పాటల తోటలో కోకిల గానం.. జానకమ్మ గొంతులో మాధుర్యం..
- April 23, 2019తెలుగు సినిమా పాటను తమ గాత్రంతో సుసంపన్నం చేసిన గాయనీమణులు అనేకమంది ఉన్నారు. ఆ అందర్లోకీ కాస్త ఎక్కువ ప్రత్యేకమైన గాయని ఎస్ జానకి. అందుకే సినిమా పాటకి..ఎస్.జానకి గళం.. “కామధేనువు” లాంటిదంటారు డైరక్టర్ కె. విశ్వనాథ్. ఏం కావాలంటే ఆ భావం పలికించగల అత్యున్నత గాయని జానకి. వేలాది పాటలతో వెలలేని అమృతాన్ని వెదజల్లిన మహాగాయని జానకమ్మ బర్త్ డే ఇవాళ.
ఫన్ డాక్టర్ చంద్రశేఖరంగారి కోడలుగా జానకమ్మ అనుకోకుండానే స్టేజ్ ఎక్కారు. ఆయన ప్రోగ్రామ్ మధ్యలో జానకమ్మతో పాటలు పాడించేవారు. ఇలా పాడుతున్న ఆమె పాటను సంగీత దర్శకుడు టి. చలపతిరావు విన్నారు. పెండ్యాలకు రిఫర్ చేశారు. అలా ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశా అడియాసా అనే విషాదగీతంతో ఎంట్రీ ఇచ్చారు జానకి. ఆ తర్వాత చరిత్ర సృష్టించిన జానకమ్మ.. సినిమా పాటకే తలమానికమయ్యారు.
తెలుగు సినిమా తొలినాటి చిత్ర కారుడు బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరంలో జానకితో ఓ అపురూప గీతం పాడించారు. బిఎన్ ఎంతగానో ఇష్డపడే దేవులపల్లి రచించిన పాటలన్నీ జానకితోనే పాడించారు. పగలైతే దొరవేరా పాటలో సున్నితమైన శృంగార భావాల్ని పలికించిన జానకి గాత్రం.. గట్టుకాడ ఎవరో…పాటలో జానపద సొగసుల్నీ అంతే అందంగా పలికిస్తుంది.
కేవి. మహదేవన్ సంగీత దర్శకత్వంలోనూ అజరామరమైన గీతాలెన్నో పాడారు జానకి. జగ్గయ్య హీరోగా వచ్చిన ముందడుగు చిత్రంలో ఆత్రేయ రాసిన కోడెకారు చిన్నవాడా పాటలో షావుకారు జానకికి జానకే ప్లేబ్యాక్ పాడారు. ఆ పాటలో జానకి గాత్రం మనోహరంగా సాగుతుంది. మాధవపెద్ది సత్యంకు ధీటుగా పలుకుతుంది.
సంగీత దర్శకులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జానకితో పాడించుకోడానికే ఉత్సాహం చూపేవారు. జానకి పాడితే తప్ప ఆ ఫీల్ ఆడియన్స్ కు కారీ కాదనేది వారి నమ్మకం . ఎమ్మెస్ విశ్వనాథన్ అంతులేని కథ కోసం కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాట జానకి పాడడం వల్లే వేదన వ్యక్తమైంది.
అదే ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో వచ్చిన మరో చరిత్రలోనూ మరపురాని పాటలెన్నో ఉన్నాయ్. వాటిలో పదహారేళ్లకు నీలోనాలో అంటూ జానకి గళంలో వినిపించే మెలోడీలో వినిపించే రాగాలు వర్ణించలేనివి. సాహిత్యంలోని భావాన్నే కాదు.. సన్నివేశంలోని సారాన్ని సైతంలో గళంలో పలికిస్తుందీ పాటలో.
