టాలెంటెడ్ యంగ్ హీరో - సందీప్ కిషన్
- May 07, 2025
చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్. వాటిలో సందీప్ కు ఆనందం పంచిన చిత్రాలు కొన్నే అయినా, ఇంకా పట్టువదలని విక్రమార్కునిలా భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సందీప్ కిషన్. నేడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...
సందీప్ కిషన్ 1987 మే 7వ తేదీన మద్రాసులో జన్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఛోటా కె.నాయుడు, శ్యామ్ కె.నాయుడు సోదరి కుమారుడే సందీప్ కిషన్. మేనమామలు ఇద్దరూ చిత్రసీమలో రాణిస్తూ ఉండడం వల్ల సందీప్ మనసు సైతం చిత్రసీమ వైపు పరుగు తీసింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు.
ఆ తరువాత అతని మనసు నటనవైపు మళ్ళింది. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘స్నేహగీతం’తో సందీప్ కిషన్ నటుడయ్యారు. ఆ పై దేవా కట్టా రూపొందించిన ‘ప్రస్థానం’లో సాయికుమార్ కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో సందీప్ కిషన్ నటించినా, హీరోగా అతనికి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మంచి బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో సందీప్ సరసన నాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత “రా రా క్రిష్ణయ్య, బీరువా, జోరు, టైగర్…” ఇలా దాదాపు ముప్పై చిత్రాల్లో హీరోగా నటించాడు. ఈ యేడాది ‘మజాకా’ చిత్రంతో జనం ముందుకు వచ్చాడు. కానీ, సందీప్కు ఆ సినిమా సైతం ఆశించిన సక్సెస్ ను అందించ లేకపోయింది.
సినిమాల్లో బిజీగా ఉంటూనే ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్ ను కూడా స్థాపించిన విషయం తెలిసిందే. గత ఏడాది ప్రారంభించిన ఈ రెస్టారెంట్ కి మొత్తం ఏడు బ్రాంచ్లు ఉన్నాయి..ఈ ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్ నుంచి ప్రతి రోజు ఉచితంగా 50 మందికి భోజనాలు కూడా పంపిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ప్రతిరోజు ఒక్కో రెస్టారెంట్ నుండి 50 మందికి మొత్తం 7 రెస్టారెంట్ల నుండి 350 మంది పేదల కడుపు నింపుతున్నాడు.
ముఖ్యంగా అవసరం ఉన్న పేదలు, కూలీలు అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారాన్ని ఉచితంగా పంపిస్తున్నారు. ఇకపోతే నెలకు రూ.4.50లక్షల విలువ చేసే ఆహారాన్ని సందీప్ ఉచితంగా పంపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి సెలబ్రిటీలు, ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సందీప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తక్కువ ధరకే పేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే త్వరలోనే భాగ్యనగరంలో సబ్సిడీ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడట సందీప్ . ప్రస్తుతం దాని గురించే పని చేస్తున్నానని గత ఏడాది వెల్లడించాడు. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సందీప్ చేస్తున్న మంచి పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.
ప్రస్తుతం సందీప్ తమిళ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో 'SK-31' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్పై భారీ బడ్జెట్తో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతోనైనా సందీప్ కోరుకుంటున్న సక్సెస్ ఆయన దరి చేరుతుందేమో చూడాలి.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







