దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు: సిఎం చంద్రబాబు

- March 28, 2025 , by Maagulf
దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు: సిఎం చంద్రబాబు

చెన్నై: ” దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు ” అని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చెన్నైలో పర్యటిస్తున్నారు.మద్రాసు ఐఐటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆల్‌ ఇండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌-2025’లో పాల్గొన్న ముఖ్యమంత్రి …ఐఐటీ విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమం పూర్తయిన తరువాత తర్వాత సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ…. మద్రాస్‌ ఐఐటీ ఎన్నో విషయాల్లో నంబర్‌ వన్‌గా ఉందన్నారు. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందిస్తోందని తెలిపారు. ఐఐటీ మద్రాస్‌ స్టార్టప్‌ అగ్నికుల్‌ మంచి విజయాలు అందుకుందని ప్రశంసించారు. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతమవుతున్నాయన్నారు. ఈ ఐఐటీలో సుమారు 35-40 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు అని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని సిఎం తెలిపారు. రాజకీయ సంస్కరణలతో సోవియట్‌ రష్యా అనేక దేశాలుగా విడిపోయిందని అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిందని ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం ఎదిగింది అని చెప్పారు. భారత్‌ కూడా సంస్కరణల తర్వాత అభివృద్ధి బాట పట్టిందన్నారు. బ్రిటిష్‌వారు మన దేశం నుంచి అంతా తీసుకెళ్లారనీ, ఒక్క ఇంగ్లీష్‌ను మనకు వదిలేశారని విమర్శించారు. 1990లలో కమ్యూనికేషన్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, వీఎస్‌ఎన్‌ఎల్‌ గుత్తాధిపత్యం ఉండేదని తెలిపారు. ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థల రాక ఓ గేమ్‌ ఛేంజర్‌ అని అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను మొదట కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సంబంధం లేదని చెప్పారు. ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నానన్నారు. 45 నిమిషాలు తనతో మాట్లాడారని తెలిపారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ నెలకొల్పాలని కోరానన్నారు. ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారని సిఎం తెలిపారు. కొంతకాలంగా భారత్‌ వఅద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోందన్నారు. 2014లో మనది పదో ఆర్థిక వ్యవస్థ అని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని చెప్పారు. భారత్‌కు ఉన్న గొప్పవరం జనాభా అని, డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అని అన్నారు. మనమంతా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని, మన దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు అని చంద్రబాబు ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com