డైరక్టర్ వంశీ తొలి చిత్రం మంచుపల్లకీలో జానకి ఓ అపురూపమైన గీతం ఆలపించారు. వేటూరి రాసిన ఈ గీతాన్ని రాజన్ నాగేంద్ర స్వరపరిచారు. టైటిల్ ను జస్టిఫై చేస్తూ సాగే ఈ గీతం జానకి తప్ప ఇంకెవరు పాడినా ఆ ఫీల్ క్యారీ అయ్యేది కాదు. సాహిత్యంలోని ఆర్తిని కంఠంలో ఒప్పించగలగడం చిన్న ఫీట్ కాదు. సినిమా గాయకుల గొప్పతనమంతా అక్కడే ఉంది.
ఇసైజ్ఞాని ఇళయరాజా అయితే జానకి వీరాభిమాని. తను స్వరకల్పన చేసిన ప్రతి సినిమాలోనూ జానకితో ఒక్క పాటైనా పాడించుకోకపోతే ఆయనకు కుదరదు. అలా జానకి ఇళయరాజా వేటూరి కాంబినేషన్ లో ఎన్నెన్నో మధురగీతాలు తెలుగు శ్రోతలకు వీనుల విందు చేశాయి. వాటిలో జాతీయ పురస్కారం సాధించిన పాట కూడా ఉండడం విశేషం. సితార కోసం జానకి పాడిన వెన్నెల్లో గోదారి అందం…పాట వినడం నిజంగానే ఓ వరం.
అచ్చమైన తెలుగు ఘజల్ గా చెప్పుకోదగ్గ గీతం ఒకటి రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంది. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం తయారైన ఈ గీతం జానకి పాడడం విశేషం. కవి భావాన్ని, సన్నివేశాన్ని అర్ధం చేసుకుని పాడగలగడమే సినీ నేపధ్య గాయకుల పని. ఆ పనికి నూటికి నూరు శాతం న్యాయం చేశారు జానకి.
నవ్వుల విషయంలోనూ జానకి స్పెషలిస్టు. అలా అంత నాచురల్ గా నవ్వగలిగే ఆర్టిస్టు అంతకు ముందూ లేరు…ఆ తర్వాతా రాలేదు. అది కూడా తను పాటను ఫీల్ అయి పాడడంలోంచే పుట్టింది. జ్యోతిలో సిరిమల్లె పూవల్లే నవ్వు పాటకు జానకి నవ్వులే జీవం పోశాయి. ఇక ముద్దమందారంలో అయితే జొన్నా చేలో జున్ను పాటలో బాలుతో కల్సి జానకి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
జానకి సాహిత్యాన్నీ సందర్భాన్నీ అధ్యయనం చేసి తన గాత్రంలో పలికించే ప్రయత్నం చేస్తారు. అదే తన సక్సస్ మంత్రం అదే. ఆ కాన్ఫిడెన్స్ తోనే బాలసుబ్రహ్మణ్యానికి పోటీ గీటీ అంటూ ఉంటే నేనే అని ఓ సందర్భంగా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పారు. తను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టు కూడా. సప్తపది చిత్రంలో గోవుల్లు తెల్లన లో పిల్లవాడి వరసలన్నీ జానకి స్వరంలో పురుడు పోసుకున్నవే.
సినిమా సంగీతానికి జానకి చేసిన సేవలు కొలవడం సాధ్యం కాని పని. తనకు ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ ఏమంత సంతోషపరచలేదు. భారతరత్న ఇస్తే బాగుండేదని ఆమె అనడం కొంత మందిని బాధించినా…ఆ మాటలోనూ జానకి ఆవేదన నిండి ఉంది. సంగీత కళాకారులను ఎందుకు బిగ్ ఏరియాలో నిర్లక్ష్యం చేస్తున్నారనే బాధ ఉంది. జానకి తెలుగువారి సాంస్కృతిక సంపద.
ఆ మధ్య వయసు మీదపడటం.. ఆరోగ్యం సహకరించకపోవడం.. వంటి కారణాలతో సినిమాల్లోనే కాదు.. ఇకపై ఏ వేదికలపైనా పాడబోనని ప్రకటించారు. ఈ మాట సంగీతాభిమానులను షాక్ కు గురి చేసినా.. ఆమె పంచిన గానసంపద తరిగిపోనిది.. ఆ సంపదనే మళ్లీ మళ్లీ వింటూ జానకమ్మ పాడకపోయినా ఫర్వాలేదు.. మరింత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు