తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు!
- August 19, 2025
హైదరాబాద్: తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రెండు నగరాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. 253 ఎకరాల భూమికి రూ.205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు పట్ల తన కట్టుబాటును స్పష్టంగా చూపించింది. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి మొదట చిన్న విమానాలకే పరిమితం చేయాలనుకున్నారు. కానీ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఏఏఐ పెద్ద విమానాలు, కార్గో ఫ్లైట్లకూ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అంటే ఏ320, బోయింగ్ 737 లాంటి వాణిజ్య విమానాల రాకపోకలకు కూడా ఈ ఎయిర్పోర్ట్ సిద్ధమవుతుందన్నమాట.
ఈ ఏడాది చివర్లోనే పనులు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్లో ఇప్పటికే 362 ఎకరాల వాయుసేన స్థలం ఉంది. దానిని వినియోగించుకుంటూ మిగతా భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఏఏఐ వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ఎయిర్పోర్టును కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ ప్రభుత్వం 2027 జూన్ నాటికే పనులు పూర్తయ్యేలా కసరత్తు చేస్తుండగా, కేంద్రం డిసెంబర్ వరకు గడువు పెట్టినట్లు సమాచారం. రెండు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణలో వాయు ప్రయాణం మరింత విస్తరించనుంది. వరంగల్ విమానాశ్రయానికి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం కాలంలోనే ఇక్కడి నుంచి విమానాలు ఎగిరాయి. భారత్ చైనా యుద్ధ సమయంలో కీలకమైన సేవలు అందించాయి.
కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ఎయిర్పోర్ట్ మూతపడే ఉంది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలనే ప్రయత్నం విజయవంతమైతే, వరంగల్ వాసుల కల నిజమవుతుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్కి ఈ ప్రాజెక్టు కొత్త ఊపును తీసుకురానుంది. ఈ రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే, తెలంగాణలో పర్యాటకానికి, వాణిజ్యానికి, పరిశ్రమలకు పెరుగుదల ఖాయం.
ప్రత్యేకంగా వరంగల్లో ఐటీ, ఎడ్యుకేషన్, హ్యాండ్లూమ్ రంగాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఆదిలాబాద్లో ఖనిజ, అటవీ సంపద ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి ఈ రెండు ప్రాజెక్టులు తెలంగాణ రవాణా రంగానికే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త రెక్కలు ఇస్తాయని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









