అంతేకాదు... భారత్‌లోని అతడి కుటుంబ సభ్యులు 5,500 భారతీయ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. పాలసీదారుడు యూఏఈ నివాసి అయిఉండాలి. భారతలో ఉంటున్న తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలను కూడా పాలసీలో లబ్ధిదారులుగా చేర్చవచ్చు. పాలసీ తీసుకోవాలంటే యూఏఈ నివాసి వయస్సు 75 సంవత్సరాలలోపు ఉండాలి. కుటుంబ సభ్యుల వయోపరిమితి 70 ఏళ్లు. భారత్‌లో ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌కు చెందిన ఎనిమిది ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్‌ సేవలు కూడా వీరికి లభిస్తాయి. యూఏఈలో ఉంటున్న 26 లక్షల మంది భారతీయులకు తమ పాలసీలు ఎంతో ప్రయోజనకరమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌పై స్పష్టత

రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ల విషయమై స్పష్టత ఇచ్చారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్‌ అండ్‌ రెసిడెన్సెస్‌, మార్గదర్శకాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. బ్రిగేడియర్‌ హిలాల్‌ అల్‌ బుసాదీ, సుదీర్ఘమైన ఈ ప్రకటనలో కంపెనీకి చెందిన ఆథరైజ్డ్‌ రిప్రెజెంటేటివ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్‌ మరియు రెసిడెన్సెస్‌ వద్ద నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ని కన్‌ఫర్మ్‌ చెయ్యాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా నో అబెక్షన్‌ సర్టిఫికెట్‌ వివాదం వలసదారుల్ని తీవ్ర అయోమయానికి గురిచేసింది. ఈ కారణంగా రాయల్‌ ఒమన్‌ పోలీసులు స్పష్టతనివ్వడం జరిగింది. ఓ సంస్థలో ఉద్యోగం మానేసి, వేరే సంస్థలో ఉద్యోగం కోసం అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ ఉద్యోగంలో చేరేందుకు రాయల్‌ ఒమన్‌ పోలీసులు అంగీకరించడంలేదు. ఇమ్మిగ్రేషన్‌లో నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ అంగీకరించకపోవడంతో సమస్య వచ్చిపడుతోంది. ఈ సమస్య పరిష్కారం దిశగా తీసుకున్న చర్యల పట్ల వివిధ కంపెనీలు అలాగే వలసదారులూ హర్షం వ్యక్తం చేశారు. 

 

6 నెలల ఎంప్లాయ్‌మెంట్‌ బ్యాన్‌ తప్పించుకునేదెలా? 

యూఏఈ లేబర్‌ రెగ్యులేషన్స్‌కి సెప్టెంబర్‌లో విడుదల చేసిన డిక్రీ ద్వారా కొన్ని మార్పులు చేశారు. మినిస్ట్రీ ఆరు నెలల బ్యాన్‌ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వివరాలు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో ఈ బ్యాన్‌ విషయంలో వెసులుబాట్లను వలసదారులు వినియోగించుకోవచ్చు. ప్రధానంగా మూడు సందర్భాల్లో చట్టం బ్యాన్‌ని అనుమతిస్తుంది. హై స్కూల్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండి, ఎంప్లాయీ స్కిల్‌ ఉన్న కార్మికుడైతే ఆరు నెలల సర్వీసు అవసరం లేదు. న్యాయ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో లేబర్‌ బ్యాన్‌ ఉండదు. 
అన్‌లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ 
అన్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ కొరకు 
ఇరు వర్గాల మధ్య పరస్పర అవగాహన ఉండాలి. అలాగే ఎంప్లాయీ హై స్కూల్‌ సర్టిఫికెట్‌ లేదా అంతకన్నా ఉన్నతమైన చదువు కలిగి ఉండాలి. 
30 రోజుల నుంచి 30 రోజుల మధ్య నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ఆరు నెలల సర్వీస్‌ అవసరం లేదు. అలాగే హైస్కూల్‌ సర్టిఫికెట్‌ అంతకు మించి హయ్యర్‌ క్వాలిఫికేషన్‌ అవసరం లేదు. 
కార్మికుడి తప్పు లేకుండా యజమాని తొలగించినప్పుడు. 
కాంట్రాక్ట్‌ ఒప్పందాలను యజమాని ఉల్లంఘించినప్పుడు. ఉదాహరణకు 60 రోజులపాటు జీతాలు చెల్లించనప్పుడు. 
యజమాని సంస్థను మూసివేసినప్పుడు 
కార్మికుడు యజమానిపై కోర్టును ఆశ్రయించడానికి అవకాశాలు: 
1. చెల్లించని జీతం కోసం 
2. మధ్యలో తొలగించడం, టెర్మినేషన్‌ కాంపన్సేషన్‌ 
3. కార్మికుడు తాను పొందవలసిన హక్కులను యజమాని నుంచి పొందలేనప్పుడు 
లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ కొరకు 
నిర్ధారిత కాలం అధిగమించిప్పుడు, తిరిగి దాన్ని రిన్యూ చేయనప్పుడు 
ఇరు పక్షాల మధ్యా అవగాహన కుదిరినప్పుడు. 
ఒక పక్షం 30 రోజుల నోటీసు ఇచ్చినప్పుడు. అలాగే, నష్ట పరిహారంపై అవగాహనతో ఇరు పార్టీలూ ఉన్నప్పుడు. నష్ట పరిహారం 3 నెలల గ్రాస్‌ చెల్లింపును మించకూడదు.

 

యూఏఈలో ఉద్యోగి ముఖ్యంగా ఐదు విషయాల గురించి అవగాహన పెంచుకోవాలి


1. లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవడం 
లేబర్‌ చట్టం, ఆర్టికల్‌ 113 ప్రకారం లిమిటెడ్‌ పీరియడ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవడం చట్ట వ్యతిరేకం. యజమాని, మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ని సంప్రదించి, ఉద్యోగిపై సంవత్సరం పాటు బ్యాన్‌ విధించమని కోరవచ్చు. అలాగే, 45 రోజుల జీతాన్ని ఉద్యోగి నుంచి కాంపన్సేట్‌గా పొందవచ్చు. అయినా ఉద్యోగి, కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవాలనుకుంటే ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ గ్రాట్యుటినీ వదులుకోవాల్సి ఉంటుంది. 
2. జీతంలో కోత 
ఆర్టికల్‌ 55 ప్రకారం, ఉద్యోగిపై ఒత్తిడి తీసుకొచ్చి జీతంలో కోత విధించకూడదు. అలాగే పని గంటల్ని పోంచకూడదు. అదనపు సమయానికి చెల్లింపులు లేకుండా పని గంటల్ని పెంచడం చట్ట వ్యతిరేకం. కాంట్రాక్ట్‌కి భిన్నంగా యజమాని ప్రవర్తిస్తే, కఠిన చర్యలుంటాయి. ఉద్యోగిని అకారణంగా తొలగించినట్లయితే, యజమాని, ఉద్యోగికి కాంపన్సేషన్‌తోపాటు, ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ బెనిఫిట్స్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. 
3. ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ గ్రాట్యుటీ, ప్రస్తుత జీతాన్ని బట్టి 
ఆర్టికల్‌ 132 ప్రకారం, ఉద్యోగి చివరగా తీసుకున్న జీతాన్ని బటి& ఓటెండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ గ్రాట్యుటీ ఆధారపడి ఉంటుంది. లేబర్‌ కాంట్రాక్ట్‌లో పేర్కొన్న జీతాన్ని బట్టి కాదు. 
4. యాన్యువల్‌ లీవ్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ 
ఆర్టికల్స్‌ 75, 76 ష్ట్రప్రకారం, ఆరు నెలల కన్నా ఎక్కువ ఏడాది కన్నా తక్కువ సర్వీస్‌ పీరియడ్‌ ఉంటే ప్రతి నెలా రెండు రోజుల సెలవు దినాలుంటాయి. సంవత్సరం మించిన పీరియడ్‌కి మొత్తంగా 30 రోజుల సెలవు దినాలు. ఉద్యోగి సేవలు రద్దు చేయాలంటే గత ఏడాది ఫ్రాక్షన్స్‌ ప్రకారం సెలవుల్ని లెక్కలు వేయాల్సి ఉంటుంది. 
5. ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ గ్రాట్యుటీ లెక్కింపు ఇలా 
ఆర్టికల్‌ 132 ప్రకారం ఎంప్లాయ్‌మెంట్‌ వీసా జారీతో సంబంధం లేకుండా, ఉద్యోగి తన సేవల్ని ప్రారంభించినప్పటినుంచీ లెక్కిస్తారు. ఉద్యోగి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌నిగానీ, లేదంటే అపాయింట్‌మెంట్‌ లెటర్‌నిగానీ కోర్టులో 'ప్రూఫ్‌'గా ప్రొడ్యూస్‌ చేయవచ్చు. దాని ఆధారంగా ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ గ్రాట్యుటీని లెక్కించడం జరుగుతుంది.


యుఏఈ కార్మిక చట్టం: వారంలో 48 గంటలు.. ఓవర్‌ టైమ్‌

యుఏఈ లో పని సమయాన్ని వారానికి 48 గంటలుగా నిర్ధారించారు. అదనపు చెల్లింపులు లేకుండా, అదనపు సమయం పని చేయించుకుంటే అది నిబంధనల్ని ఉల్లంఘించినట్లవుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. దుబాయ్‌లోని మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ ముబారక్‌ మాట్లాడుతూ, యజమాని అదనపు సమయాన్ని కార్మికులతో పని కోసం వినియోగించుకుంటే, మరుసటి వారంలో దానికి తగ్గట్టుగా మినహాయింపులు ఇవ్వాలని చెప్పారు. ఐదు గంటల పాటు నిర్విరామంగా పని చేసిన అనంతరం, గంట పాటు విరామం పొందే హక్కు కార్మికులకు ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారంలో ఆరు రోజులు పనిదినాలు. వారంలో 48 గంటల కంటే ఎక్కువ సమయం కార్మికులతో పని చేయించుకుంటే తప్పనిసరిగా అదనంగా కార్మికులకు యజమాని చెల్లించాల్సి ఉంటుంది. యజమాని కార్మికులకు అదనంగా చెల్లింపులు చేసి, వారంతపు సెలవు దినం కూడా పని దినంగా మార్చవచ్చనీ, అయితే కార్మికులపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా రెండు వరుస వారాంతపు సెలవు దినాల్ని పని దినాలుగా మార్చరాదని చట్టంలో పేర్కొన్నారు. కార్మికులకు ఉన్న హక్కుల్ని యజమాని హరించాలని చూస్తే, చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఈ సందర్భంలో కార్మికులు, యజమానిపై లేబర్‌ రిలేషన్స్‌ ఆఫీస్‌కి ఫిర్యాదు చేయవచ్చు. వారంలో ఏడు రోజులపాటు వరుసగా పనికి డుమ్మా కొడితే, వారిని పనిలోంచి తొలగించే అధికారం యజమానికి లభిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా యజమాని అదనపు సమయం పని చేయించుకుంటే, 1.25, 1.50 గంటల కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే 2 గంటలకు మించి ఓవర్‌ టైమ్‌ చేయించడానికి వీల్లేదు. సెలవు రోజుల్లో పని చేసినందుకు జీతంతోపాటు, అదనంగా 50 శాతం యజమాని చెల్లించాలి. పని చేసిన రోజుకి అదనంగా ఇంకో రోజు సెలవు ఇవ్వాలి. కార్మికులకు ఏమైనా ఇబ్బందులుంటే కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మినిస్ట్రీ ఇన్వెస్టిగేట్‌ చేసి, కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుంది. యాన్యువల్‌ లీవ్‌ని కార్మికులు పొడిగించదలచుకుంటే అది ఆబ్సెంట్‌ కింద పరిగణించబడుతుంది. సరైన కారణం చూపకుండా వరుసగా ఏడు రోజులు పని మానేస్తే, యజమాని ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవచ్చు. 

 

యు.ఏ.ఈ లో  నేటి నుంచి నిషేధం లేని కార్మిక చట్టాలు 

ఉద్యోగ ఒప్పందాలు , పని అనుమతులు , కార్మికుల నియమాలు, తొలగింపులు తదితర కొత్త చట్టాలు నేటి నుంచి అమలులోనికి రానున్నాయి. ఈ  నూతన నిబంధనల ప్రకారం ఇక 6 నెలల కార్మిక నిషేధం ఉండదు.  కార్మికుడు , యజమానికి మధ్య ఒక పరస్పర అవగాహనతో ఉద్యోగ తొలగింపు ఉంటె, 6 నెలల నిషేధం ఉండదు. కొత్త నియమాల  ప్రకారం యజమాని మరియు ఉద్యోగుల మధ్య ఒక శక్తివంతమైన ఉత్పాదక సంబంధం బలోపేతం కావడానికి రూపకల్పన చేశారు. ఇరు పక్ష్యాల్ మధ్య ఉన్నసమ్మతిదారుడు స్థానికంగా గాని , విదేశాల నుంచి కార్మికులను నియమించుకొనే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రామాణిక కార్మిక ఒప్పందాలకు సంబంధించినవి ఉండాలి.  

  కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి యజమాని ఒక కోటా ను పొంధడానికై దరఖాస్తు చేయాల్సి ఉంది. ఆ  దరఖాస్తులో తాను కార్మికునికి ఇవ్వబోయే ఉద్యోగం గురించి ఒక సంపూర్ణ వివరణతో పాటు రెండు పక్ష్యాల విధులు హక్కులను గూర్చి పొందుపరచాలి. దీనిని ' తశ్హెల్ కేంద్రం  '  ద్వారా సమర్పించాలి. కార్మికులు కనుక యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ఉంటె , యజమాని అనుమతిపత్రంతో పాటు నియమించబడిన కార్మికుని  సంతకం తీసుకోవాలి. యజమాని కార్మికునికి సంబంధించిన వర్క్ పర్మిట్ కోసం ఒక పత్రాన్నిజత చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలు పూర్తి కాబడిన తర్వాత  కార్మికుడు లేక కార్మికురాలు 14 రోజులలో ఆ వర్క్ కాంట్రాక్ట్ పై సంతకం చేయాలి.

                          కొత్త ఉపాధి పరిమితి కాల ఒప్పందాలు :

   *    గడువు ముగిసినప్పటకి ఒప్పందం పునరుద్దరణ కాబడక పోవడం 
  
   *   యజమాని కార్మికుడు పరస్పర అంగీకారంతో 6 నెలల కాలాన్ని పూర్తి చేయడం 


   *  యజమాని ఉద్యోగ ఒప్పందం ప్రోస్థాహించడం.


                          అపరిమిత కాలంలో ఒప్పందాలు 
     
 
     *    కార్మికుడు 6 నెలల కాలం పని చేసి ఉంటె, ఇరువురి అంగీకారంతో ( యజమాని , కార్మికుడు ) 
        ఒప్పందంను రద్దు చేసుకోవచ్చును. 

    *  రెండు పక్ష్యాలాలో ఎవరైనా ఒకరు  పని ముగిస్తున్నామని అవతలవారికి నోటీసు ఇవ్వడం 
  

    *  యజమాని కార్మికుని తొలగింపునకు ముందే లేక ఇతర కారణంగా ఒప్పందం రద్దు కాబడుతుంది.   

 

వర్క్ పర్మిట్ ను  ఏ విదంగా పొందవచ్చు ?


కొత్త ఏడాది నుంచి మూడు నూతన్ కార్మిక నియమాలు అమలులో రానున్నాయి. ఇవి రాజ్యాంగం  మరియు అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు ఏకరీతిగా ఉండేలా రూపొందించినట్లు కార్మిక మంత్రి , జాతీయ అర్హతల సంస్థ చైర్మన్ సక్ర్ ఘోబాష్ ఒక ప్రకటనలో తెలిపారు.  24 / 7  ఎమిరేట్స్ ఈ 3 నిబంధనలను గూర్చి వివరించారు. ఇందులోఉద్యోగ ఒప్పందం ముఖ్యమైనది. 

