ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్

- July 19, 2026 , by Maagulf
ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్

అమ్మాన్: జోర్డాన్‌ పై కొనసాగుతున్న క్షిపణి దాడులు, ఇరాన్ అధికారుల రెచ్చగొట్టే వ్యాఖ్యల పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, అమ్మాన్‌లోని ఇరాన్ తాత్కాలిక రాయబారి (Chargé d’Affaires)ను జోర్డాన్ విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం పిలిపించింది.

జోర్డాన్ అధికారిక వార్తా సంస్థ పెట్రా (Petra) వెల్లడించిన వివరాల ప్రకారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫువాద్ మజాలి మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వం తక్షణమే అన్ని దాడులను నిలిపివేయాలని స్పష్టమైన సందేశాన్ని టెహ్రాన్‌కు చేరవేయాలని రాయబారిని ఆదేశించినట్లు తెలిపారు.

జోర్డాన్ భద్రత, దేశ పౌరుల రక్షణ తమకు ఎర్రగీత (Red Line) వంటివని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించేందుకు అనుమతించబోమని మజాలి స్పష్టం చేశారు.

జోర్డాన్ భూభాగంపై ఇరాన్ జరుపుతున్న దాడులు దేశ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడులని, అవి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్‌కు ఘోర ఉల్లంఘన అని జోర్డాన్ ప్రభుత్వం ఖండించింది.

అదేవిధంగా, గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను కూడా జోర్డాన్ తీవ్రంగా ఖండించింది. బహ్రెయిన్, కువైట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవి తీసుకుంటున్న చర్యలకు జోర్డాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

దేశ భూభాగం, సార్వభౌమాధికారం, ప్రజల భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను జోర్డాన్ ప్రభుత్వం కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com