దుబాయ్ లో రోబో డెలివరీ సేవలు విస్తరణ..!!

- April 24, 2025 , by Maagulf
దుబాయ్ లో రోబో డెలివరీ సేవలు విస్తరణ..!!

దుబాయ్: యాంగో టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత దుబాయ్‌లోని రోబో డెలివరీ సిస్టమ్ త్వరలో ఇతర ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరిస్తుంది. కంపెనీ గత నెలలో శోభా హార్ట్‌ల్యాండ్‌లో తన పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.  “ఆర్డర్ చేస్తున్న వారిలో 40 శాతం కంటే ఎక్కువ మంది డెలివరీ కోసం రోబోట్‌ను ఎంచుకున్నారు.” అని మిడిల్ ఈస్ట్‌లోని యాంగో టెక్ అటానమీ ప్రాంతీయ అధిపతి నికితా గవ్రిలోవ్ అన్నారు. “పూర్తిగా విద్యుత్తుతో నడిచే, వినూత్నమైన రోబోట్ తమ భవనం తలుపు వద్దకు వచ్చి 20 నిమిషాల్లో ఆహారం, కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడాన్ని వారు చూడాలనుకుంటున్నారు. ఇది చాలా ఉత్తేజకరమైనది.” అని పేర్కొన్నారు.  

ఫుడ్ టెక్,  రిటైల్ కంపెనీ రూట్స్,  దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)తో భాగస్వామ్యంతో కంపెనీ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇది 2 కి.మీ పరిధిలో ఆర్డర్‌లను 30 నిమిషాల్లోపు డెలివరీ చేయడానికి డిజైన్ చేశారు. పైలట్ దశలో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

60 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ పాడ్, 10 సెం.మీ ఎత్తు వరకు ఉన్న కాలిబాటలను ఎక్కగలదు. రోడ్లను దాటగలదు. ప్రస్తుతం డెలివరీల కోసం రెండు రోబోలు కమ్యూనిటీలో తిరుగుతున్నాయి. ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, రోబోట్ డెలివరీని తీసుకొని అది డెలివరీ స్థానానికి చేరుకున్నప్పుడు, కస్టమర్‌కు రోబోట్ వచ్చిందని సూచించే వాట్సాప్ మెసేజ్ అందుకుంటాడు. వారి ప్రవేశ ద్వారం వద్ద దానిని మీట్ అయి వస్తువులను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ లో రోబోట్ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని  నికితా గవ్రిలోవ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com