మొదటి భాగం :   కార్మికుని సొంత భాషలోనే ఒప్పందం కుదుర్చుకోవాలి   

 రెండవ భాగం :    ఒప్పంద కార్మికుడిని ఎలా విధుల్లోనుంచి తప్పించవచ్చు ?

    

    నూతన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ కార్మిక నియమాలు మూడవ మరియు ముగింపు భాగం             
    ఈ విధంగా వివరిస్తుంది.
    గతంలో ఉద్యోగి పని ఒప్పందం ముగిసిన తర్వాత, నూతనంగా  పని అనుమతి ఆమె లేక అతడు
    ఏ విధంగా చేయవచ్చునో వివరిస్తుంది. 

 (1) నిర్ణీత కాల ఒప్పందం :
      
      1. ఒప్పందపు గడువు ముగిసినప్పటకీ, తిరిగి ఆరంబికపోవడం

      2. రెండు పక్షాలు  ( కార్మికుడు , యజమాని ) పరస్పరం సమ్మతించుకొన్న పని ఒప్పంద కాల పరిమితి కనీసం 6 నెలలు ఉండాలి. యజమాని అనుమతితో వెళితే , సంబంధిత యజమాని తన వద్ద పని చేసిన కార్మికుని నైపుణ్య స్థాయిని  1,2, 3 తరగతులుగా విభజించి , ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి. 

     3. ఆరు నెలల కాలపరిమితి పూర్తి చేసిన కార్మికునికి అతని యజమాని  తన వద్ద పనిచేసిన కాలంలో ఆయా కార్మికుని పని తీరుపై ఒక నివేదికను అందచేయాలి. ఈ నివేదికలో కార్మికుని నైపుణ్య స్థాయిని ఉటంకిస్తూ 1,2,3 తరగతులుగా విభజించి  ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి. 

    4.  యజమాని కార్మికునికి మధ్య ఉన్న సంబంధాలలో  ఇరువురులో ఎవరైనా ఏకపక్షంగా ఏ కారణం లేకుండా , విధులను వదిలివేస్తే, ఈ దిగువ సూచించినవి చేయాల్సి ఉంటుంది.

    (ఎ) కాల పరిమితి ముగిసిన కార్మికుడు తన యజమానికి ఆమె లేక అతడు లిఖితపూర్వకంగా తన ఒప్పందం ముగియబడిందని తాను పనిచేసిన యజమానికి తెలియచేయాలి. గతంలో వారు ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం బట్టి తెలియచేయాల్సి ఉంది. అయితే తాను  పని మాని వేసే కాలానికి ఒక నెల ముందు లేదా 3 నెలల ముందు తన యజమానికి విధిగా తెలియచేయాల్సిఉంది.
        ఈ ప్రక్రియ అనంతరం వీరు ఇరువురు 3 నెలల నోటీసు పీరియడ్  లోనికి ప్రవేశిస్తారు.

    (బి) కానీ, ఈ  నోటీసు పీరియడ్ కాలంలో  కార్మికుడు తప్పనిసరిగా 3 నెలల నోటీసు పీరియడ్ కాలంలో తన విధులను ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

    (సి) పని మానివేసే కార్మికునికి యజమాని అగ్రిమెంట్ ప్రకారం వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్ష్యంలో ఆయా కార్మికునికి 3 నెలల వేతనం ఒక్కసారే కార్మికునికి ఇచ్చి ఆ యజమాని తన వద్ద నుంచి పంపించవచ్చు.

  2. అనిర్ణీత కాల ఒప్పందాలు

    (1) రెండు పక్షాలు ( కార్మికుడు , యజమాని ) పరస్పర సమ్మతితో కనీసం 6 నెలలు పనిచేస్తే, వారు ఇరువురు ఒక అవగాహనతో మిగిలిన కాల వ్యవధిని రద్దు చేసుకోవచ్చు. సంబంధిత యజమాని  తన వద్ద పనిచేసిన కార్మికుని నైపుణ్య స్థాయిని బట్టి 1,2,3 తరగతులుగా విభజించాలి.ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.  
    
   (2) రెండు పక్షాలలో ఒకరైన కార్మికుడు తన యజమానికి తాను విధుల నుంచి  తొలగనున్నట్లు ముందుగా ప్రకటించాల్సి ఉంది. కానీ, ఒప్పందంలో నిర్ణయించిన ప్రకారం మిగిలిన కాల వ్యవధిని పూర్తి చేయాలి. అది ఒక నెలకు తక్కువ కారాదు. 3 నెలలకు ఎక్కువ కారాదు. ఈ షరతు ప్రకారం సంబంధిత కార్మికుడు తన యజమాని వద్ద కనీసం 6 నెలల కాల వ్యవధిని పూర్తి చేసి ఉండాలి. ఆ యజమాని వద్ద పని చేసిన కార్మికుని నైపుణ్యతను బట్టి 1,2,3 తరగతులుగా విభజించాలి. ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.

   (3)  కార్మికుడు 6 నెలల కాల వ్యవధి కన్నా తక్కువ కాలం యజమాని వద్ద పనిచేస్తే , ఏ కారణం చూపకుండా,  ఆ యజమాని  పని ఒప్పంద రద్దు చేసుకోవచ్చు.

   3. అన్ని ఒప్పందాలకు - నిర్ణీత -  ఆనిర్ణీత ఒప్పందాలు  
        1 మరియు  2 వది నిబంధన ప్రకారం , కార్మికుడు కొత్త పని అనుమతి పొందవచ్చు.

      (1) కార్మికునికి సంబంధించి చట్టపరమైన లక్ష్యాలు ఉన్నప్పటకీ, సంబంధిత యజమాని నెరవేర్చక పోవడం వలన, అలాగే, కార్మికుడ్నియజమాని 60 రోజులు పని చేయించుకొని ఏ మాత్రం వేతనం ఇవ్వకపోతే, ఆ కార్మికుడికి మరో నూతన్ ఉపాధికి అర్హుడు అవుతాడు.
    
      (2) కొత్త వర్క్ పర్మిట్ కార్మికునికి దొరకడానికి మరొక కారణం ఏమిటంటే , కార్మికుడు తాను పని చేసిన వ్యాపారస్థానం కు వ్యతిరేకంగా పిర్యాధును ఇవ్వవచ్చు, తాను పని చేసిన చోట రెండు నెలలుగా పని లేకుండా వ్యాపారస్థానం మూసి ఉంటె,   షాపు మూసివేతకు కారణం  లబెర్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన  నివేదిక, వ్యాపారస్థానం కు వ్యతిరేకంగా కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ను కార్మిక మంత్రిత్వశాఖకు పంపించవచ్చు. దీని కారణంగా, ఆ కార్మికుడు కొత్త వర్క్ పర్మిట్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.  

     (3) లేబర్ ఇన్స్ పెక్టర్  పంపిన నివేదిక ఆధారంగా లేబర్ కోర్టు కార్మికునికి అనుకూలంగా కనుక తీర్పును వెలువరిస్తే , ఆ కార్మికుడు వేతనం  మరియు అన్ని ఇవ్వవలసిన చెల్లింపులకు అర్హుదవుతాదు. ఈ పేర్కొన్న అధికరణలో మాదీరిగా కార్మికుడు కనుక ఉంటె, సంబంధిత కార్మికుడు నూతన వర్క్ పర్మిట్ కు  అర్హుదవుతాదు.  

 

యూఏఈ న్యూ లేబర్‌ రూల్స్‌: మీరెలా తొలగింపబడవచ్చు? 


కొత్త సంవత్సరంలో కొత్తగా మూడు లేబర్‌ రూల్స్‌ని రాజ్యాంగ బద్ధంగా, అంతర్జాతీయ లేబర్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం అమల్లోకి వస్తాయని మినిస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ చైర్మన్‌ ఆఫ్‌ నేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ అథారిటీ (ఎన్‌క్యుఎ) సక్ర్‌ ఘోబాష్‌ చెప్పారు. ఆ లేబర్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయి? అందులో ఏమేం ఉన్నాయో, సవివరంగా చూద్దాం. 
ఎలా ఉద్యోగి సర్వీసులనుంచి తొలగించబడవచ్చు? 
రెండో రూల్‌ ఉద్యోగి తొలగింపుపై స్పష్టతనిస్తుంది. ఇందులో ఆరు ముఖ్యమైన అంశాల్ని పేర్కొన్నారు. రెండేళ్ళకు మించని ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ కాంట్రాక్టులకు సంబంధించి ఉద్యోగి తొలగింపు పలు కారణాలతో జరగడానికి ఈ రూల్‌ ఉపకరిస్తుంది. 
1. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత యజమాని, ఉద్యోగి పరస్పర అవగాహనతో ఒప్పందం రద్దు చేసుకోవచ్చు. రెన్యువల్‌కి ముందే ఇది జరగవలసి ఉంటుంది. 
2. ఒప్పంద సమయంలోనే యజమాని, ఉద్యోగిని తొలగించాలన్నా, ఉద్యోగి యజమాని నుంచి విడిపోవాలన్నా పరస్పర అవగాహన కలిగి ఉంటే అప్పుడూ తొలగింపు వీలవుతుంది. 
3. రెన్యువల్‌ సమయంలో యజమాని లేదా ఉద్యోగి ఒప్పందాన్ని పరస్పర అవగాహన లేపోయినా రద్దు చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత వచ్చే లీగల్‌ ఇబ్బందుల్ని రద్దు కోరినవారే భరించాల్సి ఉంటుంది. 
4. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే దానికీ కొన్ని అవకాశాలున్నాయి. 
ఎ. రద్దు చేసుకోవాలనుకున్నవారు నెల రోజులకు తక్కువ కాకుండా, మూడు నెలలకు మించకుండా ఈ మధ్య సమయంలో సవివరణాత్మక నోటీసును ఇవ్వవలసి ఉంటుంది. 
బి. నోటీసు ఇచ్చిన తర్వాత ఇరువురి మధ్యా సయోధ్య కుదరని పక్షంలో, నోటీసు పరిమితి కాలం మూడు నెలలుగా పరిగణించబడ్తుంది. ఒప్పందం రద్దు చేసుకోవడానికి తగిన సొమ్మును చెల్లించవలసి ఉంటుంది. 
సి. కాంపెన్సేషన్‌ విషయంలో సరైన అఅవగాహన రాని పక్షంలో అది మూడు నెలల జీతానికి మించకూడదు. 
5. యజమాని లేదా ఉద్యోగి చట్టపరమైన నిబంధనల పరంగా నడుచుకోకుండా విడివిడిగా ఒప్పందాలు రద్దు చేసుకుంటే, ఆ రద్దు చెల్లదు. 
6. ఆర్టికల్‌ 120 ల్యాబర్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ ప్రకారం ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు ఉద్యోగి పాల్పడితే, ఒప్పందం రద్దవుతుంది. 
అపరిమిత ఒప్పందాల విషయంలో... 
ఉద్యోగి, యజమాని మధ్య అపరిమిత కాల ఒప్పందాలు జరిగి ఉంటే, నాలుగు సందర్భాల్లో వాటిని రద్దు చేసుకోవచ్చు. 
1. ఇరు వర్గాలూ పరస్పర అవగాహనతో రద్దు చేసుకుంటే 
2. కాంట్రాక్ట్‌ రద్దు చేసుకోవాలనుకున్న పార్టీ నెల రోజులకు తగ్గకుండా 3 నెలలకు మించకుండా ముందస్తు నోటీసు ఇవ్వడం ద్వారా, ఆ నోటీసు కాలంలో తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు. 
3. ఒక పార్టీ కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుని, చట్టపరమైన అవకాశాలను ఆశ్రయించకుండా ఉంటే, అలాంటి సందర్భాల్లో కాంట్రాక్టు రద్దవుతుంది, అలాగే రద్దు చేసుకున్న వ్యక్తి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
4. లేబర్‌ రిలేషన్స్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ 120 ఆర్టికల్‌ ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు ఆ పార్టీ కాంట్రాక్టు రద్దు అవుతుంది. 
న్యాయస్థానాలను ఆశ్రయించడం 
ఈ క్రింది సందర్భాలలో యజమాని లేదా ఉద్యోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలుంది. 
1. యజమాని ఉద్యోగికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం. (60 రోజులు దాటినా చెల్లించని పక్షంలో) 
ఎ. ఉద్యోగులు మినిస్ట్రీకి ఫిర్యాదు చేస్తే, మినిస్ట్రీకి చెందిన ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌, ఆ సంస్థలో వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తుంది. 
బి. మినిస్ట్రీ ఆ ఫిర్యాదుని న్యాయస్థానానికి పంపిస్తుంది. న్యాయస్థానం అనుకూలమైన తీర్పును ఇస్తే, కాంట్రాక్టుని రద్దు చేయడంతోపాటు, రావాల్సిన జీతాన్ని సంస్థ నుంచి ఇప్పిస్తుంది. 
ఈ రూల్స్‌ని ఘోబాష్‌, 300 మంది మినిస్ట్రీ ఉద్యోగులకు, లీగల్‌ స్కాలర్స్‌కి పంపించారు రివ్యూ కోసం. వారు వాటిని పరిశీలించి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వనున్నారు.

 

'ఆరు నెలల నిషేధం' ఎత్తివేత

ఉద్యోగ సంస్థకు, ఉద్యోగికీ మధ్య పరస్పర అవగాహనతో ఒప్పందాల్ని రద్దు చేసుకుంటే, వారిపై ఆరు నెలల నిషేధం ఇకపై నుంచి ఎత్తివేస్తున్నట్లు యూఏఈ లేబర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. 2016 జనవరి నుంచి ఈ కొత్త వెసులుబాటు అమల్లోకి రానుంది. ఇక నుంచి ఓ చోట పని మానేసినవారు, వెంటనే ఇంకో చోట పని వెతుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే లెవెల్‌ 4 మరియు 6 కిందకు వచ్చే వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు. ఈ కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లను లేబర్‌ మినిస్ట్రీ ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ - అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ హమాయిద్‌ రషీద్‌ బిన్‌ దిమాస్‌ అల్‌ సువైది మాట్లాడుతూ, ఈ కొత్త నిర్ణయం ఒప్పందం ప్రకారం రెండేళ్ళు ఒకే చోట పనిచేయాలనే అగ్రిమెంట్‌ చేసుకున్నవారు కూడా, సంస్థ అనుమతితో ఒప్పందం రద్దు చేసుకుని, వెంటనే తమకు నచ్చిన వేరే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలో భాగంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే ఇతర దేశాల నుంచి వర్కర్లను తెచ్చుకోవడం కాకుండా, స్వదేశంలోనే టాలెంట్‌ ఉన్న వర్కర్లను ఎంరేజ్‌ చేయడానికి మినిస్ట్రీ ప్రయత్నిస్తోందని సవైది చెప్పారు.

 

నిషేధం అంటే ఏమిటి?

