చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామన్న సీఎం చంద్రబాబు
- August 07, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
చేనేత కార్మికులు చిన్న వయస్సులోనే అనారోగ్యాలకు లోనవుతారని పేర్కొంటూ, పెన్షన్ వయసును 50 ఏళ్లకే తగ్గించినట్లు సీఎం ప్రకటించారు.ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చేనేతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తూ, రాజధాని అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇది యువతకు చేనేత వైభవాన్ని పరిచయం చేయడంలో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం చేనేత అని గుర్తు చేస్తూ ,గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్లు రుణంగా ఇవ్వడం, 100 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ప్రయోజనాలు అందించామని ఆయన తెలిపారు. 90,765 కుటుంబాలు ఈ సౌకర్యాలను పొందినట్లు వివరించారు.
మరమగ్గాల కార్మికులకూ పూర్తి మద్దతుగా నిలుస్తున్నామని సీఎం తెలిపారు. రూ. 80 కోట్లు కేటాయిస్తూ 50 శాతం సబ్సిడీతో మరమగ్గాలు అందించనున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందని, భవిష్యత్తులో 500 యూనిట్లకు పెంపు చేయనున్నట్లు చెప్పారు. దీని వల్ల 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవిత, ఇతర ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలన్నీ చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు కీలకంగా నిలుస్తాయని వారికి నమ్మకముందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!









