ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీయులు
- August 14, 2025
అమరావతి: సౌదీ అరేబియాలో సంఖ్యాపరంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ, సంఘాల పరంగా చాలా కాలం నిమిత్తమాత్రంగానే ఉన్న తెలుగు ప్రవాసీ లోకం, ఇటీవల ఒక్కసారిగా చురుకుగా మారి సౌదీ మాత్రమే కాకుండా అన్ని గల్ఫ్ దేశాలలోనూ విశేషమైన ప్రాధాన్యం సంపాదించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కష్టకాలంలో ఉన్న తోటి తెలుగు వారికి సాయం అందించడంలోనూ ముందుండి, “మానవ సేవే మాధవ సేవ” అనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న సాటా, సాటా సెంట్రల్ వంటి తెలుగు ప్రవాసీ సంఘాలు ఈ కీర్తి అందుకున్నాయి.
రాజకీయ పరంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు అన్ని పార్టీల అభిమానులు కూడా ఈ సంఘాలలో చురుకుగా పాల్గొంటున్నారు. రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా పనిచేస్తున్న సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సాటా సెంట్రల్ కీలక నాయకుడు, ఒంగోలు నగరానికి చెందిన ముజ్జమ్మీల్ షేఖ్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గడ్డం శిల్పతో కలిసి సీఎం చంద్రబాబుకు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పరిస్థితులు, వారి సేవా కార్యక్రమాలను వివరించారు.
సువిశాల ఎడారి దేశంలో తెలుగువారికి ఒక ఆశాకిరణంలా సాటా సెంట్రల్ పనిచేస్తోందని, భారతీయ ఎంబసీ మరియు సౌదీ ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ సంస్థతో సమన్వయంగా పని చేస్తున్నామని ముజ్జమ్మీల్ షేఖ్ తెలిపారు. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ అందిస్తున్న సహకారం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో మహిళల పాత్ర ప్రాముఖ్యాన్ని గడ్డం శిల్ప సీఎం చంద్రబాబుకు వివరించారు. కొన్ని రోజుల క్రితం తాను కలిసిన శిల్పను గుర్తు పట్టిన ముఖ్యమంత్రి, ఆమెను అభినందించి, సౌదీ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని స్వీకరించారు. పార్టీ పునాదులను బలపరచడం, తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించడంలో ప్రవాసీ మహిళలు మరింత చురుకుగా ఉండాలని సీఎం సూచించారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