ఇది న్యాయపరమైన నిషేధం. ఆయా దేశాలలో పని చేసే వ్యక్తులను తిరిగి, ఆ దేశాలలో మరల ప్రవేశించకుండా అడ్డుకొనే ప్రక్రియ. నిషేధానికి  గురైన వ్యక్తి ఆ దేశాలలో పని చేయడానకి అనర్హుడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో  రెండు రకాల నిషేధాలు అమలులో కలవు. 
1) ప్రవేశ నిషేధం 
2) పని నిషేధం , ఉద్యోగ నిషేధం , పని అనుమతి నిషేధం.
  ప్రవేశ నిషేధం అంటే ఏమిటి ?
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , జి .ఇ.సి. దేశీయులు కాక మిగిలిన దేశాలకు చెందిన వారందరు 
  అవసరమైన అనుమతి కలిగి ఉండాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనుక తమ దేశాలలో ప్రవేశించే 
  వ్యక్తులకు ప్రవేశిక అనుమతి ఇవ్వనపుడు మీరు గ్రహించాలిసింది ఏమిటంటే, యు ఎ ఈ ప్రభుత్వం నుంచి 
  మీకు  "  ప్రవేశ  అనుమతి నిషేధం " అమలులో ఉందన్న సంగతి.
  ప్రవేశ నిషేధానికి  కారణాలు ....
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలో '  ప్రవేశ నిషేధానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందలో మనం 
  కొన్ని ప్రాచుర్యమైన ప్రధాన కారణాలు చర్చిద్దాం. 
  నేర చర్యలు , అక్రమ వీసాతో దేశములో రాకపోకలు కొనసాగించడం , నకిలీ పాసుపోర్ట్ తో చట్ట విరుద్దం గా 
చొరబడటం, అక్రమ ఆయుధాల రవాణా, మాదక ద్రవ్యాల సరఫరా , చెల్లని చెక్కులను ఇచ్చారని  ఆరోపణ 
, హత్య కేసులు ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అవి ఏమిటంటే , 
  దొంగతనాలు, అత్యాచారాలు , పలు హింసాత్మక ఆరోపణలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 
  ప్రభుత్వ చట్టాలను అతిక్రమించే వారికి ప్రవేశ అనుమతి ఉండదు.
  ప్రవేశ అనుమతిని ఈ విధంగా తొలగించవచ్చు ?
  ఇది అందరు తరుచుగా అడిగే ప్రశ్న, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నుంచి " ప్రవేశ అనుమతి  
  నిషేధం " తొలగించుకొనేందుకు  ఈ - సేవలు  వంటి సదుపాయం ఏమైనా ఉందా అని పలువురు తమ 
  సందేహాలను అడుగుతున్నారు. దీనికి జవాబు ఏమిటంటే, " లేదు " అనేదే పెద్ద సమాధానం. " ప్రవేశ  
  అనుమతి నిషేధం "  ఎంత కాలం అమలులో ఉంటుందంటే , ఆయ నేరాలకు పాల్పడిన వ్యక్తుల శిక్షా  
  కాలం పూర్తిగా ముగిసెవరకు ఉంటుంది. 
  పని నిషేధం  లేదా పని అనుమతి నిషేధం ....
  పని నిషేధం అంటే ఏమిటి ?
  ఇతర కారణాలు లేకుండా ఒక వ్యక్తి  అకస్మాతుగా చేస్తున్న ఉద్యోగం వదిలివేయడం , పని ఒప్పందపు 
  నిబంధనలను  ఉల్లంగించడం, ఒక ఉద్యోగం వదిలి మరోక ఉద్యోగం లోనికి మారడం వంటి చర్యలు 
  కారణంగా పలువురిపై " పని నిషేధం " అమలవుతుంది.
ఇవి రెండు రకాలు  ఉపాధి నిషేధం లేదా పని అనుమతి నిషేధం 
  1) 6 నెలల పని నిషేధం 
  2) ఒక ఏడాది పని నిషేధం 
                                    6 నెలల పని నిషేదానికి కారణాలు : .
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధి లో ఉన్న పలు  కంపెనీలలో పని చేసే కార్మికులు ఎటువంటి ప్రధాన    
  కారణం లేకుండగానే అకస్మాతుగా  ఉద్యోగం మానివేస్తే వారు సహజంగానే, 6 నెలల పాటు పని  
  నిషేదానికి గురయ్యే విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక శాఖ విధానాలు రూపొందించింది. ఈ 
  పని నిషేధం  అమలులో ఉన్నంత కాలం సంబంధించిన కార్మికుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలో 
  ప్రవేశించడానికి  ఎటువంటి  అనుమతి ఉండదు. 6 నెలల పని నిషేధం పూర్తి అయ్యేవరకు ఇదే విధానం 
  కొనసాగుతుంది.
  6 నెలల పని నిషేధం ఉన్ననేను విజిటింగ్ వీసా ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సందర్శనకు వెల్ల 
  వచ్చా ?    
  అవును వెళ్ళవచ్చు. ప్రభుత్వం నుంచి  విజిటింగ్ వీసాకు ఎటువంటి నిభందనలు లేవు. విజిటింగ్ వీసా , 
  టూరిస్ట్ వీసాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎటువంటి అద్దంకి కల్పించదు.
  6 నెలల పని నిషేధంను ఎలా తొలగించుకోవచ్చు ?
  దేశం విడిచి పెట్టకుండా పని నిషేధం ఎలా తొలగించుకోవచ్చు ?
  6 నెలల పని నిషేధం ఉంటే, ఎలా మరొక వీసాకు దరఖాస్తు చేయాలి ?
  ఇంటర్నెట్,  సోషల్ వెబ్సైట్లులలో  6 నెలల పని నిషేధం ఎలా తొలగించుకోవాలనే పలు సందీహాలతో  
  నిండి  ఉంది. దీనికి సమాధానం ఏమిటంటే, మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థానికంగా నివసిస్తూ  
  ప్రభుత్వ  ఉద్యోగి ఫ్రీజొనేలో ఉద్యోగం కొరకు వెతుక్కోవాలంటే మీరు కనీసం హై స్కూల్  విద్యార్హతతో  
  5000 ఎ ఈ డి నెలవారీ జీతం వచ్చే ఉద్యోగం వెతుక్కోవచ్చు. అలాగే , మీకు డిప్లొమా కనుక ఉంటే,  
  7000 ఎ ఈ డి  నెలవారీ జీతంతో, అలాగే మీకు డిగ్రీ చదివిన వారు కనుక అయితే 12000 ఎ ఈ డి లను 
  నెలవారీ జీతాలను పొందే ఆవకాశం ఉంది. 
  ఒక ఏడాది పని నిషేదానికి కారణం ఏమిటి ?
  నీకు పని కల్పించిన సంస్థకు గాని వ్యక్తికి గాని వ్యతిరేకంగా కనుక వ్యవహరించడం , ప్రభుత్వ ఉద్యోగానికి 
  సంబంధించిన లిమిటెడ్ లేబర్ కాంట్రాక్టు విధానానికి లేదా పనికి సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా 
  ప్రవర్తిస్తే ఒక ఏడాది పని నిషేధం సంబంధించిన వ్యక్తి పై  ఉంటుంది. 
  ఉద్యోగ నిషేధం రాని భాగ్యం గల ఉద్యోగి ఎవరు ?
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో  పని నిషేధం లేకుండా ఎవరైనా వున్నారా ?
  అవును ఉన్నారు. ఈ దిగువ సూచించిన వారికి ఈ నిషేధం ఉండదు. 
  ( 1 )  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వం కలిగి వున్నా వారికి పని నిషేధం ఉండదు. అలాగే ప్రవేశ  
          అనుమతి, పని నిషేధం ఉండదు.
  ( 2 )  ఆయల్ కంపెనీలలో ఉద్యోగులకు పని నిషేధం ఉండదు.
  ( 3 )  ఒకే జోనేలో పని చేస్తున్న ఉద్యోగులకు పని నిషేధం వర్తించదు ,
  ( 4 )  ప్రభుత్వ లేదా ప్రభుత్వరంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులకు ఇది అమలు కాదు .
  ( 5 )  ఒప్పందపు నిబంధనలను సక్రమంగా పూర్తి చేసిన వారికి ఇది అమలు కాదు.
  ( 6 )  ఒప్పందం లేని సంస్థ లో ఉద్యోగి కనుక అయెతే , 3 ఏళ్ళ కాలం ఆ వ్యక్తి పూర్తి చేసిన వారికి ఒక 
          ఏడాది పని నిషేధం ఉండదు.

 

6 నెలల నిషేధము ఎత్తివేతకు నియమనిబంధనలు

A) లిమిటెడ్ కాంట్రాక్టులో ఉన్న వ్యక్తి 2 సం. ల కంటే తక్కువ కాలం పనిచేసి మానివేసినట్టైతే,  అతనిపై 6 నెలల నిషేధం విధించబడుతుంది.

6 నెలల నిషేధమును ఎత్తివేయవచ్చును.

