పాటల వెన్నెల-సిరివెన్నెల
- May 20, 2025
ఆయన అక్షరం తెలుగు పాటకు వెలుగు బాట. వెండితెరమీద పాటల పందిరికి పెనవేసుకున్న బంధం.అక్షర తూణీరం. అక్షయ గాండీవం. ప్రాణనాడులను తట్టిలేపిన ప్రణవనాదం. మూగబోయిన మనసు తాకిన మధుర తుషారం. ఆ కలం నుంచి వెలువడిన ప్రతిపాటా సీతారామ శాస్త్రీయం. ఆయన మాటలు పేర్చే 'పదా'నిధి. సాహితీ సంపన్నుడు. పాటల సిరిసంపన్నుడు. ఆయనే సిరి వెన్నెల సీతారామశాస్త్రి. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....
సిరి వెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. 1955 మే 20న అవిభక్త విశాఖ జిల్లా అనకాపల్లి. తీయని బెల్లం ఘుమఘుమలతో మనసులాగే ఊరు. అదే అనకాపల్లి తీయటి పాటల గనికి, విజ్ఞాన ఖనికి జన్మనిచ్చింది. ఆ ఊరిలో డాక్టర్ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడం వల్ల ఎంబీబీఎస్ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ, ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడం వల్ల అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావటం వల్ల రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు 'అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు' అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు.
అప్పటికే సీతారామశాస్త్రి భరణి పేరుతో కవితలు రాసేవారు. అలా ఆయన రాసిన 'గంగావతరణం' కవిత విశ్వనాథ్ దృష్టికి వచ్చింది. సీతారామశాస్త్రి పాండిత్య ప్రతిభకు అప్రతిభులయ్యారు. విధాత తలచాడు కావచ్చు. కాశీనాథుని విశ్వనాథ్ సిరివెన్నెల తీశారు. సీతారాముని విద్వత్తుకు మెచ్చి పాటలన్నీ ఆయన చేతనే రాయించారు. అతడే పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధుడయ్యాడు. సినీవినీలానికి వెన్నెలయ్యాడు. అలా తొలి పాట ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. క్షణాల్లో పాట రాసే సిరివెన్నెల ఈ గీత రచనకు వారంరోజుల వ్యవధి తీసుకున్నారంటే ఆ అక్షరమధనానికి పడిన తపన అర్ధం చేసుకోవచ్చు. సిరివెన్నెలలో వెన్నెల కురిపించారు.
సిరివెన్నెల సీతారామశా స్త్రి సినీ రంగానికి వచ్చినప్పుడు .. సినీరంగంలో ఆత్రేయ, సినారె, వేటూరి పాటలు రాస్తున్నారు. ఒక కొత్త పాట వస్తే కొత్తగానే ఉండాలి. హత్తుకునేలా అన్పించాలి. ఆత్రేయ, వేటూరి, సినారెలా ఫలానా పాటలే సిరివెన్నెల అద్భుతంగా రాయగలరు అనే ముద్ర పడలేదు. అక్షర కృషీవలుడు సిరివెన్నెల సందర్భోచితంగా నేపథ్యాన్ని, ప్రత్యేక సందర్భాన్ని అధ్యయనం చేశాక పాటరాసేవారు. ఆయా పారిభాషిక పదాలతో పరకాయప్రవేశం చేసినట్లు రాశారు.
1988లో వచ్చిన 'కళ్లు' సినిమాలో ' తెల్లారింది లెగండోయ్' జాతికి మేల్కొలుపు గీతం. మనం మనం కలిస్తేనే జనం. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. చొరవగా వెళితేనే ఫలితం అని చాటుతున్న గీతం అంకురం చిత్రంలో రేవతి అభినయించిన పాట. ఆదిత్య -369లో జాణవులే పాట ఒక సొంపైన పాట. అదే ఏడాది విడుదలైన క్షణక్షణంలో .. అందనంత ఎత్తారా?.. తారాతీరం సంగతేంటొ చూద్దాంరా.. పాట సిరివెన్నెల సాహితీ విద్వత్తుకు దర్పణం.
సామవేద సారాన్ని వివరించిన ఇదే సీతారామశాస్త్రి ఆ తర్వాత మరో సినిమాలో ఒక అల్లరి వల్లరి గీతం రాశారు. 1989 లో విడుదలైన శివ చిత్రం నాటి కుర్రకారుకు కిక్ ఎక్కించింది. అందులో బోటనీ పాఠమా, మ్యాటనీ ఆటనా? కుర్రకారుతో గంతులేయించిందీ సిరివెన్నెల సీతారాముడే. వెంకటేశ్, విజయశాంతి నటించిన ఓ సినిమా పేరు శత్రువే కానీ పాటలన్నీ మృదుల, మధురంగా ఉన్నాయి.
రాజ్-కోటి మృదుమధుర స్వరాలలో ప్రవహించిన పాట.. 'పొద్దున్నే పుట్టిందీ చందమామ' చక్కని పాట. చిరంజీవి, విజయశాంతి నటించిన 'రౌడీ అల్లుడు' కోసం బప్పీ లహరి స్వరాలలో బాలు, చిత్ర మధురగానం చిలుకా క్షేమమా. 2000 సంవత్సరంలో వచ్చిన 'నువ్వేకావాలి' సినిమాలో సిరివెన్నెల రాసిన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడంవెందుకో కదిలించే పాట. ఇదే చిత్రంలో ' అనగనగా ఆకాశం ఉంది పాట యువహృదయాలకు గిలిగింత. చక్కలిగింత.
నాటి తరమైనా, నేటి తరమైనా...మేటిపాటలిచ్చిన సిరివెన్నెల తనకు తానే సాటి. తరాలను అధిగమించిన అక్షర మాంత్రికుడు. గిలిగింతల గీతాలిచ్చినా, పెద్ద హీరోలకీ పాటలిచ్చారు. పడుచు హీరోలకూ ప్రేమ మంత్రపుష్పాలు రాశారు. మనసంతా నువ్వే చిత్రంలో అందమైన బాల్యానికి అమూల్య ఆవిష్కరణ తూనీగా తూనీగా పాట. ఆనందం సినిమాలో హీరో ఆకాశ్, హీరోయిన్ రేఖ అభినయించిన తెరిచినా, కనులు మూసినా కలలు ఆగలేదా గీతం అద్భుత అభివ్యక్తి.
అన్యాయాలను ఎదిరించే నలుగురు యువకుల కథ యువసేన. ఇందులో హీరో భరత్, హీరోయిన్ గోపిక అభినయించిన మల్లీశ్వరివే.. గీతం అద్భుతం. కేరళవెళ్లో, కోనసీమ వెళ్లో పాప్ గీతం పాడుకున్నట్లుంది. భావ గాంభీర్యత, శబ్ద గాఢత అద్ది..అక్షరాలతో పదక్రీడలు సాగించే లిటరరీ స్పోర్ట్స్ పర్సన్ సిరివెన్నెల.
సిరివెన్నెల కలం అదను చూసి పదునుగా, హృద్యంగా రాసిన తాత్విక గీతం చక్రం చిత్రంలో 'జగమంత కుటుంబం నాది..' పాటల్లో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అద్భుతంగా, ఊహకందనివిగా ఉంటాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన అంతం చిత్రంలో గుండెల్లో దడదడలాడే ..అనే గీతం ఇందుకు నిదర్శనం.
1996 లో విడుదలైన క్రిమినల్ చిత్రంలో తెలుసా..మనసా అనే పాట అత్యధిక ప్రేక్షకాదరణ పొందింది. అనంతమైన ప్రేమలో ఐక్యం కావటానికి తరిమిన ఆరు కాలాలు. ఏడులోకాలుచేరలేని ఒడిలో అనటం ఊహకందని భావన. ..ఓ మామూలు గీతంలో అర్ధవంతమైన మాటలు ఇమడ్చటం సిరివెన్నెలకే చెల్లింది. అదే ఏడాది పవిత్రబంధంలో సిరివెన్నెల రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మపాట అలరించింది.
సిరివెన్నెల తెలుగు పాటను సుసంపన్నం చేశారు. మూడు వేలకు పైగా పాటలు రాశారు. ఆదిబిక్షువును ఏమీ కోరలేదు. కానీ ఆ పరమశివుడు మురిసిపోయి 11 నంది పురస్కారాలు పంపించారు. అలాగే, ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరగా నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో రెండు పాటలు రాశారు. అవే ఆయన చివరి పాటలు కావడం విషాదకరం. న్యూమోనియాతో బాధపడుతూ 2021, నవంబర్ 21న భాగ్యనగరంలో తన 66వ ఏట మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







