హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హనోయ్‌కు ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభం

- May 08, 2025 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హనోయ్‌కు ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) తాజాగా ఈ మేరకు ప్రకటించింది. వచ్చే మే 7వ తేదీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్ ఈ నూతన సేవలను ప్రారంభించనుంది.

హనోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే విమానం (VN-984) ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ నుంచి బయిలదేరుతుంది. ఇది స్థానిక సమయానికి పొద్దున్నే 5:25 గంటలకు హనోయ్ చేరుకుంటుంది. తిరిగి హనోయ్ నుంచి బయలుదేరే విమానం (VN-985) అక్కడి సమయానికి సాయంత్రం 7:15 గంటలకు బయలుదేరి, రాత్రి 10:15కి హైదరాబాద్ చేరుకుంటుంది.

పురాతన సంప్రదాయాలకు, ఆధునిక జీవన శైలికి నిలయమైన హనోయ్ పట్టణం చారిత్రక ఆలయాలు, రుచికరమైన వీధి భోజనాలు వంటి అనేక విశేషాలను పర్యాటకులకు అందిస్తోంది. అక్కడి నుంచి హా లాంగ్ బే, సాపా, నిన్ బిన్ వంటి ప్రకృతి సౌందర్యాలను కూడా సులభంగా సందర్శించవచ్చు.

ఈ నూతన ప్రత్యక్ష విమాన సేవలతో భారత్-వియత్నాం మధ్య పర్యాటక రంగం మరింత బలోపేతం కానుంది. భారతీయులు వియత్నాం సంస్కృతిని, ప్రకృతి అందాలను తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో అనుభవించవచ్చు. వియత్నాం ప్రభుత్వం భారత పౌరులకు ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది.

దీనితో, జీహెచ్‌ఐఏఎల్ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని దేశాలతో హైదరాబాద్ నగరాన్ని అనుసంధానించేందుకు మరో ముందడుగు వేసినట్లయింది. ఇది తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, దానికి పొరుగు రాష్ట్రాల ప్రయాణికులకూ భారీ ప్రయోజనం చేకూర్చే అవకాశముంది.

హైదరాబాద్ నుంచి హానోయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించడాన్ని పురస్కరించుకుని జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ పనిక్కర్ మాట్లాడుతూ – "వియత్నాం ప్రస్తుతం భారతీయుల ప్రయాణ ఆలోచనలలో ప్రముఖ గమ్యస్థానంగా మారుతోంది. ఈ నూతన నేరుగా సేవ ద్వారా దక్షిణ భారతం నుంచి విహారయాత్రలు చేయాలనుకునే వారు, వ్యాపార ప్రయాణికులు కొత్త అవకాశాలను ఆస్వాదించగలుగుతారు. అంతేకాక, ఇది మన మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది," అని తెలిపారు.

వియత్నాం ఎయిర్‌లైన్స్‌ ఇండియా కంట్రీ మేనేజర్ శ్రీ గుఎన్ ట్రుయంగ్ హ్యూ మాట్లాడుతూ –
"హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి నేరుగా విమాన సర్వీసులు అందించగలగడం మా సంస్థకు గర్వకారణం. ఇది దక్షిణ భారతదేశ ప్రాముఖ్యతను మరింతగా హైలైట్ చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల నుంచి అందిస్తున్న మా సేవలకు ఇది విలువైన అనుబంధం అవుతుంది. ఈ కొత్త మార్గం, భారత్-వియత్నాం మధ్య అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచనుంది," అని చెప్పారు.

"వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు భారత్‌లో జీఎస్ఏగా పనిచేయడం మాకు గౌరవంగా ఉంది. మేము కొత్త మార్గాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ వంటి కీలక నగరానికి ఈ విమాన సర్వీసు ద్వారా వ్యాపార, పర్యాటక, సాంస్కృతిక పరస్పర సంబంధాలకు కొత్త వేదికను అందిస్తున్నాం," అని ఏరోప్రైమ్ గ్రూప్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com