6 నెలల నిషేధము ఎత్తివేతకు నియమనిబంధనలు:-

1. ఆ ఉద్యోగి తప్పనిసరిగా క్వాలిఫైడ్ అయిఉండాలి మరియు కనీస వేతనం -

హైస్కూల్ ఏటెస్టెడ్ సర్టిఫికేట్ గలవారికి - 5000
డిప్లొమా ఏటెస్టెడ్ సర్టిఫికేట్ గలవారికి   - 7000
ఏటెస్టెడ్ బాచులర్ మరియు ఆపై విద్యార్హత గల వారికి - 10,000


2. ఉద్యోగి, అదే యజమాని వద్ద తిరిగి చేరినట్లైతే, 6 నెలల నిషేధం అసంకల్పితంగా తొలగించబడుతుంది.

3. ఒక ఉద్యోగి కార్మిక శాఖ వారికి ఈ కింది కారణాలపై ఫిర్యాదు ఇచ్చినట్లైతే:

2 నెలలు లేదా అంతాకుపైన జీతం ఆలస్యమైతే.
కంపెనీ మూసివేయబడితే.
సేవలకు అంతం లేనట్లైతే
సరైన కారణం లేకుండా తొలగించినట్లైతే


B) ఒక వ్యక్తి లిమిటెడ్ కాంటాక్టులో ఉంటూ, 2 సం. లలోపు రాజీనామా చేసినట్లైతే, లిమిటెడ్ కాంట్రాక్టును భంగపరచినందుకు తీసివేయలేనపుడు, ఆ కంపెనీవారి అభ్యర్ధన మేరకు ఆ వ్యక్తిపై 6 నెలలు లేదా 1 సం. నిషేధం విధించబడుతుంది.

C) రెండు సంవత్సరాల కంటే ఎక్కువ:-

పై రెండు రకాల కాంట్రాక్టులపై, కార్మిక శాఖ వారు 6 నెలల నిషేధం విధించరు; కానీ కాంట్రాక్టు పరిమితమైనపుడు,  లిమిటెడ్ కాంట్రాక్టును మీరినందుకు కంపెనీ వారు 1 సం. తిరిగి తొలగించలేని నిషేదం కొరకు అభ్యర్ధించవచ్చు.

 

ఎన్నారైలకు వారసత్వపు హక్కు ఉంటుందా?


ఎన్నారైలకు వారసత్వ హక్కు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. అలాగే భారత్‌లో నివసిస్తున్న వారు కూడా ఎన్నారైలకు వారసత్వ హక్కు ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. అయితే ఎన్నో ఏళ్ల కిత్రం భారత్‌ నుంచి వెళ్లిపోయి.. ఒక్కసారి కూడా ఇండియాకు రాని వారైనా సరే లీగ్‌ల్‌గా ఇక్కడి ఆస్తికి వారసులే. వారసత్వంగా సంక్రమించిన రెసిడెన్సియల్‌ ల్యాండ్‌, కమర్షియల్‌ ల్యాండ్‌ మాత్రమే కాకుండా అగ్రికల్చర్‌ ల్యాండ్‌ మీద కూడా వారికి హక్కు ఉంటుంది. అలాగే అవి వారికి బహుమతిగా వచ్చినా కూడా వారు లీగల్‌గా వాటికి వారసులే. కాగా, ప్రస్తుతం భారత్‌లో ఇన్‌హరిటెన్స్‌ (వారసత్వ) టాక్స్‌ విధానం అమల్లో లేదు.
నిజానికి భారత సంతతికి చెందిన వారే కాకుండా విదేశీయులకు కూడా వారసత్వ హక్కు ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన పౌరులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే వారసత్వ హక్కు పొందవచ్చు. అయితే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌, చైనా, ఇరాన్‌, నేపాల్‌, బూటాన్‌లకు చెందిన పౌరులకు మాత్రం ఆర్బీఐ ఆదేశాల మేరకే వారసత్వ హక్కు లభిస్తుంది.

 

ఎన్నారైలూ.. మీ పేరు లీగల్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా?


కొంతమంది చాలా కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవాలనుకుంటారు. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటారు. అలాగే ఎన్నారైలు తమ పాస్‌పోర్ట్‌లోని పేరును లీగల్‌గా మార్చుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతూ ఉంటారు.
అలాంటి వారికి సహాయ పడేందుకే ఈ కథనం.
1) ముందుగా పేరును లీగల్‌గా మార్చుకోవాలనుకుంటున్నామని ఓ రిక్వెస్ట్‌ లెటర్‌ పెట్టాలి. ఈ లెటర్‌ భారత్‌లోని ఫస్ట్‌ క్లాస్‌ మేజిసే్ట్రట్‌ ఇచ్చే నోటరీ రూపంలో ఉండాలి. విదేశాల్లో ఉండే ఎన్నారైలు తమకు దగ్గర్లో ఉండే ఇండియన్‌ కాన్సులేట్‌ నుంచి ఈ అఫిడవిట్‌ను పొందవచ్చు.
2) అలాగే ఓ తెల్ల కాగితంపై పాత పేరు, మార్చుకోవాలనుకుంటున్న పేరు, తండ్రి పేరుతోపాటు చిరునామా కూడా రాయాలి. ఉద్యోగం చేస్తున్నట్టైతే యజమాని పేరు కూడా రాయాలి. అలాగే దాని మీద ఇద్దరు సాక్ష్యుల ఎదుట సంతకం చేసి వారి సంతకాలు కూడా తీసుకోవాలి.
3) అనంతరం ఏదైనా స్థానిక వార్తా పత్రికలో పేరు మార్చుకున్న విషయం గురించి ఓ ప్రకటన ఇవ్వాలి. అందులో కూడా పూర్తి వివరాలు ఉండాలి. ఆ న్యూస్‌ ప్రింట్‌ కాపీని భద్రపరుచుకోవాలి.
4) అనంతరం సంబంధిత దరఖాస్తులను కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, సివిల్‌ లైన్స్‌, ఢిల్లీ-54 అనే చిరునామాకు పంపించాలి.
జతచేయవలసిన డాక్యుమెంట్లు:
ఎ) అటెస్టెడ్‌ అఫిడవిట్‌ (నోటరి)
బి) సాక్ష్యుల సంతకాలతోపాటు వివరాలు నమోదు చేసిన డాక్యుమెంట్‌
సి) రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోగ్రాఫ్స్‌
డి) ప్రకటన ఇచ్చిన వారపత్రిక కాపీ
ఇ) నిర్దేశించిన ఫీజు
5) నేమ్‌ చేంజ్‌కు నిర్దేశించిన ఫీజు భారత కరెన్సీలో రూ.900. దీన్ని డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా పంపించాలి. కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌ పేరు మీద డీడీ తీయాలి.

 

ఉచితంగా పాస్‌పోర్ట్‌ రీ ఇష్యూ

తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర జిల్లాల్లో వర్షాల కారణంగా పాడైపోయిన పాస్‌పోర్టుల కోసం ప్రత్యేకంగా ‘ప్రాంప్ట్‌ రీ ఇష్యూ’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద పాస్‌పోర్టులు పాడైపోయినవారికి ఉచితంగా కొత్త పాస్‌పోర్టులను జారీ చేస్తారు. 
మంగళవారం నుంచి రెండు నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌ 12న వరద బాధితుల కోసం ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళాను చెన్నైలో నిర్వహించనుంది. ఈ మేళాలో కానీ, లేకుంటే ప్రాంతీయ కేంద్రాల్లో కానీ డూప్లికేట్‌ పాస్‌పోర్టును పొందవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు అవసరం లేకుండా ఖాళీ పేపర్‌పై దరఖాస్తును సమర్పించి కొత్త పాస్‌పోర్టును పొందవచ్చు.

 

భారత్‌లో గిఫ్టెడ్‌ ప్రాపర్టీపై ఎన్నారైలు ట్యాక్స్‌ కట్టాలా?


బహుమతిగా లభించిన ఆస్థికి ట్యాక్స్‌ చెల్లించాలా, వద్దా అనే విషయంలో చాలా మంది సందిగ్ధానికి గురవుతూ ఉంటారు.
బంధువుల నుంచి తీసుకునే గిఫ్టెడ్‌ ప్రాపర్టీకి కూడా ట్యాక్స్‌ కట్టాలా?
లాటరీలు, బహుమతులు వంటి వాటి ద్వారా లభించే ప్రాపర్టీలను ఎలా పరిగణిస్తారు?

