పంజాబ్ లో గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి

- August 24, 2025 , by Maagulf
పంజాబ్ లో గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి

పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్ జిల్లాలోని మండియాలలో శుక్రవారం రాత్రి ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ఒక ట్రక్కును ఢీకొట్టడంతో తీవ్ర విషాదం మిగిలింది. ఢీకొన్న కొద్దిసేపటికే ట్యాంకర్‌లోని గ్యాస్ లీకై, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పేలుడు సంభవించింది.

ప్రాథమికంగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన పలువురు ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఆదివారానికి మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై హోషియార్‌పూర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందించారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మంటలను అదుపులోకి తేవడానికి గంటల పాటు ప్రయత్నాలు జరిపినట్లు చెప్పారు.

ట్రక్కును ఢీకొట్టిన తర్వాత ట్యాంకర్‌లో గ్యాస్ లీక్ కావడం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్యాస్ లీకేజీ తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వారు వెల్లడించారు.

ప్రమాదంలో గాయపడిన వారిని పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ స్వయంగా ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com