వైజాగ్ లో 'యాంటీ డ్రగ్ పార్క్'

- June 02, 2025 , by Maagulf
వైజాగ్ లో \'యాంటీ డ్రగ్ పార్క్\'

విశాఖపట్నం: విశాఖపట్నంలో సరికొత్త ఆవిష్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో “యాంటి డ్రగ్ పార్క్” ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.సెంట్రల్ పార్క్‌లోని రెండు ఎకరాల భూమిలో మూడు కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ పార్క్ నిర్మాణం జరగనుంది.డ్రగ్స్‌ దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ పార్క్ ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పార్క్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు తెలియజేసి కౌన్సిలింగ్ కేంద్రాలు

ఈ పార్క్‌లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు స్పష్టంగా తెలియజేసేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు బానిసలైనవారికి పునరావాస సదుపాయాలుగా కూడా ఈ పార్క్ పనిచేయనుంది. “పార్క్ ఆఫ్ లైఫ్” కాన్సెప్ట్‌తో డ్రగ్‌లేని జీవితం ఎంత అందంగా, శాంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా చూపించబోతున్నారు. పచ్చదనం, విద్యుత్ కాంతుల మొక్కలు, రంగురంగుల చెట్లు, సీతాకోకచిలుకల మోడల్స్, వాటర్ ఫౌంటెన్స్ వంటి అంశాలు ఈ పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్

ఈ యాంటి డ్రగ్ పార్క్ యువతకు ఒక బలమైన సందేశాన్ని అందించడమే కాకుండా, విశాఖపట్నం నగరానికి మరో కొత్త ఆకర్షణగా మారనుంది.సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్ కార్యక్రమాలు చేపడతామని విఎంఆర్డిఏ తెలిపింది.యువగళం పాదయాత్రలో ఈ ఆలోచనకు బీజం పడగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రణవ్ గోపాల్ అన్నారు. వియత్నామ్ వంటి దేశాలలో మాదక ద్రవ్యాలపై ప్రజల చైతన్యానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతో ఫలప్రదంగా మారిన దృష్ట్యా, ఈ యాంటి డ్రగ్ పార్క్ కూడా మంచి మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com