భారత్‌లో గిఫ్ట్‌ ట్యాక్స్‌ అనేది లేదు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. 1958లో చేసిన గిఫ్ట్‌ ట్యాక్స్‌ ఏక్ట్‌కు 1998, అక్టోబర్‌ 1న సవరణ చేశారు. ఈ నిబంధన ప్రకారం బంధువుల వద్ద నుంచి బహుమతిగా వచ్చిన ఆస్థులకు ట్యాక్స్‌ చెల్లించనవసరం లేదు. వారి నుంచి ఎంత పెద్ద మొత్తంలో లభించినా.. అది ట్యాక్స్‌ ఫ్రీ ప్రాపర్టీనే. అయితే బంధువుల విషయంలో కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. కింది సూచించిన వారి నుంచి వచ్చిన ఆస్థికి మాత్రమే ట్యాక్స్‌ ఉండదు.
1)భార్య లేదా భర్త 
2)సోదరుడు లేదా సోదరి 
3)భర్త లేదా భార్య యొక్క సోదరుడు లేదా సోదరి 
4)తల్లి లేదా తండ్రి యొక్క సోదరుడు లేదా సోదరి 
5)భర్తకు లేదా భార్యకు వారసత్వంగా వచ్చిన ఆస్థి
పైన సూచించిన వారి ద్వారా వచ్చిన ఆస్థికి మాత్రమే ట్యాక్స్‌ కట్టనవసరం లేదు. అలాగే బంధువులు కాని వారి నుంచి, లాటరీల ద్వారా, స్కీముల ద్వారా ఆస్థి వచ్చినట్టయితే.. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇలా నాన్‌ రిలేటివ్‌ వ్యక్తుల ద్వారా వచ్చిన ఆస్థి విలువ రూ.50,000 దాటితే దానికి ట్యాక్స్‌ కట్టాల్సిందే. రూ.50,000 లోపైతే మాత్రం ట్యాక్స్‌ చెల్లించనవసరం లేదు. ఈ విషయంలో మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ట్యాక్స్‌ వేయాలా, వద్దా అనేది నిర్ణయిస్తారు.
గుర్తుంచుకోవాల్సినవి: 
1)ఇటీవల ఓ ఎన్నారై మహిళ భారత్‌కు వచ్చినపుడు ఇక్కడి వ్యక్తి.. ‘మీకు రూ.60,000 క్యాష్‌ రూపంలో ఇస్తాను. నాకు మీరు రూ.50,000 చెక్‌ ఇమ్మ’ని అడిగాడు. నిబంధనల పట్ల అవగాహన లేని ఆ మహిళ అలాగే చేసింది. ఇది బ్లాక్‌ మనీనీ వైట్‌ మనీగా మార్చుకునే ప్రక్రియ. ఇది చట్టవ్యతిరేకం అయినందున ఆ మహిళ పెనాల్టీ కట్టవలసి వచ్చింది. ఇలాంటి విషయాల్లో ఎన్నారైలు జాగ్రత్తగా ఉండడం మంచిది.
2)అలాగే తమకు గిఫ్ట్‌గా లభించిన ప్రాపర్టీ తాలూకు డాక్యుమెంట్స్‌ విషయంలో కూడా ఎన్నారైలు జాగ్రత్త వహించాలి.

 

కువైట్‌ ఎన్నారైలూ... పాస్‌పోర్టు రెన్యువల్‌ చేసుకోండి

పాస్‌పోర్టు గడువుతో రెసిడెన్సీ గడువుకు లంకె పెట్టాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు కొన్ని సూచనలు చేసింది. ప్రవాస భారతీయులు తమ పాస్‌పోర్టును వెంటనే రెన్యువల్‌ చేసుకోవాలని, లేదంటే చట్టపరమైన చిక్కులు ఎదురు కావచ్చని హెచ్చరించింది. ఎంబసీ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
దాని సారాంశం ఇదీ...
1) పాస్‌పోర్టు గడువుకు మించి రెసిడెన్స పర్మిట్‌ గడువు ఉండడానికి వీల్లేదు.
2) పాస్‌పోర్టు గడువు ఏ రోజు ముగుస్తుందో రెసిడెన్సీ పర్మిట్‌ కూడా ఆ రోజుతోనే ముగుస్తుంది.
3) పాస్‌పోర్టు గడువుతో రెసిడెన్సీ పర్మిట్‌ను లింకు చేయాలన్న నిర్ణయం 2016 జనవరి 1 నుంచి అమలు కాబోతోంది.
4) జనవరి 1 వరకూ ఉన్న గడువును ఉపయోగించుకుని ఇక్కడి భారతీయులందరూ తమ పాస్‌పోర్టును రెన్యువల్‌ చేసుకోండి
5) పాత పాస్‌పోర్టులోని డేటాను కొత్త పాస్‌పోర్టులోకి మార్చుకోవడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెసిడెన్స అఫైర్స్‌ (సివిల్‌ ఐడీలో ఇచ్చిన చిరునామా ప్రకారం)ను సంప్రదించండి’’.

 

భారత నర్సులకు స్వాగతం పలుకుతున్న సౌదీ!


ప్రస్తుతం భారత్‌లో శిక్షణ పొందిన, పొందుతున్న నర్సులకు సౌదీ అరేబియా మంచి అవకాశం ఇచ్చింది. త్వరలో భారీ సంఖ్యలో నర్సులను రిక్రూట్‌ చేసుకోనున్నామని, ఎక్కువగా భారత్‌ నుంచే తీసుకోవాలనుకుంటున్నామని భారత్‌లోని సౌదీ ఎంబసీ అధికారి సౌద్‌ మహ్మద్‌ తెలిపారు. అయితే గవర్న్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్‌ ఉంటుందని తెలిపారు.
ఈ మేరకు సాద్‌ మహ్మద్‌, ఓవర్సీస్‌ ఇండియన్‌ ఎఫైర్స్‌ సెక్రటరీ అనీల్‌ కుమార్‌ అగర్వాల్‌ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఓవర్సీన్‌ డెవలెప్‌మెంట్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్స్‌ (ఓడీఈపీసీ), ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఓఎమ్‌సీ) ఈ రిక్రూట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తాయి. కాగా, కువైట్‌, యూఏఈ వంటి దేశాలు కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నాయి.

 


గల్ఫ్ ఎన్నారైలు డ్రగ్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి!


గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో 60 శాతం మంది వివిధ రకాల డ్రగ్స్‌ కేసుల్లో అరెస్టయినవారే. వారందరూ సెంట్రల్‌ జైలులో ఉన్నారని ఇటీవల ఓ అధికారిక ప్రకటన వెలువడింది. కువైట్‌, సౌదీ అరేబియా వంటి అరబ్‌ కంట్రీస్‌లో డ్రగ్స్‌ కేసులను తీవ్రంగా పరిగణిస్తారు. నిషేధిత డ్రగ్స్‌తో పట్టుబడితే యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఒక్కోసారి ఉరిశిక్ష విధించే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో జాగ్రత్తగా ఉండాలని భారత ఎంబసీ ఎన్నారైలను హెచ్చరిస్తోంది.

"గల్ఫ్ సెంట్రల్‌ జైలులో మగ్గుతున్న భారతీయుల్లో అరవై శాతం మంది డ్రగ్స్‌ కేసుల్లో అరెస్టయిన వారే. ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కువైట్‌ లీగల్‌ సిస్టమ్‌ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందులో భారత ఎంబసీలు కూడా పెద్దగా ఏమీ చేయలేవ’ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒక్కోసారి మనం ఏ తప్పూ చేయకుండా డ్రగ్స్‌ కేసుల్లో అరెస్టయినా కూడా.. న్యాయ విచారణ పూర్తయ్యేవరకు అంటే దాదాపు కొన్ని నెలలపాటే జైలులోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. కువైట్‌లో దాదాపు 8 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరందరూ ఖచ్చితంగా కువైట్‌ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పకుండా పాటించవలసిందేనని సూచించింది.

మరీజుయానా, మార్ఫిన్‌, కొకైన్‌, హెరాయిన్‌, డ్రై ఐస్‌, ఎమ్‌డీఎమ్‌ఎ వంటి డ్రగ్స్‌ జోలికి అస్సలు వెళ్లకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోగానీ, ప్రయాణసమయాల్లో గాని అపరిచిత వ్యక్తులు ఇచ్చిన పార్సిల్స్‌ను అసలు తీసుకోకూడదు. అలాగే లగేజీని జాగ్రత్తగా సీల్‌ చేసి వాటిని కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే అరబ్‌ కంట్రీస్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జోరుగా జరుగుతుంది. అక్కడి స్మగ్లర్లు ప్రయాణికుల బ్యాగుల్లో వారికి తెలీకుండానే డ్రగ్స్‌ పెట్టి అక్రమ రవాణా చేస్తుంటారు. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం.

 

గల్ఫ్‌ ఎన్నారైలే భారత్‌కు ఎక్కువ డబ్బు పంపుతున్నారు!


ఎన్నారైలు అనగానే ఎక్కువమందికి అమెరికా, కెనడా, యూరప్‌లలో నివసిస్తున్నవారే ఎక్కువగా గుర్తుకువస్తారు. ప్రభుత్వం కూడా వారి పట్లే ఎక్కువ ఆదరణ చూపిస్తుంటుంది కూడా. నిజానికి భారత సంతతికి చెందిన వారు ఎక్కువగా నివసించేది గల్ఫ్‌ రీజియన్‌లోనే. భారత్‌లోని తమ వారికి డబ్బు ఎక్కువగా పంపేది కూడా గల్ఫ్‌ దేశాల్లో పని చేసేవారే.
యూఎస్‌, కెనడాలతో పోల్చితే గల్ఫ్‌ ప్రాంతంలోనే జీవనోపాధి పొందుతున్న భారతీయులు ఎక్కువ. హోమంత్రిత్వ శాఖ వెలువరించిన గణాంకాలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం గల్ఫ్‌ రీజియన్‌లో భారత సంతతికి చెందిన వారు 56,87,032 మంది నివసిస్తుండగా.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో 9,27,283 మంది నివసిస్తున్నారు. అంటే యూఎస్‌లో నివసిస్తున్నవారికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఇండియన్స్‌ గల్ఫ్‌ దేశాల్లో జీవనం సాగిస్తున్నారు.
ఇక కెనడాలో రెండు లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా పర్షియన్‌ గల్ఫ్‌కు చెందిన ఆరు దేశాల్లోనే ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు. కాగా, స్వదేశానికి డబ్బు పంపే విషయంలో కూడా గల్ఫ్‌ ఎన్నారైలే ముందున్నారు. 2012 సంవత్సరం నాటికి గల్ఫ్‌రీజియన్‌లో నివసిస్తున్న ఎన్నారైలు దాదాపు 32వేల కోట్ల రూపాయలను భారత్‌కు పంపించారు. అలాగే అదే సమయానికి అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు భారత్‌కు దాదాపు 15వేల కోట్లు పంపించారు.


ప్రవాస ఎన్నారైలకు భారత రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్!

ఎన్నారైలకు భారత రిజర్వ్‌బ్యాంకు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్‌ పెన్సన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలకు అవకాశం కల్పిస్తున్నట్టు రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది.
‘వృద్ధాప్యంలో సోషల్‌ సెక్యూరిటీ కోసం రూపొందించిన ఈ స్కీములో ఎన్నారైలకూ భాగం కల్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్‌ పెన్సన్‌ స్కీమ్‌ ఎన్నారైలకు ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా కూడా ఉపయోగపడనుంద’ని రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది. ఎన్నారైలు ఎన్‌ఆర్‌ఇ/ఎన్‌ఆర్‌ఓ/ఎఫ్‌సీఎన్‌ఆర్‌ వంటి నార్మల్‌ బ్యాంకు చానల్స్‌ను ఉపయోగించుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొంది.
నేషనల్‌ పెన్సన్‌ స్కీమ్‌ కింద పెన్సన్‌ నిధులను మూడు విధానాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఫిక్సిడ్‌ ఇన్‌కమ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఈక్విటీ, గవర్నమెంట్‌ సెక్యూరీటీస్‌ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టర్‌ చాయిస్‌ను బట్టి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

 

గల్ఫ్‌ ఇండియన్స్‌ భారత్‌కు వచ్చేటప్పుడు రూ.7,500 మించి తీసుకురాకూడదు!


గల్ఫ్‌ రీజియన్‌లో నివసించే ఎన్నారైలు భారత్‌కు వెళ్లేటప్పుడు 7,500 రూపాయలకు మంచి భారత కరెన్సీని తమతోపాటు తెచ్చుకోకూడదని భారత ఎంబసీలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో భారత కరెన్సీని తమతో తెచ్చుకుంటున్న ఎన్నారైలు ఎయిర్‌పోర్ట్‌లలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని సూచించాయి. నకిలీ కరెన్సీని అరికట్టడానికే కస్టమ్స్‌ అధికారులు ఈ ప్రకటన చేశారని గల్ఫ్‌ రీజియన్‌లోని ఇండియన్‌ మిషన్‌ తెలిపింది.
అమెరికా, యూకేలతో పోల్చితే దుబాయ్‌, ఒమన్‌, కువైట్‌ వంటి దేశాల నుంచే ఎక్కువగా నకిలీ కరెన్సీ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. దానిని అరికట్టేందుకే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వచ్చే ఎన్నారైలు ఎవరైనా రూ.7,500కు మంచి తమతోపాటు తెచ్చుకోకూడదని, అలాగే అంతే మొత్తానికి మించి విదేశాలకు తీసుకెళ్లకూడదని సూచించింది. ఇది ఎన్నారైలందరికీ వర్తించినా.. ముఖ్యంగా గల్ఫ్‌ రీజియన్‌ కేంద్రంగా ఈ హవాలా నడుస్తున్నందున అక్కడి నుంచి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని మస్కట్‌లోని ఇండియన్‌ ఎంబసీ సూచించింది.

 

 

అత్యధిక శాతం ఎన్నారైలు కువైట్‌లోనే ఉన్నారట!


ఇతర దేశాలతో పోలిస్తే నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ అధిక సంఖ్యలో కువైట్‌లోనే నివసిస్తున్నారట. అధికారికంగా దాదాపు ఎనిమిది లక్షల మంది ఎన్నారైలు కువైట్‌లో ఆశ్రయం పొందుతున్నారట. అలాగే మరో పాతిక వేల మంది చట్టవ్యతిరేకంగా ఉంటున్నారని కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఇటీవల ప్రకటించింది. సంవత్సరానికి ఐదు నుంచి ఆరు శాతం వరకు భారతీయులు కువైట్‌కు వస్తున్నారని, మరో రెండు, మూడు ఏళ్లలో కువైట్‌లోని భారతీయుల సంఖ్య మిలియన్‌ మార్క్‌ చేరుకుంటుందని ఎంబసీ భావిస్తోంది.
కువైట్‌లో ఈజిప్షియన్ల తర్వాత భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారట. అయితే భారతీయుల జెండర్‌ నిష్పత్తి మాత్రం ఆందోళనకరంగా ఉందట. అక్కడ నివసిస్తున్న ఎన్నారైలలో ఆరు లక్షల మంది మగవారుంటే, రెండు లక్షల మంది మాత్రమే ఆడవారు ఉన్నారట. కాగా భారత్‌ నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ కార్మికులుగా, టెక్నీషియన్స్‌గా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌గా పనిచేస్తున్నారట. అలాగే కువైట్‌ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారట. కాగా, కువైట్‌ దేశ వ్యాప్తంగా ఉన్న 20 భారతీయ పాఠశాలల్లో దాదాపు ఇరవై వేల మంది ఎన్నారై విద్యార్థులు చదువుకుంటున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com